అత్యాచారానికి గురైన ఓ అబ్బాయి కథ ఇది

- రచయిత, ఆమిర్ పీర్జాదా
- హోదా, బీబీసీ ప్రతినిధి
''అది అత్యంత బాధాకరమైన అనుభవం. నేను దాదాపు రెండు వారాల పాటు సరిగా నడవలేకపోయాను. దురదృష్టం ఏమిటంటే మా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ఉపాధ్యాయులు ఎవరూ కూడా ఈ పిల్లాడికి ఏమైందా అని ఆలోచించలేకపోయారు.''
ఇది కశ్మీర్లో, బాల్యంలో అత్యాచారానికి గురైన 31 ఏళ్ల వ్యక్తి అంతరంగం.
అత్యాచారానికి గురైన ఆయన తనపై చెడుముద్ర పడుతుందనే భయంతో ఇన్నాళ్లూ దానిని లోకానికి వెల్లడించలేదు.
14 ఏళ్ల వయసు ఉన్నపుడు ఒక మతబోధకుడు ఆయనపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఫొటో సోర్స్, Getty Images
అతీంద్రియ శక్తులు రాత్రే పని చేస్తాయన్నాడు..
''మా మామయ్యకు వ్యాపారంలో భారీగా నష్టాలు వచ్చాయి. దాంతో ఆ మతబోధకుడికి చాలా శక్తి ఉందని, అతను తన కష్టాలన్నీ దూరం చేస్తాడని మా మామయ్య తనతో పాటు నన్ను కూడా అతని వద్దకు తీసుకెళ్లాడు. అయితే ఆ మతబోధకుడు తాను కేవలం 10-14 ఏళ్ల వయసున్న పిల్లలతోనే మాట్లాడతాడని తెలిపారు. మేమిద్దరం ఆ మతబోధకుడి వద్దకు వెళ్లినపుడు అతీంద్రియ శక్తులు రాత్రే పని చేస్తాయని, అందువల్ల నన్ను ఆ రాత్రికి అక్కడే వదిలి వెళ్లమని మా మామయ్యకు చెప్పాడు.'' ఆ రాత్రి తనకు జరిగిన బాధాకరమైన అనుభవాన్ని ఆయన ఇలా పంచుకున్నారు.
''అది ఎంత బాధాకరంగా ఉందంటే నా ప్రాణం పోతున్నట్లు అనిపించింది. నేను గట్టిగా అరవాలనుకున్నా. కానీ అతను నా నోరును అదిమిపెట్టాడు. అంతా అయిపోయాక, నేను ఈ విషయాన్ని ఎవరితోనైనా చెబితే, అతీంద్రియ శక్తులు నా ప్రాణాలు తీస్తాయని బెదిరించాడు.''
''ఒక ఏడాది కాలంలో అతను నాపై మూడుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. మా మామయ్యకు ఈ విషయం తెలీదు. నేను ఈ విషయాన్ని చెప్పాలంటే భయపడ్డాను'' అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
14 ఏళ్లు గుండెలోనే దాచుకున్నారు..
బాలురపై అత్యాచారం జరిగితే దానిని మచ్చగా భావించి, చాలా మంది దానిని బయటకు వెల్లడించరు.
''మహిళలకు సమాజం అనేక రకమైన కట్టుబాట్లు విధించినట్లే, పురుషులకూ కొన్ని కట్టుబాట్లు విధించింది. పురుషులపై లైంగిక అత్యాచారం కూడా అలాంటిదే. పురుషులు దృఢంగా, స్వతంత్రంగా ఉండాలని సమాజం నిర్దేశిస్తుంది. అలా కాకుండా చిన్న వయసులో అత్యాచారానికి గురయ్యారని తెలిస్తే దానిని పురుషత్వానికి మచ్చగా పరిగణిస్తారు'' అని ఉఫ్రా మీర్ అనే సైకాలజిస్ట్ తెలిపారు.
కశ్మీర్కు చెందిన ఈ బాధితుడు కూడా 14 ఏళ్ల పాటు ఆ బాధను తన గుండెల్లోనే దాచుకున్నారు.
''అది నా తప్పు కాదని తెలుసుకోవడానికి నాకు 14 ఏళ్లు పట్టింది. మన విద్యావ్యవస్థలో పిల్లలు ఇలాంటి లైంగిక అత్యాచారాల గురించి తమను తాము ఎలా రక్షించుకోవాలో తెలియజెప్పాలి'' అన్నారు ఆయన.
ప్రస్తుతం ఆయన ఇతర బాధితులతో కలిసి ఆ మతబోధకుడిపై న్యాయపోరాటం చేస్తున్నారు.
''నాపై అత్యాచారం జరిగిన 14 ఏళ్ల తర్వాత ఒక రోజు టీవీలో ఓ పోలీసు అధికారి ఆ మతబోధకుడి బాధితులు ఇంకెవరైనా ఉంటే ముందుకు రావాలని చెబుతుంటే విన్నాను. అప్పుడే నాకు అతను ఇతరులపై కూడా అలాంటి అత్యాచారాలకు పాల్పడినట్లు తెలిసింది'' అని ఆయన వివరించారు. ప్రస్తుతం ఆయన బాలల హక్కుల కార్యకర్తగా పని చేస్తున్నారు.

పిల్లలపై ప్రతి 15 నిమిషాలకు ఒక అత్యాచారం
2002లో ప్రపంచ ఆరోగ్యసంస్థ - బాలురు, పురుషులపై జరుగుతున్న అత్యాచారాలను చాలా వరకు నిర్లక్ష్యం చేస్తున్నారని గుర్తించింది.
భారతదేశంలో ప్రతి 15 నిమిషాలకు ఒక బాలుడు లేదా బాలికపై అత్యాచారం జరుగుతోంది. 2016లో పిల్లలపై అత్యాచారం కేసులు 36,022 నమోదయ్యాయి.
''సాధారణంగా పిల్లలపై అత్యాచారం కేసుల గురించి మాట్లాడ్డానికి ఇష్టపడరు. మగపిల్లలైతే అది ఇంకా ఎక్కువ. అందువల్ల ఇలాంటి సంఘటనలు ఎక్కువగా వెలుగులోకి రావు'' అని యూనివర్సిటీ ఆఫ్ కశ్మీర్ ప్రొఫెసర్ హకీమ్ యాసిర్ అబ్బాస్ అన్నారు.
(ఈ కథనం 2018మే 22నమొదట ప్రచురితమైంది)
ఇవి కూడా చదవండి:
- రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి నిజంగానే ఫిడేలు వాయించారా
- #HisChoice: పాపకు తల్లిగా మారిన ఒక తండ్రి కథ
- జపాన్: సముద్ర గర్భంలో అంతుచిక్కని ‘ప్రాచీన నగరం’
- ఈ దీవిలో 12 ఏళ్ల తర్వాత పాప పుట్టింది
- సిపాయిల తిరుగుబాటు: పబ్లో ఉన్న పుర్రెలో 1857 నాటి చరిత్ర
- ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఐదుగురు మహిళా గూఢచారులు
- పీసీ సర్కార్: బ్రిటన్ను భయపెట్టిన మేజిక్ మహారాజు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








