‘రాజ్యసభలో టీడీపీని బీజేపీలో విలీనం చేయండి’ - వెంకయ్య నాయుడిని కోరిన సుజనా, సీఎం రమేశ్, గరికపాటి, టీజీ

వెంకయ్య నాయుడుతో టీడీపీ ఎంపీలు

రాజ్యసభలోని తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని కోరుతూ నలుగురు తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడును కోరారు.

ఈ మేరకు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో వెంకయ్య నాయుడును కలిసి స్వయంగా లేఖ ఇచ్చారు.

ఈ లేఖలో ఏం రాశారంటే..

‘‘ఈరోజు రాజ్యసభలో తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ నాయకుడు వైఎస్ చౌదరి, ఉప నాయకుడు సీఎం రమేశ్‌ల ఆధ్వర్యంలో భేటీ అయ్యాం. నరేంద్ర మోదీ నాయకత్వ ప్రోత్సాహంతో.. దేశ సమగ్ర ప్రయోజనాల కోసం ఆయన చేపట్టిన అభివృద్ధి విధానాల స్ఫూర్తితో.. భారత రాజ్యంగంలోని పదవ షెడ్యూల్ పేరాగ్రాఫ్ 4 కింద తక్షణం భారతీయ జనతా పార్టీలో విలీనం కావాలని నిర్ణయించాం.

తదనంతర నిశిత చర్చల నేపథ్యంలో ఈ విధంగా తీర్మానం చేశాం..

  • భారత రాజ్యంగంలోని పదవ షెడ్యూల్ పేరాగ్రాఫ్ 4 కింద తక్షణం భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ విలీనం చేయాలని
  • ఈ విలీనాన్ని ఆమోదించాల్సిందిగా రాజ్యసభ ఛైర్మన్‌ను కోరాలని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడికి లేఖ రాయాలని
  • భారత రాజ్యంగంలోని పదవ షెడ్యూల్ పేరాగ్రాఫ్ 4 కింద తక్షణం భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ విలీనాన్ని ఆమోదించాలని, మమ్మల్ని బీజేపీ లెజిస్లేచర్ పార్టీలో భాగంగా గుర్తించాలని రాజ్యసభ ఛైర్మన్‌ను కోరాలని

తెలుగుదేశం పార్టీ రాజ్యసభాపక్ష నాయకుడు వైఎస్ చౌదరి, ఉప నాయకుడు సీఎం రమేశ్, ఎంపీలు గరికపాటి మోహనరావు, టీజీ వెంకటేశ్ ఈ లేఖపై సంతకాలు చేశారు.

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు వెంకయ్య నాయుడుకు రాసిన లేఖ
ఫొటో క్యాప్షన్, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు వెంకయ్య నాయుడుకు రాసిన లేఖ
వెంకయ్య నాయుడు, జేపీ నడ్డా
వెంకయ్య నాయుడుతో టీడీపీ ఎంపీలు

‘‘ఇక వీళ్లు బీజేపీ సభ్యలు’’

కాగా, రాజ్యసభలోని తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేసేందుకు తాము సమ్మతిస్తున్నామంటూ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కూడా వెంకయ్య నాయుడుకు లేఖ ఇచ్చారు.

వీరిని పార్టీ కార్యాలయంలో కండువాలు కప్పి చేర్చుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘సుజనా, రమేశ్, టీజీ, మోహనరావులు చాలా కాలంగా ఈ విషయం గురించి ఆలోచిస్తున్నారు. మోదీ నాయకత్వంలో దేశాభివృద్ధికి చేపట్టిన చర్యలు, అమిత్ షా వ్యవస్థీకృత నైపుణ్యాలతో పార్టీ ఎదిగిన తీరు చూసి ఏపీ అభివృద్ధి కోసం, సానుకూల దృక్ఫథంతో బీజేపీలో విలీనం కావాలని భావించారు. ఈ రోజు ఉదయమే చర్చ జరిగింది. తమ పార్టీని బీజేపీలో విలీనం చేయాలనుకుంటున్నట్లు వారు చెప్పారు. ఈ మేరకు అమిత్ షాతో చర్చించి చర్యలు తీసుకున్నాం. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడును కలిసి లేఖ కూడా ఇచ్చాం. టీడీఎల్పీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు వారు, స్వీకరిస్తున్నట్లు మేమూ వెంకయ్యకు లేఖలు ఇచ్చాం. ఇక వీళ్లు బీజేపీ సభ్యలు. భారతీయ జనతా పార్టీ సానుకూల, సమీకృత రాజకీయాలను విశ్వసిస్తుంది. అందరితో పాటు, అందరి అభివృద్ధి, అందరి విశ్వాసం.. అలా అందరి విశ్వాసంతో ముందుకెళ్తున్నాం. నాకు నమ్మకం ఉంది.. ఈ నలుగురూ ఏపీలో క్షేత్రస్థాయి నాయకులు. వీరితో పాటు సానుకూలంగా పనిచేస్తే ఏపీలో బీజేపీకి మద్దతు లభిస్తుంది. తద్వారా ఏపీలో బీజేపీని బలోపేతం చేస్తాం’’ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)