'గుడ్ మార్నింగ్' మెసేజ్లతో విసిగి పోతున్నారా? ఇది మీ ఒక్కరి సమస్యేమీ కాదు!

ఫొటో సోర్స్, pinterest.co.uk
పొద్దున లేవగానే ఫోన్ చూస్తే స్క్రీన్ నిండా గుడ్మార్నింగ్ సందేశాలే. ఒకప్పుడు అలాంటి సందేశాల్ని చూస్తే హాయిగా ఉండేదేమో కానీ ఇప్పుడు మాత్రం విసుగు పుట్టిస్తున్నాయి.
మీరు పంపే గుడ్ మార్నింగ్ సందేశాలే మీ ఆత్మీయుల స్మార్ట్ఫోన్కు పెద్ద సమస్యగా మారుతున్నాయి. ఈ సమస్య మీ ఒక్కరిదే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మందికి ఈ సమస్య ఉంది.
అందుకే 'గుడ్ మార్నింగ్' బెడదపై ఏకంగా గూగుల్ అధ్యయనం చేయాల్సి వచ్చింది.
అయితే, గూగుల్ అధ్యయనంలో ఏం తేలింది? గుడ్ మార్నింగ్ సందేశాలకు, స్మార్ట్ ఫోన్ పనితీరుకు సంబంధం ఏమిటి?
భారతదేశంలో మూడో వంతు స్మార్ట్ఫోన్లు మధ్యలోనే స్తంభించిపోతున్నాయి.
ప్రతి మూడు ఫోన్లలో ఒక దాంట్లో 'మెమొరీ' నిండిపోతోంది.
ఇలా ఎందుకు జరుగుతోందని అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో గూగుల్ పరిశోధకులు అధ్యయనం చేశారు.
వారు కనిపెట్టిన విషయం ఏమిటంటే.. ''శుభోదయం'' అంటూ మన వాళ్లు పంపే సందేశాలే ఈ సమస్యకు కారణం.

ఫొటో సోర్స్, Getty Images
అందమైన ప్రకృతి ఫోటోలతోనో, పసివాళ్ల ఫొటోలతోనో భారతీయుల 'గుడ్ మోర్నింగ్' సందేశాలు రోజూ కోట్ల సంఖ్యలో ఇంటర్నెట్ను ముంచెత్తుతున్నాయి.
అపరిమిత డాటా అందుబాటులో ఉండడంతో లక్షలాది మంది భారతీయులు తమ స్మార్ట్ఫోన్తో బంధుమిత్ర సపరివారమందరికే కాదు.. అపరిచితులకు సైతం అందమైన శుభసందేశాలతో పాటు సూక్తులు పంపిస్తున్నారు.
నిజానికి గత ఐదేళ్లలో 'గుడ్ మార్నింగ్ సందేశాల' కోసం గూగుల్లో సెర్చ్ చేయటం 10రెట్లు పెరిగింది.
భారతదేశంలో పింటరెస్ట్ నుంచి ఇటువంటి సందేశాల ఫోటోలను డౌన్లోడ్ చేసుకోవటం గత ఏడాది కాలంలోనే 9 రెట్లు పెరిగింది.
వాట్సాప్కు అది పెద్ద మార్కెట్ అయిన భారతదేశంలో దానికి 20కోట్ల మంది యూజర్లు ఉన్నారు.
రోజూ ఉదయాన్నే బంధుమిత్రులందరికీ వాట్సాప్లో గుడ్ మార్నింగ్ సందేశాలు పంపించటం మామూలుగా మారిపోయింది.
ఇందుకోసం వాట్సాప్ కూడా గత ఏడాది 'స్టేటస్ మెసేజ్'ని చేర్చింది.
అలాగే.. ఈ ఏడాది భారతదేశంలో ఏకంగా 2,000 కోట్ల నూతన సంవత్సర శుభాకాంక్షలను వాట్సాప్లో పంపించారని.. ఇది ప్రపంచ రికార్డని ఆ సంస్థ తెలిపింది.

ఫొటో సోర్స్, pinterest.co.uk
ఇలా వేలాదిగా వచ్చిపడే ఈ సందేశాలతో.. తక్కువ ఖరీదు చేసే, తక్కువ సామర్థ్యం ఉండే చాలా మంది భారతీయుల ఫోన్లు స్తంభించిపోతున్నాయి.
ఆ సందేశాలను చూసుకోవటం, స్పందించటం కూడా కొందరికి కష్టంగా మారుతోంది.
దీంతో ఇటువంటి సందేశాలు వచ్చే గ్రూపులను వీడటం, ఫొటో సందేశాలను డౌన్లోడ్ చేయకుండా తిరస్కరించటం కూడా జరుగుతోంది.
అమెరికాలో ప్రతి 10మందిలో ఒకరి ఫోన్ మెమొరీ ఇటువంటి సందేశాలతో రోజూ నిండిపోతోంది.
భారతదేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరి ఫోన్ రోజూ ఈ సందేశాలతో నిండిపోతోందని వెస్టర్న్ డిజిటల్ కార్పొరేషన్ అనే సంస్థ అధ్యయనంలో వెల్లడైంది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ సమస్యకి పరిష్కారం కోసం గూగుల్ 'ఫైల్స్ గో' అనే కొత్త యాప్ను కూడా తయారుచేసి గత డిసెంబర్లో దిల్లీలోనే విడుదల చేసింది.
ఇది ఫోన్లోని గుడ్ మార్నింగ్ మెసేజీలన్నిటినీ ఒకేసారి సెర్చ్ చేసి డిలీట్ చేస్తుంది.
దీనిని ఇప్పటి వరకూ కోటి సార్లు డౌన్లోడ్ చేసుకున్నారు. అందులో అత్యధికులు భారతీయులే.
ఇది ఇప్పటివరకూ సగటున ఒక యూజర్కి ఒక గిగాబైట్ వరకూ డాటాను క్లియర్ చేసిందని 'గూగుల్' తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- సుభాష్ చంద్రబోస్: 1934 - ఎ లవ్ స్టోరీ!
- అమ్మతనంపై విమర్శలు ఆగేదెప్పుడు?
- అల్లం, తేనె.. నెక్స్ట్ కండోమ్ ఫ్లేవర్ ఏం రావొచ్చు?
- 82 శాతం సంపద ఒక్క శాతం కుబేరుల చేతిలో!
- పిల్లల్లో సోషల్ సంఘర్షణ
- సోషల్ తిట్లు.. శాపనార్థాలు!
- 'చనిపోయాకా చాటింగ్ చేయొచ్చు'
- మత్తు మందుల్ని మించిన వ్యసనం
- 2017లో టాప్ హ్యాష్ట్యాగ్స్ ఏవో మీకు తెలుసా!
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








