కర్ణాటకలో ట్రక్కు, బస్సు ఢీ: 11మంది మృతి

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో జాతీయ రహదారి 48పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది చనిపోయారు. 24 మంది గాయపడ్డారు

"బుధవారం రాత్రి 2 గంటల ప్రాంతంలో (తెల్లవారితే గురువారం) ఈ ప్రమాదం జరిగింది. బెంగళూరు నుండి గోకర్ణ వెళ్తున్న బస్సు ట్రక్కును ఢీ కొంది. దీంతో బస్సు మంటల్లో చిక్కుకుంది" అని చిత్రదుర్గ కలెక్టర్ బీబీసీతో చెప్పారు.

"ఈ స్లీపర్ కోచ్ బస్సు 32 మంది ప్రయాణికులతో వెళ్తోంది. ఇప్పటివరకు11 మృతదేహాలను గుర్తించాం. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించాం" అని ఆయన చెప్పారు.

ఈ ప్రమాదం హైవే నెంబర్ 48 మీద గోర్లత్తు వద్ద జరిగినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

యాక్సిడెంట్ జరిగిన ప్రాంతంలో కంటైనర్ ట్రక్కు ముందు భాగం కూడా మంటల్లో చిక్కుకుంది.

అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్న దృశ్యాలున్న వీడియోను ఏఎన్ఐ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.

9 మంది ఎలాంటి గాయాలు కాకుండా తప్పించుకున్నారని, గాయపడిన వారిని హిరియూరు, చిత్రదుర్గ ఆసుపత్రులకు తరలించినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

చిత్రదుర్గలో జరిగిన బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొంది. ప్రమాదంలో మరణించిన వారికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వారికి రూ.50వేలు ఇవ్వనున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)