‘రాజ్యసభలో టీడీపీని బీజేపీలో విలీనం చేయండి’ - వెంకయ్య నాయుడిని కోరిన సుజనా, సీఎం రమేశ్, గరికపాటి, టీజీ

రాజ్యసభలోని తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని కోరుతూ నలుగురు తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడును కోరారు.
ఈ మేరకు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో వెంకయ్య నాయుడును కలిసి స్వయంగా లేఖ ఇచ్చారు.
ఈ లేఖలో ఏం రాశారంటే..
‘‘ఈరోజు రాజ్యసభలో తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ నాయకుడు వైఎస్ చౌదరి, ఉప నాయకుడు సీఎం రమేశ్ల ఆధ్వర్యంలో భేటీ అయ్యాం. నరేంద్ర మోదీ నాయకత్వ ప్రోత్సాహంతో.. దేశ సమగ్ర ప్రయోజనాల కోసం ఆయన చేపట్టిన అభివృద్ధి విధానాల స్ఫూర్తితో.. భారత రాజ్యంగంలోని పదవ షెడ్యూల్ పేరాగ్రాఫ్ 4 కింద తక్షణం భారతీయ జనతా పార్టీలో విలీనం కావాలని నిర్ణయించాం.
తదనంతర నిశిత చర్చల నేపథ్యంలో ఈ విధంగా తీర్మానం చేశాం..
- భారత రాజ్యంగంలోని పదవ షెడ్యూల్ పేరాగ్రాఫ్ 4 కింద తక్షణం భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ విలీనం చేయాలని
- ఈ విలీనాన్ని ఆమోదించాల్సిందిగా రాజ్యసభ ఛైర్మన్ను కోరాలని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడికి లేఖ రాయాలని
- భారత రాజ్యంగంలోని పదవ షెడ్యూల్ పేరాగ్రాఫ్ 4 కింద తక్షణం భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ విలీనాన్ని ఆమోదించాలని, మమ్మల్ని బీజేపీ లెజిస్లేచర్ పార్టీలో భాగంగా గుర్తించాలని రాజ్యసభ ఛైర్మన్ను కోరాలని
తెలుగుదేశం పార్టీ రాజ్యసభాపక్ష నాయకుడు వైఎస్ చౌదరి, ఉప నాయకుడు సీఎం రమేశ్, ఎంపీలు గరికపాటి మోహనరావు, టీజీ వెంకటేశ్ ఈ లేఖపై సంతకాలు చేశారు.



‘‘ఇక వీళ్లు బీజేపీ సభ్యలు’’
కాగా, రాజ్యసభలోని తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేసేందుకు తాము సమ్మతిస్తున్నామంటూ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కూడా వెంకయ్య నాయుడుకు లేఖ ఇచ్చారు.
వీరిని పార్టీ కార్యాలయంలో కండువాలు కప్పి చేర్చుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘సుజనా, రమేశ్, టీజీ, మోహనరావులు చాలా కాలంగా ఈ విషయం గురించి ఆలోచిస్తున్నారు. మోదీ నాయకత్వంలో దేశాభివృద్ధికి చేపట్టిన చర్యలు, అమిత్ షా వ్యవస్థీకృత నైపుణ్యాలతో పార్టీ ఎదిగిన తీరు చూసి ఏపీ అభివృద్ధి కోసం, సానుకూల దృక్ఫథంతో బీజేపీలో విలీనం కావాలని భావించారు. ఈ రోజు ఉదయమే చర్చ జరిగింది. తమ పార్టీని బీజేపీలో విలీనం చేయాలనుకుంటున్నట్లు వారు చెప్పారు. ఈ మేరకు అమిత్ షాతో చర్చించి చర్యలు తీసుకున్నాం. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడును కలిసి లేఖ కూడా ఇచ్చాం. టీడీఎల్పీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు వారు, స్వీకరిస్తున్నట్లు మేమూ వెంకయ్యకు లేఖలు ఇచ్చాం. ఇక వీళ్లు బీజేపీ సభ్యలు. భారతీయ జనతా పార్టీ సానుకూల, సమీకృత రాజకీయాలను విశ్వసిస్తుంది. అందరితో పాటు, అందరి అభివృద్ధి, అందరి విశ్వాసం.. అలా అందరి విశ్వాసంతో ముందుకెళ్తున్నాం. నాకు నమ్మకం ఉంది.. ఈ నలుగురూ ఏపీలో క్షేత్రస్థాయి నాయకులు. వీరితో పాటు సానుకూలంగా పనిచేస్తే ఏపీలో బీజేపీకి మద్దతు లభిస్తుంది. తద్వారా ఏపీలో బీజేపీని బలోపేతం చేస్తాం’’ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- LIVE: బీజేపీ కార్యాలయంలో టీడీపీ ఎంపీల ప్రెస్ మీట్
- టీడీపీ ఎంపీలు: ‘అవును.. బీజేపీలో చేరుతున్నాం’ - సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్
- మహాకూటమి చంద్రబాబు వల్ల నష్టపోయిందా?
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: నారా చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం
- అభిప్రాయం: చంద్రబాబు అంటేనే కూటమి రాజకీయాలు
- బీజేపీకి ఇది స్వర్ణయుగమా?
- మోదీ-అమిత్ షా ద్వయాన్ని ఎదుర్కోగల ప్రతిపక్షమేదీ?
- టీకాలు ఎలా పనిచేస్తాయి? టీకాల విజయం ఏమిటి? టీకాలపై కొందరిలో సంశయం ఎందుకు?
- ప్రపంచకప్ నుంచి శిఖర్ ధావన్ ఔట్
- 14 ఏళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు ఉత్తర కొరియాకు ఎందుకు వెళ్తున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








