అభిప్రాయం: చంద్రబాబు అంటేనే కూటమి రాజకీయాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డానీ
- హోదా, బీబీసీ తెలుగు కోసం
జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) నుండి తెలుగుదేశం పార్టీ (టిడిపి) బయటికి రావడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త దశ ఆరంభమయింది. ఇది జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తుంది. అలాంటి పరిణామాలు అప్పుడే మొదలయిపోయాయి.
టిడిపి చరిత్రంతా రాజకీయ కూటముల చరిత్రే అన్నా అతిశయోక్తికాదు. కనీసం చంద్రబాబుకు సంబంధించినంత వరకు ఇది నిజం. 1950వ దశకంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కాంగ్రెస్, కమ్యూనిస్టుల చుట్టూ తిరిగేవి. ఆ తరువాత రాష్ట్ర రాజకీయాల్లో వామపక్షాల ప్రాబల్యం క్రమంగా తగ్గిపోయి ఒక రకం రాజకీయ శూన్యత ఏర్పడింది. ఆ శూన్యతను పూరించడానికే ఎన్టీ రామారావు నాయకత్వాన తెలుగు దేశం పార్టీ ఏర్పడింది. పుట్టుక నుండే టిడిపి రాజకీయంగా కాంగ్రెస్కు, సిద్ధాంతపరంగా కేంద్ర ఆధిపత్యానికి వ్యతిరేకం. తొలి ఎన్నికలలోనే కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవాలని రామారావు భావించారు. కమ్యూనిస్టులు ఎక్కువ బెట్టు చేయడంతో అది కుదరలేదు. మేనకా గాంధీకి చెందిన సంజయ్ విచార్ మంచ్ ఆ ఎన్నికల్లో టిడిపితో పొత్తు పెట్టుకుని ఐదు చోట్ల పోటీ చేసి నాలుగు చోట్ల గెలిచింది.
నాదెండ్ల భాస్కర రావు 1984 ఆగస్టులో గవర్నర్ రామ్లాల్ సహాయంతో ఎన్టీ రామారావును కుట్ర పద్ధతుల్లో గద్దె దించినపుడు కేంద్ర ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున 'ప్రజాస్వామ్య పునరుధ్ధరణ' ఉద్యమం సాగింది. అందులో, వామపక్షాలతో పాటు బీజేపీ కూడా చురుగ్గా పాల్గొంది. దేశంలో కాంగ్రెస్ వ్యతిరేకతకు ఎన్టీ రామారావు ఒక సంకేతంగా మారారు. అప్పట్లోనే ఆయన కాంగ్రెస్ వ్యతిరేక శక్తులతో విజయవాడలో శిఖరాగ్ర సదస్సు ఒకదాన్ని నిర్వహించారు. ఇందులో యంజీ రామచంద్రన్, ఫరూఖ్ అబ్దుల్లా, ప్రఫుల్లకుమార్ మహంతా, తదితర కాంగ్రెసేతర ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, TDP.Official/Facebook
ఎన్టీ రామారావు బీజేపీతో నేరుగా పొత్తు పెట్టుకోలేదు
ఇందిరా గాంధీ మరణం తరువాత జరిగిన 1984 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రికార్డు స్థాయిలో 404 స్థానాలు గెలుచుకుంది. అప్పటి లోక్సభలో 30 స్థానాలు గెలుచుకున్న టిడిపి ప్రధాన ప్రతిపక్షంగా మారింది. ఆ హోదాలోనే ఎన్టీ రామారావు ఛైర్మన్గా 1989లో జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర శక్తులతో నేషనల్ ఫ్రంట్ ఏర్పడింది. దానికి వి.పి. సింగ్ కన్వీనర్గా వున్నారు. రాజీవ్ గాంధీ పాలనలో అవినీతి పెరిగిపోయిదని ఆరోపిస్తూ ఆ ఏడాది జూన్ నెలలో టిడిపి లోక్సభ సభ్యులు రాజీనామాలు చేశారు. అయితే ఈ ప్రయోగం టిడిపికి కలిసి రాలేదు. 1989 లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి రెండు పార్లమెంటు స్థానాలు మాత్రమే దక్కాయి. రాష్ట్రంలో అధికారాన్ని కూడా కోల్పోయింది. అయితే, ఆ ఎన్నికల తరువాత కేంద్రంలో విపి సింగ్ను ప్రధానిగా ఎంచుకున్న నేషనల్ ఫ్రంట్కు ఎన్టీ రామారావు ఛైర్మన్గా కొనసాగారు.
మళ్ళీ 1994 ఎన్నికల్లో వామపక్షాలతో జతకట్టిన టిడిపి రాష్ట్రంలో ఘన విజయాన్ని సాధించింది. ఎందువల్లనోగానీ ఎన్టీ రామారావు ఎప్పుడూ బీజేపీతో నేరుగా పొత్తు పెట్టుకోలేదు.
ఎన్టీ రామారావు మీద తిరుగుబాటు చేసి 1995లో టిడిపి పగ్గాలు, ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడుకు మొదటి నుండీ కూటమి రాజకీయాలంటే ఆసక్తి ఎక్కువ. ఎన్నికల్ని ఒంటరిగా ఎదుర్కోవడానికి వారు జంకుతారనే మాట కూడా రాజకీయ వర్గాల్లో తరచుగా వినపడుతూ ఉంటుంది. 1995లో ఎన్నికలతో పనిలేకుండానే వారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్రమంలో వామపక్షాల మద్దతును కూడా తీసుకున్నారు.
1996 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 161 సీట్లతో అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించి, అటల్ బిహారీ వాజ్పేయి ప్రధాని అయ్యారు. అయితే, మేజిక్ ఫిగర్కు అవసరమైన సంఖ్యాబలాన్ని పుంజుకోలేక 13 రోజుల్లోనే ఆ ప్రభుత్వం పడిపోయింది. ఆ సందర్భంలో చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో ప్రవేశించి 13 పార్టీలతో ఏర్పడిన యునైటెడ్ ఫ్రంట్కు కన్వీనర్గా వ్యవహరించారు. కాంగ్రెస్, సిపియం బయటి నుండి ఇచ్చిన మద్దతుతో యునైటెడ్ ఫ్రంట్ అధికారాన్ని చేపట్టింది. హెచ్.డి. దేవెగౌడ, ఐకే గుజ్రాల్లను ప్రధానులు చేయడంలో చంద్రబాబు చక్రం తిప్పారు.
1998 ఎన్నికల తరువాత వాజ్పేయి నాయకత్వంలో ఏర్పడిన జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్డీఏ) అధికారాన్ని చేపట్టడంలోనూ చంద్రబాబే చక్రం తిప్పారు. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా హైదరాబాద్లో విమానం ఎక్కిన చంద్రబాబు ఢిల్లీలో విమానం దిగగానే ఎన్డీయే కన్వీనర్గా మారిపోయారు.

ఫొటో సోర్స్, TDP/BJP
బహుశా చంద్రబాబు ఒంటరిగా ఎదుర్కొనే తొలి ఎన్నికలు..
చంద్రబాబు స్వీయ నాయకత్వంలో 1999లో ఎదుర్కొన్న తొలి అసెంబ్లీ ఎన్నికలు.. లోక్సభ ఎన్నికలతోపాటు జరిగాయి. చంద్రబాబు బీజేపీతో ముందస్తు పొత్తు కుదుర్చుకుని ఆ ఎన్నికల్లో పాల్గొన్నారు. అప్పటి కార్గిల్ యుద్ధం సెంటిమెంటు రెండు పార్టీలకూ కలిసి వచ్చింది. 2004లోను టిడిపి-బీజేపీ కలిసే పోటీ చేశాయి. ఆ ఎన్నికలు రెండు పార్టీలకూ కలిసిరాలేదు. కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో టిడిపి అధికారాన్ని కోల్పోయాయి. ఆ తరువాత ఇద్దరి మధ్య దూరం బాగా పెరిగింది. బీజేపీతో ఇంకెన్నడూ పొత్తు పెట్టుకోనని టిడిపి మహానాడు వేదిక నుండి చంద్రబాబు ఒక శపథం కూడా చేశారు.
2009లో చంద్రబాబు టీఆర్ఎస్, వామపక్షాలను కలుపుకుని మహా కూటమిని ఏర్పాటు చేశారు. ఆ ఎన్నికల్లో టిడిపి సంఖ్యాబలం పెరిగింది కానీ అధికారం చేజిక్కలేదు. వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోవడంతో 2014లో మళ్ళీ బీజేపితో జట్టు కట్టాలని చంద్రబాబు ఉవ్విళ్ళూరారు. బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోదీ గెలుపు గుర్రంగా కనిపించడం దీనికి ప్రధాన కారణం. అలాగే పార్టీకాని పార్టీలావున్న పవన్ కల్యాణ్ జనసేనతోనూ ఆయన పొత్తు పెట్టుకున్నారు.
ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కోవడానికి చంద్రబాబు జంకారుగానీ, బీజేపీతో జట్టు కట్టకపోయినా ఆ ఎన్నికల్లో టిడిపియే గెలిచి వుండేది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే జరిగి ..అసెంబ్లీ ఎన్నికల తరువాత కౌంటింగ్ జరిపిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఆ విషయాన్ని నిర్ధరించాయి. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ముందే జరిగిన ఆ ఎన్నికల్లో టిడిపికి స్పష్టమైన ఆధిక్యత లభించింది.
ఎన్డీఏ కూటమి నుండి ఇప్పుడు టిడిపి బయటికి వచ్చింది కనుక 2019 ఎన్నికలు బహుశా చంద్రబాబు ఒంటరిగా ఎదుర్కొనే తొలి ఎన్నికలు కావచ్చు.
ఇవి కూడా చదవండి:
- టీడీపీ-బీజేపీ మిత్రబేధం: రణమా.. ఎన్నికల వ్యూహమా?
- అవిశ్వాస తీర్మానం: అంటే ఏమిటి? ఏం జరుగుతుంది?
- ప్రత్యేక హోదా: తొమ్మిది మలుపులు
- ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు: బహుశా.. ఈ తరానికి పెద్దగా తెలియని చరిత్ర ఇది
- గ్రౌండ్ రిపోర్ట్: ‘‘భయపడొద్దమ్మా, జంతువులు నన్నేమీ చేయలేవు’’ అని చెప్పేవాడు.. సాటి మనుషులు చంపేశారు
- ఎడిటర్స్ కామెంట్: ఎవరికీ మరొకరిపై విశ్వాసం లేదు, ఈ అవిశ్వాస రాజకీయాలనెలా అర్థం చేసుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








