పార్సిల్ బాంబుతో పెళ్లి కొడుకుని చంపింది లెక్చరరే..!

ఒడిషాలో కలకలం రేపిన 'పార్సిల్ బాంబు' కేసును పోలీసులు ఛేదించారు. ఒక ప్రభుత్వ కాలేజిలో పని చేసే పుంజీలాల్ మెహెర్ అనే లెక్చరర్ను అరెస్ట్ చేశారు.
గత ఫిబ్రవరిలో పెళ్లి కానుకగా 'పార్సిల్ బాంబు' పంపించిన ఘటనలో పెళ్లికొడుకు చనిపోగా, పెళ్లి కూతురు తీవ్రంగా గాయపడింది.
మృతుడి తల్లి, నిందితుడు ఇద్దరూ ఒక ప్రభుత్వ కాలేజీలో పని చేస్తారు. తనకన్నా ముందుగా ఆమెకు ప్రమోషన్ రావడంతో పుంజీలాల్ ఈర్ష్యతో రగిలిపోయాడు. దాంతో అతడు ఆమెపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఈ చర్యకు పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు.
నిందితుడిని పట్టుకోవడం కోసం పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. కేసును ఛేదించడం కోసం దాదాపు 100 మందిని పోలీసులు ప్రశ్నించారు. వారిలో అత్యధికులు వధూవరుల బంధువులూ, స్నేహితులే.
ఫిబ్రవరి 18న ఆ జంటకు పెళ్లి కాగా, ఐదో రోజున వివాహ కానుకగా వచ్చిన ఒక పార్సిల్ బాంబు పేలడంతో భర్త చనిపోయాడు. భార్య తీవ్రగాయాల పాలు కాగా ఆస్పత్రిలో చేర్పించారు.

అసలు అప్పుడేం జరిగింది?
ఒడిషాలోని ఒక చిన్న పట్టణం పట్నాగఢ్. సౌమ్యశేఖర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. వయసు 26 ఏళ్లు. అతడి భార్య రీమా వయసు 22 ఏళ్లు. శేఖర్ కొత్తగా కట్టుకున్న ఇంటిలో ఫిబ్రవరి 23వ తేదీ మధ్యాహ్నం భార్యాభర్తలిద్దరూ కిచెన్లో వంట చేసేందుకు సిద్ధమవుతున్నారు. అప్పటికి ఐదు రోజుల కిందటే వారిద్దరికీ పెళ్లయింది.
అంతలో ఇంటి గేటు కొట్టిన చప్పుడైంది. శేఖర్ వెళ్లి చూశాడు. ఒక డెలివరీ మ్యాన్ చేతిలో పార్సిల్ పట్టుకుని ఉన్నాడు. దాని మీద శేఖర్ పేరు, చిరునామా ఉంది.
ఆ పార్సిల్ బాక్స్ పైన అరిగిపోయిన స్టికర్ మీద.. రాయ్పూర్ నుంచి ఎస్.కె.శర్మ అనే వ్యక్తి దీనిని పంపించినట్లు ఉంది. పట్నాగఢ్ నుంచి రాయ్పూర్ 230 కిలోమీటర్ల దూరం.
కిచెన్లో తన భర్త ఆ బాక్స్ను ఓపెన్ చేయటం, అందులో ఆకుపచ్చ రంగు కాగితం చుట్టివున్న మరొక పార్సిల్, ఆ పార్సిల్ నుంచి తెల్లని దారం వేలాడుతుండటం రీమాకు గుర్తుంది. ఆ పార్సిల్లో ఏముందో చూడాలన్న కుతూహలంతో శేఖర్ నానమ్మ 85 ఏళ్ల జెమామని సాహు కూడా వారి దగ్గరికి వచ్చారు.

‘సర్ప్రైజ్ గిఫ్ట్’
‘‘ఇది పెళ్లి కానుక లాగా కనిపిస్తోంది. కానీ ఇది పంపిన వారు నాకు తెలియదు. రాయ్పూర్లో నాకు తెలిసిన వారు ఎవరూ లేరు’’ అని శేఖర్ తన భార్యతో చెప్పాడు.
ఆ పార్సిల్ మీద ఉన్న దారం లాగాడతడు. అంతే... పెద్ద వెలుగుతో భారీ పేలుడు జరగడంతో వంట గది దద్దరిల్లిపోయింది. ముగ్గురూ రక్తమోడుతూ ఎగిరిపడ్డారు. గది పైకప్పు ప్లాస్టర్ ఊడిపోయింది. వాటర్ ప్యూరిఫయర్ ముక్కలుగా పేలిపోయింది. వంట గది తలుపు ఊడి దూరంగా పడిపోయింది. గోడలు పగుళ్లిచ్చాయి.
రక్తసిక్తమైన నేల మీద ఆ ముగ్గురూ బాధతో విలవిల్లాడారు. జెమామని సాహుకు మంటలు అంటుకున్నాయి. ‘‘నన్ను కాపాడండి. నేను చనిపోతున్నట్లుంది’’ అని శేఖర్ మాటలు కూడబలుక్కుని అంటూనే స్పృహ తప్పాడు.
రీమా తన భర్త మాట్లాడుతుండగా వినటం అదే ఆఖరు.

ఆమె ముఖానికి, చేతులకు మంటలు అంటుకున్నాయి. ఊపిరితిత్తుల్లో పొగ నిండిపోవటంతో శ్వాస తీసుకోవటానికి చాలా కష్టపడింది. ఆమె కర్ణభేరికి చిల్లుపడింది. పేలుడు శబ్దానికి పొరుగువారు కంగారుగా పరిగెత్తి వస్తున్న శబ్దం కానీ, గ్యాస్ సిలిండర్ పేలిందా అని వారు అడుగుతున్న మాటలు కానీ ఆమెకు వినిపించలేదు. పేలుడులో రేగిన చెత్త ఆమె కళ్లలో పడటంతో చూపు కూడా అస్పష్టంగా ఉంది.
అప్పటికీ రీమా నేల మీద పాకుతూ బెడ్రూమ్ వరకూ వెళ్లగలిగింది. స్థానికంగా ఒక కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్న తన అత్తగారికి ఫోన్ చేయటం కోసం ఫోన్ తీసుకోగలిగింది. కానీ ఫోన్ చేయటానికి ముందే స్పృహ కోల్పోయింది.
శేఖర్, రీమాలను పరస్పరం పరిచయం చేసింది వారి వారి కుటుంబాలే. వారిద్దరికీ ఏడాది కన్నా ముందే నిశ్చితార్థం జరిగింది. రీమా తండ్రి వస్త్ర వ్యాపారి. ఆయనకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. కానీ ఒక కూతురు కూడా కావాలని.. తన తమ్ముడికిగల ముగ్గురు కూతుళ్లలో ఒకరైన రీమాను దత్తత తీసుకున్నాడు. ఎప్పుడూ ఉల్లాసంగా ఉండే ఆకర్షణీయమైన ఆ అమ్మాయి స్థానిక కాలేజీలో చదువుకుంది. ఒరియా భాషలో డిగ్రీ పూర్తిచేసింది.
శేఖర్ తల్లిదండ్రులిద్దరూ అధ్యాపకులే. అతడి తండ్రి జువాలజీ బోధించేవాడు. శేఖర్ కంప్యూటర్ సైన్స్ అభ్యసించాడు. మైసూర్, చండీగఢ్లలో ఐటీ కంపెనీల్లో పనిచేశాడు. రెండు నెలల కిందట బెంగళూరులో ఒక జపనీస్ ఎలక్ట్రానిక్స్ సంస్థలో చేరాడు.
దర్యాప్తులో పాల్గొన్న రెండు డజన్ల మంది పోలీసులు
శేఖర్ కేసును ఒడిషా పోలీసు అధికారులు, సిబ్బంది రెండు డజన్ల మంది దర్యాప్తు చేశారు. ఈ హత్యతో ముడిపడి ఉన్న నాలుగు నగరాల్లో 100 మందికి పైగా ఈ కొత్త జంటకు చెందిన స్నేహితులు, బంధువులను ప్రశ్నించారు. ఈ దంపతుల మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను క్షుణ్నంగా పరిశీలించారు.
ఈ పార్సిల్ను ఇక్కడికి 119 కిలోమీటర్ల దూరంలోని కలహండి జిల్లాలోని ఒక ప్రైవేట్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ నుంచి రెండు సార్లు ఆన్లైన్లో ట్రాక్ చేసినట్లు పోలీసులు గుర్తించినపుడు.. హంతకుడు ఆ పార్సిల్ మీద ఓ కన్ను ఉంచాడని, తద్వారా ఆధారం లభిస్తుందని భావించారు. కానీ పార్సిల్ను ట్రాక్ చేస్తోంది సదరు కొరియర్ కంపెనీయేనని దర్యాప్తులో తేలింది.
చివరకు, రెండు నెలల తర్వాత పోలీసులు ఈ కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








