You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
క్రికెట్: నీళ్లు తాగడానికి క్రీజు వీడితే రనౌట్ అయ్యాడు
క్రికెట్ మ్యాచ్ల్లో తరచుగా వింత సంఘటనలు జరుగుతుంటాయి. ముఖ్యంగా రనౌట్ విషయంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.
బెంగాల్, సర్వీసెస్ మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్లో సరిగ్గా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇందులో బెంగాల్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 81 పరుగులు చేసి, తన 28వ ఫస్ట్ క్లాస్ సెంచరీకి చేరువలో ఉండగా, విచిత్రమైన రనౌట్ రూపంలో వెనుతిరిగాడు.
అభిమన్యు ఎలా రనౌట్ అయ్యాడు..?
అభిమన్యు ఈశ్వరన్ 81 పరుగుల వద్ద ఉన్నప్పుడు 41వ ఓవర్ చివరి బంతిని ఎదుర్కొన్నాడు. ఆ బంతి నేరుగా బౌలర్ ఆదిత్య కుమార్ చేతుల్లోకి వెళ్లింది. ఆ సమయంలో బంతి 'డెడ్' అయిపోయిందని పొరబడిన అభిమన్యు నీళ్లు తాగడానికి క్రీజు బయటకు వచ్చి పెవిలియన్ వైపు బయల్దేరాడు. కానీ బంతి బౌలర్ ఆదిత్య వేళ్లను తాకుతూ నేరుగా స్టంప్స్కు తగలడంతో బెయిల్స్ కిందపడిపోయాయి.
ఈ సమయంలో అభిమన్యు ఈశ్వరన్ క్రీజు బయట ఉండటంతో, ఫీల్డర్లు అప్పీల్ చేశారు.
మైదానంలో ఉన్న అంపైర్లు థర్డ్ అంపైర్ సలహా తీసుకున్నారు. చివరకు అభిమన్యును అవుట్గా ప్రకటించారు.
దీంతో అభిమన్యు నిరాశగా మైదానం వీడాడు.
తర్వాత అభిమన్యు తనదే పొరపాటని అంగీకరించాడు. ప్రత్యర్థి జట్టు తనను వెనక్కి పిలవాల్సిందన్న వాదనను తోసిపుచ్చాడు.
"ఇది నా పొరపాటు"
"నా ఇన్నింగ్స్ చాలా బాగా సాగుతోంది. కానీ నేను చేసిన పొరపాటు నాకే ఆశ్చర్యాన్ని కలిగించింది. క్రీడాస్ఫూర్తితో ప్రత్యర్థి జట్టు నన్ను వెనక్కి పిలవాల్సిందని కొందరికి అనిపించవచ్చు, కానీ అది ఏమాత్రం సరైనది కాదు. ఇది పూర్తిగా నా తప్పే. బౌలర్ బంతిని పట్టుకున్నాడని భావించి నేను ముందుకు వెళ్లిపోయాను" అని అభిమన్యు చెప్పినట్లు ఈఎస్పీఎన్ రిపోర్ట్ చేసింది.
క్రికెట్లో ఒక బ్యాటర్ నీళ్లు కోసం క్రీజ్ వదిలి పెవిలియన్ వైపు వెళ్తూ రనౌట్ అవ్వడమనేది చాలా అరుదు.
జనవరి 22వ తేదీన బెంగాల్, సర్వీసెస్ జట్ల మధ్య ప్రారంభమైన రంజీ మ్యాచ్లో, బెంగాల్ జట్టు మొదటి ఇన్నింగ్స్లో 519 పరుగులు చేయగా, సర్వీసెస్ 186 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
దేశీయ క్రికెట్లో బంతి 'డెడ్' అయిపోయిందని భావించి క్రీజు వెలుపలికి వెళ్లడం, అదే సమయంలో నాన్-స్ట్రైకర్ ఎండ్లో బెయిల్స్ పడిపోవడం వంటి రనౌట్ సంఘటనలు చాలా అరుదు.
ఈ సందర్భంలో, బ్యాటర్కు పరుగు తీయాలనే ఉద్దేశం లేదు. కానీ బంతి పూర్తిగా ఆగకముందే అతను క్రీజ్ దాటడం, అదే సమయంలో బౌలర్ చేతికి బంతి స్వల్పంగా తాకుతూ నేరుగా స్టంప్స్కు తగలడం వరుసగా జరిగిపోయాయి.
ఈ మ్యాచ్లో సర్వీసెస్పై బెంగాల్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈశ్వరన్, సుదీప్ ఛటర్జీ మొదటి ఇన్నింగ్స్లో 151 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
సుదీప్ ఛటర్జీ డబుల్ సెంచరీతో జట్టుకు భారీ స్కోరును అందించాడు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)