సొంత ఊళ్లకు వెళ్లాలంటే భయపడుతున్నారు

ఫొటో సోర్స్, Getty Images
మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతం ప్రతి వేసవిలోనూ తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. ఈ ఏడాది కూడా రుతుపవనాలు బలహీనంగా ఉండొచ్చన్న అంచనాల మధ్య ఇక్కడి చాలా గ్రామాలు ఇప్పటికే కరవుతో విలవిలలాడుతున్నాయి.
అలాగే, పశ్చిమ మహారాష్ట్రలో నీటి వసతి మెరుగ్గా ఉండే ప్రాంతాల్లో చెరకు తోటల్లో పని చేసేందుకు మరాఠ్వాడా నుంచి చాలా మంది కూలీలు ప్రతి ఏటా వలస వెళ్తుంటారు. సాధారణంగా వీరు పనులు పూర్తి కాగానే ఏప్రిల్లో తమ తమ గ్రామాలకు తిరిగి వెళ్తుంటారు. కానీ ఈసారి మాత్రం తమ స్వస్థలాల్లో నెలకొన్న నీటి కొరతకు భయపడి ఇక్కడి చెరకు తోటల్లోనే ఉండిపోతున్నారు.
బీబీసీ ప్రతినిధి రాహుల్ రణ్సుభే అందిస్తున్న వీడియో కథనం...
''1972 నాటి కరవు చాలా తీవ్రమైంది. మేం దాన్ని ఎదుర్కొన్నాం. ఇప్పడూ మేం కరవులోనే కొట్టుమిట్టాడుతున్నాం. ఈసారి పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది'' అని భివారాబాయి గంగే అనే మహిళ అన్నారు.
బారామతిలోని చెక్కెర కర్మాగారాల పని సీజన్ ముగిసింది. అయితే చెరకు కోత పనుల కోసం ఇక్కడికి వచ్చిన కూలీలు మాత్రం ఇంకా వెనక్కి వెళ్లలేదు. మరాఠ్వాడాలో నెలకొన్న తీవ్రమైన కరవు కారణంగా వీరు తమ స్వస్థలాలకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు.

''70 ఏళ్లుగా మేం ఇక్కడికి వస్తున్నాం. మాది బీడ్ జిల్లా ఆష్టీ తాలూకాలోని గాంగేవాడి గ్రామం. మా పిల్లలను కలవడానికి నేనిక్కడికి వచ్చాను. గతంలో నేను కూడా చెరకు కోత పనులకు వచ్చేదాన్ని. అదే పని ఇప్పుడు నా పిల్లలు చేస్తున్నారు. ఏం చెయ్యాలి? మేం పేదవాళ్లం. మాకున్న భూమి చాలా తక్కువ. నీటి సదుపాయం లేదు. ఈసారి మేం ఘోరమైన కరవును చవి చూస్తున్నాం'' అని వలస వచ్చిన తన పిల్లలను చూడటానికి బారామతి వచ్చిన భివారాబాయి గంగే అన్నారు.

చెరకు తోటల్లో అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు కోత పనులు జరుగుతుంటాయి. ఈ సీజన్లో సోమేశ్వర్ చెక్కర ఫ్యాక్టరీలో పని చేసేందుకు చాలామంది కూలీలు ఇక్కడికి వస్తుంటారు. అలా వచ్చిన వారిలో దత్తు పైసల్ కూడా ఒకరు.
''వెనక్కి వెళ్తే తీవ్రమైన నీటి కొరత కాబట్టి మేం ఇక్కడే ఉండిపోవాల్సి వస్తోంది. వర్షాలు పడితే మేం మా స్వస్థలానికి వెళ్లిపోయేవాళ్లం. ఇప్పడు అక్కడ ఎంత కరవు నెలకొని ఉందటే.. అసలు చెట్లపై ఆకులనేవే లేవు. వారానికి ఒక్కసారి వాటర్ ట్యాంకులొస్తాయి. ఆ నీరు మాకు వారం రోజులకు ఏ మాత్రం సరిపోదు. ఇక్కడున్న కాలువలో కొద్దిగా నీళ్లు పారుతున్నాయి. దాంతో మేం ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాం'' అని దత్తు చెప్పారు.

మరాఠ్వాడా నుంచి పశ్చిమ మహారాష్ట్రకు పెద్ద సంఖ్యలో కూలీలు వలస వస్తుంటారు. వీరిలో బీడ్ జిల్లానుంచి వచ్చే వారి సంఖ్యే ఎక్కువ.
''1972 అంటే అప్పటికి మా పిల్లలు చాలా చిన్నవాళ్లు. మేం అప్పుడు ఎన్నో బాధలు పడ్డాం. మట్టిలో పని చేస్తూ ప్రభుత్వం వాళ్లు అందించిన ఆహారంతో ప్రాణాలు నిలుపుకున్నాం. అవి భయంకరమైన రోజులు. ఈ ఏడాది మేం జొన్న పంట వేశాం. కానీ అది ఎండిపోయింది. అటు పంట చేతికి రాక, ఇటు నీళ్లు లేక.. ఎలా బతకాలో దిక్కుతోచడం లేదు'' అని భివారాబాయి గంగే ఆందోళన చెందుతున్నారు.
ఇవి కూడా చదవండి
- ఇండియాVsదక్షిణాఫ్రికా: రోహిత్ శర్మ సెంచరీ, 6 వికెట్ల తేడాతో భారత్ విజయం
- సనావుల్లా భారత సైనికుడా, విదేశీయుడా
- వైఎస్ జగన్మోహన్ రెడ్డి: కొత్త తరం నాయకుల ప్రతినిధి
- రెండు బిందెల నీళ్ల కోసం ప్రాణాలు పణంగా పెడుతున్నారు
- #BBCSpecial: ‘వ్యభిచారంలోకి మమ్మల్నిలా తోసేసినారు..’
- ‘100 మందిని చంపేసి నదిలో పడేశారు’.. సూడాన్ నరమేధం
- టిఫనీ ట్రంప్: ఇవాంకా తెలుసు.. మరి ఈమె తెలుసా
- అంతరించిపోతున్న జీవుల్లో అనంతపురం విషపు సాలీడు
- తియానన్మెన్ స్క్వేర్ నరమేధాన్ని సమర్థించిన చైనా మంత్రి, అసలు ఆరోజు ఏం జరిగింది
- ఎంపీలకు ప్రభుత్వ కార్లు ఉండవు.. అద్దె చెల్లిస్తేనే గవర్నమెంట్ క్వార్టర్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)










