ఎస్సీ ఎస్టీల పదోన్నతుల్లో రిజర్వేషన్: సుప్రీం కోర్టు ఏం చెప్పింది?

నిరసన

ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఉద్యోగం చేస్తున్న షెడ్యూల్డు కులాల (ఎస్సీ-ఎస్టీ) పౌరులకు పదోన్నతుల కోసం రిజర్వేషన్ మార్గం సుగమమైంది. సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం బుధవారం ఇచ్చిన కీలక తీర్పులో రాజ్యాంగంలో ప్రభుత్వ ఉద్యోగాలను పొందడంలో ఉన్న సమానత్వం నిబంధనలను అనుసరించి పదోన్నతిలో కూడా వారికి రిజర్వేషన్లు కల్పించవచ్చని చెప్పింది.

చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాతోపాటు జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ రోహింగ్టన్ నారీమన్, జస్టిస్ సంజయ్ కౌల్, జస్టిస్ ఇందూ మల్హోత్రాలతో కూడిన ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం దీనిపై విచారించింది. ఎం నాగరాజ్ వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో 2006లో అప్పటి రాజ్యాంగ ధర్మాసనం 'పదోన్నతుల్లో రిజర్వేషన్' కోసం ఇచ్చిన తీర్పుపై పునర్విచారణ జరపాల్సిన అవసరం ఉందా అన్నదానిపై కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించింది.

2006లో ఎం నాగరాజ్ వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో విచారణ చేసిన ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం... ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతుల విషయంలో ఎస్సీ-ఎస్టీ వర్గాలకు రాజ్యాంగంలో ఉన్న సెక్షన్ 16(4), 16(4బి) కింద రిజర్వేషన్ ఇవ్వవచ్చని తీర్పు చెప్పింది. కానీ రిజర్వేషన్‌లోని ఈ నిబంధనల్లో కొన్ని షరతులు జోడించిన కోర్టు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడం కోసం ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుందని చెప్పింది.

2006లో ఇచ్చిన తన తీర్పులో కోర్టు ఎస్సీ-ఎస్టీ వర్గాల కోసం పదోన్నతుల్లో రిజర్వేషన్ల నిబంధనలు ఏర్పరచడానికి ముందు, ఆ వర్గం ఎంత వెనకబడింది, వారి ప్రాతినిధ్యంలో ఎంత లోటుంది, పరిపాలన పనులపై ఎంత వ్యత్యాసం వస్తుంది అనేదానిపై ప్రభుత్వం తగిన గణాంకాలను సేకరించాల్సి ఉంటుందని తెలిపింది.

సుప్రీం కోర్టు

ఈ నిర్ణయం తర్వాత నుంచి సుప్రీంకోర్టులో దాఖలైన ఎన్నో ప్రజాహిత వ్యాజ్యాల ద్వారా దీనిపై పునర్విచారణ జరపాలని డిమాండ్ వస్తూ వచ్చింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, 2006 తీర్పును పునఃపరిశీలించేందుకు ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి అప్పగించాలని సుప్రీంకోర్టును కోరారు.

బుధవారం నాటి తీర్పు

2006 ఎం నాగరాజ్ వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో అప్పటి రాజ్యాంగ ధర్మాసనం ద్వారా ఇచ్చిన తీర్పు పునఃపరిశీలనకు దానిని మరో పెద్ద రాజ్యాంగ ధర్మాసనం దగ్గరికి పంపించాల్సిన అవసరం లేదని ఐదుగురు జడ్జిల ధర్మాసనం స్పష్టంగా చెప్పింది. కానీ ఇప్పుడు పదోన్నతుల్లో రిజర్వేషన్ల కోసం 2006లో తీర్పులో చెప్పిన నిర్దేశాలను పూర్తి చేయడానికి దానికి సంబంధించిన వివరాలు సేకరించాల్సిన అవసరం కూడా లేదని కోర్టు తెలిపింది.

ఎం నాగరాజ్ తీర్పు వచ్చిన 12 ఏళ్ల తర్వాత కూడా ఎస్సీ-ఎస్టీ వర్గాలకు ఉన్న సరిపడా ప్రాతినిధ్యానికి సంబంధించిన గణాంకాలను ప్రభుత్వం ఇప్పటివరకూ కోర్టు ముందు పెట్టలేకపోయింది అనేది కూడా చెప్పుకోవాలి. అందుకే ఈ వర్గాల పదోన్నతుల్లో రిజర్వేషన్ల ప్రక్రియపై అప్రకటిత నిలుపుదల ఉండిపోయింది.

నిరస

ఫొటో సోర్స్, Getty Images

కోర్టు బుధవారంనాడు 2006లో ఇచ్చిన తన మార్గదర్శకాలను కొట్టిపారేయడమే కాదు, నాగరాజ్ తీర్పులో ఇచ్చిన మార్గదర్శకాలు 1992లో ఇచ్చిన చారిత్రక ఇందిరా సహానీ తీర్పుకు వ్యతిరేకంగా ఉంటాయని చెప్పింది.

మండల్ కమిషన్ కేసుగా ప్రసిద్ధి చెందిన 1992 చరిత్రాత్మక ఇందిరా సహానీ తీర్పులో సుప్రీంకోర్టు 9 జడ్జిల బెంచ్ రాజ్యాంగ సభలో డాక్టర్ అంబేద్కర్ చేసిన ప్రకటన ఆధారంగా సామాజిక సమానత్వం, అవసరాల సమానత్వం సర్వోన్నతం అని చెప్పింది.

తీర్పుపై స్పందించిన బహుజన్ సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి... "ఈ తీర్పు వివరాలను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే దీనిపై ఏదైనా కచ్చితంగా చెప్పగలం అన్నారు. కానీ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి పదోన్నతుల్లో రిజర్వేషన్ మార్గం సుగమమైంది. మేం దీన్ని స్వాగతిస్తున్నాం" అన్నారు.

దళిత అంశాలపై సుదీర్ఘ కాలంగా రాస్తున్న జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ వైఎస్ అలోన్ కూడా ఈ తీర్పుతో ఆశలు పెరుగుతాయని చెప్పారు. టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ‘పదోన్నతుల్లో రిజర్వేషన్ల గురించి ఎస్సీ-ఎస్టీ సమాజం నుంచి ఇక రాబోయే పౌరుల సామాజిక నేపథ్యం గురించి సమాచారం సేకరించాలని మార్గనిర్దేశాలు ఇచ్చిన 2006 నాటి నాగరాజు తీర్పు రాజ్యాంగ భావనలకు వ్యతిరేకంగా వెళ్లేది. అయినా జాతి ఆధారిత జనగణన డిమాండ్ చాలా రోజుల నుంచీ వస్తోంది. దానిపై మాత్రం ఇప్పటిదాకా ఏమీ నిర్ణయించలేదు. ఇప్పుడు కనీసం పదోన్నతుల్లో రిజర్వేషన్లు ప్రారంభమవుతాయని ఆశించగలం’ అన్నారు.

ఇవి కూడా చదవండి

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)