రిపబ్లిక్ డే పరేడ్: ఆసియాన్ ఎందుకంత ప్రత్యేకం?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రవిశంకర్ లింగుట్ల
- హోదా, బీబీసీ ప్రతినిధి
శుక్రవారం జరిగే 69వ గణతంత్ర దినోత్సవ పరేడ్కు ఒక ప్రత్యేకత ఉంది. 10 దేశాల అధినేతలు/ప్రభుత్వాధినేతలు ఇందులో ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు.
రిపబ్లిక్ డే పరేడ్కు భారత్ ఇతర దేశాల అధినేతలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం మొదటి నుంచి ఆనవాయితీగానే వస్తున్నా, ఒకేసారి పది మంది దేశాధినేతలు/ప్రభుత్వాధినేతలను పిలవడం మాత్రం ఇదే తొలిసారి.
ఆగ్నేయాసియా దేశాల కూటమి(అసోసియేషన్ ఆఫ్ సౌత్-ఈస్ట్ ఏసియన్ నేషన్స్)-భారత్ మైత్రీబంధం రజతోత్సవాలను పురస్కరించుకొని ఆసియాన్లోని మొత్తం పది సభ్యదేశాల అధినేతలను, ప్రభుత్వాధినేతలను ఈ గణతంత్ర దినోత్సవానికి భారత్ ఆహ్వానించింది.
ఆసియాన్-భారత్ భాగస్వామ్యం పాతికేళ్లు (1992-2017) పూర్తిచేసుకున్న సందర్భంగా, రిపబ్లిక్ డేకు ఒక రోజు ముందు గురువారం దిల్లీలో ఆసియాన్-భారత్ ప్రత్యేక సదస్సు ఏర్పాటైంది. ఇందులోనూ ఈ పది మంది నాయకులు పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, PRAKASH SINGH/AFP/Getty Images
ఆ అతిథులు వీరే..
- మయన్మార్ స్టేట్ కౌన్సెలర్ ఆంగ్ సాన్ సూకీ
- ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే
- సింగపూర్ ప్రధాని లీ హిసియన్ లూంగ్
- ఇండొనేషియా అధ్యక్షుడు జోకో విడోడో
- వియత్నాం ప్రధాని ఎన్గుయెన్ గ్సువాన్ ఫ్యుక్
- మలేషియా ప్రధాని నజీబ్ రజాక్
- థాయ్లాండ్ ప్రధాని జనరల్ ప్రయుత్ చాన్-ఓ-చా
- బ్రూనై సుల్తాన్ హజీ హసనాల్ బోల్కియా
- కంబోడియా ప్రధాని హున్ సెన్
- లావోస్ ప్రధాని థాంగ్లౌన్ సిసౌలిథ్

ఫొటో సోర్స్, PRAKASH SINGH/AFP/Getty Images
ఆసియాన్-భారత్ సంబంధాల్లో ఇదో ముఖ్య పరిణామం.
ఆసియాన్, ఆసియాన్-భారత్ సంబంధాల్లోని వివిధ ప్రాథమిక అంశాలు ఇవీ..
ఆసియాన్ ఎప్పుడు, ఎందుకు ఏర్పాటైంది?
ఆసియాన్ 1967 ఆగస్టు 8న థాయ్లాండ్లోని బ్యాంకాక్లో ఏర్పాటైంది.
ఆసియాన్ ఏర్పాటైనప్పుడు సభ్యదేశాలు ఐదే ఉండేవి. అవి: ఇండొనేషియా, మలేషియా, సింగపూర్, ఫిలిప్పీన్స్, థాయ్లాండ్.
1984 నుంచి 1999 మధ్య మరో ఐదు దేశాలు- బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్, కంబోడియా ఈ కూటమిలో చేరాయి.
సమష్టి ప్రయత్నాలతో ఆగ్నేయాసియా ప్రాంతంలో ఆర్థిక వృద్ధిని, సామాజిక, సాంస్కృతిక పురోగతిని వేగవంతం చేయడం, ప్రాంతీయ శాంతి, సుస్థిరతలను సాధించడం కూటమి ప్రధాన లక్ష్యాలు.
కూటమి ప్రధాన కార్యాలయం ఇండొనేషియా రాజధాని జకార్తాలో ఉంది. ఆసియాన్ ప్రస్తుత సెక్రటరీ జనరల్ - లిమ్ జాక్ హోయ్ (బ్రూనై).

ఫొటో సోర్స్, www.weforum.org/ASEAN
చైనా, భారత్ తర్వాత అత్యధిక జనాభా ఆసియాన్లోనే
2014 నాటి గణాంకాల ప్రకారం ఆసియాన్ సభ్యదేశాల జనాభా 62.2 కోట్ల పైనే.
చైనా, భారత్ తర్వాత అత్యధిక జనాభా ఉన్న ప్రాంతం ఇదే.
ఆసియాన్ జనాభాలో సగం మందికి పైగా 30 ఏళ్లలోపువారే.
సాంస్కృతిక వైవిధ్యం
ఆసియాన్ ప్రాంతంలో సాంస్కృతిక వైవిధ్యం ఎక్కువగా కనిపిస్తుంది. ఇండొనేషియా, ఫిలిప్పీన్స్, థాయ్లాండ్లనే తీసుకొంటే, ఒక్కో దేశంలో ఒక్కో మతాన్ని ఆచరించేవారి జనాభా ఎక్కువగా ఉంది.
ఇండొనేషియా జనాభాలో సుమారు 90 శాతం మంది ముస్లింలు. ప్రపంచంలోకెల్లా ముస్లింల జనాభా అత్యధికంగా ఉన్న దేశం ఇదే.
ఫిలిప్పీన్స్ జనాభాలో 80 శాతం మందికి పైగా ప్రజలు రోమన్ క్యాథలిక్లు.
థాయ్లాండ్లో 95 శాతం మందికి పైగా ప్రజలు బౌద్ధులు.

ఫొటో సోర్స్, www.asean.org
ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ
ఆసియాన్ సెక్రటేరియట్ లెక్కల ప్రకారం 2014లో ఆసియాన్ దేశాల ఉమ్మడి స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 2.6 లక్షల కోట్ల అమెరికా డాలర్లు. 2007-2014 మధ్య ఈ ఉమ్మడి జీడీపీ రెండింతలైంది.
ఆసియాన్ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నిటినీ కలిపి ఉమ్మడి ఆర్థిక వ్యవస్థగా పరిగణిస్తే, అది ఆసియా ఖండంలో మూడో అతిపెద్ద, ప్రపంచంలో ఏడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది.
యూరోపియన్ యూనియన్, ఉత్తర అమెరికా, చైనా/హాంకాంగ్ తర్వాత ప్రపంచంలోకెల్లా అత్యధిక ఎగుమతులు చేసే ప్రాంతం ఆసియాన్. ప్రపంచ మొత్తం ఎగుమతుల్లో ఆసియాన్ వాటా దాదాపు ఏడు శాతంగా ఉంది.
ఆసియాన్ మొత్తంగా చూస్తే ముడి పామాయిల్, రబ్బరు ఉత్పత్తిలో ఈ ప్రాంతం ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలుస్తుంది.
ప్రజల ఆర్థిక స్థితిగతులు, జీవన ప్రమాణాల్లో ఆసియాన్ దేశాల మధ్య ఎంతో అంతరం ఉంది. ఉదాహరణకు సంపన్న దేశమైన సింగపూర్లో తలసరి జీడీపీ 52 వేల డాలర్లు కాగా, మయన్మార్లో ఇది కేవలం 1,246 డాలర్లుగా ఉంది.

ఫొటో సోర్స్, ddinews.gov.in
'యాక్ట్ ఈస్ట్'
భారత విదేశాంగ విధానంలో ఆసియాన్తో బంధం కీలకాంశంగా ఉంది.
ఆసియాన్తో సంబంధాలను పెంపొందించుకొనే చర్యల్లో భాగంగా భారత్, జకార్తాలో ఆసియాన్ కోసం ప్రత్యేకంగా దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఆసియాన్ భారత రాయబారిగా ప్రస్తుతం సురేశ్.కె.రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఆసియాన్తో భారత్ బంధం బలోపేతం కావడంలో 1990ల్లో తీసుకొచ్చిన 'లుక్ ఈస్ట్(తూర్పు వైపు చూపు)' విధానం ముఖ్య పాత్ర పోషించింది. ఈ విధానాన్ని విస్తృతపరుస్తూ, మరింత క్రియాశీలం చేస్తూ 'యాక్ట్ ఈస్ట్ (తూర్పు వైపు అడుగు)' విధానాన్ని 2014లో భారత్ ప్రకటించింది.
''2014 నవంబరులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 'యాక్ట్ ఈస్ట్' విధానంతో ఆసియాన్-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం కొత్త పుంతలు తొక్కింది'' అని జకార్తాలోని భారత ఆసియాన్ దౌత్య కార్యాలయం వ్యాఖ్యానించింది.
2016 నాటికి భారత్ నాలుగో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఆసియాన్ ఉంది.
2016లో ఆసియాన్ దేశాలు, భారత్ మధ్య (ఉభయ పక్షాల) వాణిజ్యం విలువ సుమారు రూ.3.82 లక్షల కోట్లు (6,005 కోట్ల డాలర్లు)గా ఉంది.
ఆసియాన్కు మరింత చేరువయ్యేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలు తప్పక మంచి ఫలితాలను ఇస్తాయని భారత్ ఆశిస్తోంది.
(ఆధారం: ఆసియాన్, భారత ఆసియాన్ దౌత్య కార్యాలయం, భారత విదేశీ వ్యవహారాలశాఖ, వరల్డ్ ఎకనమిక్ ఫోరం వెబ్సైట్లు)
ఇవి కూడా చదవండి:
- బంగ్లాదేశ్ యుద్ధంలో 'రా' చీఫ్ రామేశ్వర్నాథ్దే కీలక పాత్ర!
- హిందువుల అబ్బాయి ముస్లింల ఇంట్లో.. ముస్లింల పిల్లాడు హిందువుల ఇంట్లో
- వీళ్లంతా దావోస్ ఎందుకెళ్తున్నారు?
- భారత్తో యుద్ధానికి ముందే ప్లాన్ వేసిన మావో?
- నిపుణులకు చైనా 10 ఏళ్ల వీసా ఆఫర్
- చైనాలో నూడుల్స్ అమ్మకాలు ఎందుకు తగ్గాయ్?
- EXCLUSIVE: అంబేడ్కర్ వీడియో ఇంటర్వ్యూ
- సుభాష్ చంద్రబోస్: 1934 - ఎ లవ్ స్టోరీ!
- ఉత్తర కొరియాలో ఎక్కువగా తినే స్నాక్స్ ఇవే!
- 2050 నాటికి అతి పెద్ద పది సవాళ్లివే!
- రైలుకు వేలాడుతూ 25 కి.మీ. ప్రయాణం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








