అస్సాం: ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్’- 6 ముఖ్యాంశాలు

ఫొటో సోర్స్, Getty Images
అస్సాంలో జాతీయ పౌరసత్వ రిజిస్టర్ చివరి, రెండో ముసాయిదాను కట్టుదిట్టమైన భద్రత మధ్య విడుదల చేశారు.
రిజిస్టర్లో ఉన్న వివరాలను బట్టి 2 కోట్ల89 లక్షల మంది అస్సాం పౌరులు ఉన్నారు. అయితే, అక్కడ ఉంటున్న 40 లక్షల మంది పేర్లు ఈ జాబితాలో లేవు.
అంటే 40 లక్షల మందిని భారతీయులుగా గుర్తించలేదు. అయితే, తాము భారతీయులమేనని నిరూపించుకునేందుకు వారికి ఒక అవకాశం ఇస్తారు.
మార్చి 1971కి ముందు నుంచి ఉంటున్న వారికి రిజిస్టర్లో చోటు లభించింది. ఆ తర్వాత నుంచి అస్సాం వచ్చిన వారి పౌరసత్వంపై సందిగ్ధత నెలకొంది.
రిజిస్టర్ను రాష్ట్రంలోని ఎన్ఆర్సీ కేంద్రాలన్నింటిలో దరఖాస్తుదారుల పేరు, చిరునామా, ఫొటోలతోపాటూ ప్రచురిస్తారు.
దరఖాస్తు చేసినవారు ఇందులో తమ పేరు చూసుకోవచ్చు. దీనితోపాటు ఎన్ఆర్సీ వెబ్సైట్లో కూడా దీనిని చూడవచ్చు.
ఈ జాబితాను విడుదల చేస్తున్న నేపథ్యంలో అస్సాంలో శాంతిభద్రతలు అదుపు చేయడానికి పారామిలిటరీ బలగాలను మోహరించారు.
కేంద్ర హోంమంత్రి ఆదేశాల ప్రకారం అస్సాం, చుట్టుపక్కల రాష్ట్రాల్లో మొత్తం 22 వేల మంది జవాన్లు విధుల్లో ఉన్నారు.

ఫొటో సోర్స్, PTI
అయితే, ఇది కేవలం ముసాయిదా మాత్రమేనని ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. భారతదేశ పౌరులందరికీ తమ పౌరసత్వాన్ని నిరూపించుకునే అవకాశం ఇస్తామని అన్నారు.
అస్సాంలో సుప్రీంకోర్టు నేతృత్వంలో పౌరుల పత్రాల పరిశీలన జరుగుతోంది. అయితే దీనిపై కొన్ని వర్గాలలో ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఈ రిజిస్టర్ గురించి ఎవరైనా ఫిర్యాదు చేస్తే, వాటిని పరిశీలిస్తామని, వాటన్నిటినీ పరిష్కరించాక, సిటిజన్షిప్ తుది రిజిస్టర్ను ప్రచురిస్తామని రాజ్నాథ్ సింగ్ అన్నారు.
రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్ అంటే ఏమిటి?
రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్ అంటే అస్సాంలో నివసిస్తున్న ప్రజల పేర్ల జాబితా. 1971, మార్చి 24 లేదా అంతకు ముందు నుంచి తమ కుటుంబాలతో సహా అస్సాంలో నివసిస్తున్నట్లు సాక్ష్యాధారాలు ఉన్నవారిని ఈ జాబితాలో చేరుస్తారు.
అస్సాంలో అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తించడానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్ను ఏర్పాటు చేసింది.
దేశంలో సిటిజన్షిప్ రిజిస్టర్ వ్యవస్థ ఉన్న ఒకే ఒక రాష్ట్రం అస్సాం. ఇలాంటి రిజిస్ట్రేషన్ను మొదటిసారి 1951లో చేపట్టారు.

ఫొటో సోర్స్, DIPTENDU DUTTA/AFP/GettyImages
1951 రిజిస్టర్ ఎందుకు?
1947లో కొంత మంది అస్సాం నుంచి తూర్పు పాకిస్తాన్కు వలస వెళ్లారు. కానీ వాళ్ల భూములు మాత్రం అస్సాంలోనే ఉండిపోయాయి. విభజన తర్వాత కూడా ప్రజలు అక్కడి నుంచి ఇక్కడకు, ఇక్కడ నుంచి అక్కడకు వచ్చిపోయేవారు.
1950లో నెహ్రూ-లియాకత్ల ఒప్పందం పాత్ర కూడా దీనిలో ఉంది.
ఎన్ఆర్సీ అవసరం ఏమిటి?
1985, ఆగస్ట్ 15న కేంద్రం , అఖిల అస్సాం విద్యార్థి యూనియన్ (ఆసు) మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ రిజిస్టర్ను ప్రారంభించారు.
1979లో ఆసు - అస్సాంలో అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తించి, వారిని వెంటనే దేశం నుంచి వెళ్లగొట్టాలని ఆందోళన ప్రారంభించింది.
అస్సాం ఒప్పందం తర్వాత, ఆ ఉద్యమంలోని నాయకులు అసోమ్ గణ పరిషత్ పేరిట ఒక రాజకీయ పార్టీగా ఏర్పడ్డారు. ఆ పార్టీ అస్సాంలో రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పటివరకు ఏం జరిగింది?
సుప్రీంకోర్టు ఆదేశాలతో 2015 మే నుంచి పౌరసత్వ నిర్ధారణ కార్యక్రమం జరుగుతోంది.
2018, జనవరి 1న రిజిష్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా 1.9 కోట్లతో అస్సామీ ప్రజల జాబితాను విడుదల చేశారు. మొత్తం 3.29 కోట్ల మంది అస్సామీ ప్రజల్లో వీరు కూడా భాగం.
''1.9 కోట్ల మందికి పైగా ప్రజల పత్రాలను పరిశీలించిన అనంతరం వారి పేర్లను ఈ డ్రాఫ్టులో చేర్చాం. మిగతా వాటిని కూడా పరిశీలించిన అనంతరం తర్వాత డ్రాఫ్టును ప్రచురిస్తాం'' అని మొదటి డ్రాఫ్ట్ విడుదల సందర్భంగా భారతీయ రిజిస్ట్రార్ జనరల్ శైలేష్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరిని భారతీయ పౌరులుగా గుర్తిస్తారు?
1951 ఎన్ఆర్సీలో లేదా 1971, మార్చి 24 వరకు ఎవరి పేర్లు అయితే ఓటర్ల జాబితాలో ఉన్నాయో, వారందరినీ భారతీయ పౌరులుగా గుర్తిస్తారు.
దీనితో పాటు - బర్త్ సర్టిఫికేట్లు, భూమికి సంబంధించిన పత్రాలు, శరణార్థుల సర్టిఫికేట్లు, పాఠశాల-కాలేజీ సర్టిఫికేట్లు, పాస్పోర్టులు, కోర్టు పేపర్లు తదితర 12 రకాల పత్రాలను కూడా పౌరసత్వ నిర్ధారణ కోసం పరిగణనలోకి తీసుకుంటారు.
ఎవరి పేరు అయినా 1971 వరకు ఉన్న ఓటర్ల జాబితాలో లేనప్పుడు, వారి పూర్వీకుల పేరితో ఏదైనా పత్రం ఉన్నా సరే, వారితో సంబంధాన్ని నిరూపించుకోగలిగితే వారి పేరు రిజిస్టర్లో నమోదు చేస్తారు.
ఎన్ఆర్సీ పని ఎలా ఉంది?
రిజిస్ట్రార్ జనరల్ అనేక చోట్ల ఎన్ఆర్సీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రజలు తమ పౌరసత్వం వివరాలు తెలుసుకోవచ్చు.
పౌరసత్వంపై సందేహాలు ఉన్నపుడు బోర్డర్ పోలీసులు ప్రజలకు నోటీసులు పంపుతారు. వారు విదేశీయుల ట్రిబ్యునల్లో తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్)










