హాంకాంగ్: ‘‘అపార్ట్మెంట్లన్నీ తగలబడి పోతున్నాయి, నా గుండె బద్ధలైంది’’

ఫొటో సోర్స్, Reuters
హాంగ్కాంగ్లోని తైపో డిస్ట్రిక్ట్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 44 మందికిపైగా మృతి చెందారు. మరో 45 మంది పరిస్థితి విషమంగా ఉండగా, 279 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.
ఈ కేసులో ముగ్గురు అనుమానితులను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. వారిలో ఇద్దరు ఒక నిర్మాణ సంస్థ డైరెక్టర్లు కాగా, మరొకరు ఇంజినీరింగ్ కన్సల్టెంట్.
అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మరమ్మత్తులు జరుగుతున్న ప్రదేశంలో పాలీస్టైరీన్ బోర్డులు కిటికీలకు అడ్డుగా ఉండడంతో మంటలు త్వరగా వ్యాపించి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు.
పనుల కోసం వెదురు బొంగులతో ఏర్పాటు చేసిన నిర్మాణం(పరంజా) కారణంగా మంటలు మరింత వేగంగా పొరుగున ఉన్న భవనాలకు కూడా వ్యాపించినట్లు అధికారులు చెబుతున్నారు.
గురువారం ఉదయం కూడా కొన్ని టవర్ బ్లాక్ల నుంచి పొగ ఇంకా వెలువడుతోంది. మొత్తం 8 టవర్లలో నాలుగు భవనాల్లో మంటలు అదుపులోకి వచ్చాయి.
700 మందికి పైగా అగ్నిమాపకసిబ్బంది భారీ మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
మంటలను ఆర్పేందుకు శ్రమిస్తూ అగ్నిమాపక సిబ్బంది ఒకరు ప్రమాదంలో మరణించారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ అపార్ట్మెంట్ సముదాయాన్ని ‘వాంగ్ ఫు కోర్ట్’గా పిలుస్తారు.


ఫొటో సోర్స్, Getty Images
మరణాలకు కారణమని భావిస్తున్న నిందితుల అరెస్టు గురించి పోలీసులు వివరాలు వెల్లడించారు.
నిర్మాణ సంస్థకు చెందిన 52 ఏళ్ల నుంచి 68 ఏళ్ల వయసున్న ముగ్గురిని అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు సంస్థ డైరెక్టర్లు కాగా, మరొకరు ఇంజినీరింగ్ కన్సల్టెంట్.
"కంపెనీ బాధ్యతలు చూస్తున్న వారు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు, అదే ఈ ప్రమాదానికి దారితీసినట్లు తెలుస్తోంది. మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది" అని పోలీస్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
మంటలు ఎలా చెలరేగాయనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Reuters
భారీ శబ్దం, మంటలు..
హాంకాంగ్లోని తైపో జిల్లాలోని వాంగ్ ఫుక్ కోర్ట్ హౌసింగ్ కాంప్లెక్స్లో, 8 బ్లాక్స్ మంటల్లో చిక్కుకున్న ప్రదేశానికి చేరుకున్న వారిలో థామస్ లియూ కూడా ఒకరు. ఆయన ఒక విద్యార్థి.
థామస్ ఈ ప్రమాదం గురించి మాట్లాడుతూ, "ఇదొక విపత్తు" అని అన్నారు. ఇక్కడి నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లడం తాను చూశానని ఆయన బీబీసీతో చెప్పారు.
"మా బంధువులు ఇంకా లోపలే ఉన్నారంటూ చాలామంది మాకు ఫోన్ చేశారు, వాట్సాప్ మెసేజ్లు చేశారు. కొంతమంది ఆచూకీ కూడా తెలియడం లేదని కొందరు చెప్పారు" అని తైపో జిల్లా కౌన్సిలర్, ముయి సియు ఫంగ్ బీబీసీ చైనీస్తో చెప్పారు.
వాంగ్ ఫుక్ కోర్ట్ కాంప్లెక్స్లోని రెండో బ్లాక్లో 40 ఏళ్లకు పైగా నివసిస్తున్న హ్యారీ చియుంగ్ వార్తా సంస్థ రాయిటర్స్తో మాట్లాడుతూ, భారీ శబ్దం వచ్చిందని, దగ్గర్లోనే ఉన్న బ్లాక్స్లో మంటలు చెలరేగడం చూశానని చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
'ఎంతోమంది స్నేహితులు, ఇరుగుపొరుగు వారు ఉన్నారు'
కామ్ అనే ఇంటిపేరున్న 60 ఏళ్ల మహిళ ఒకరు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (ఎస్సీఎంపీ)తో మాట్లాడుతూ, వాంగ్ ఫుక్ కోర్టులో నివసిస్తున్న తన స్నేహితుల్లో చాలామంది ఈ ప్రమాదంలో చిక్కుకున్నారని చెప్పారు.
తన స్నేహితురాలొకరు ప్రతిరోజూ మధ్యాహ్నం సమయంలో నిద్రపోతారని, మంటలు చెలరేగిన సమయంలో (మధ్యాహ్నం 14.51) ఆమె నిద్రపోతూ ఉండవచ్చని ఆమె అన్నారు. ఆమె కుమార్తెలు ఇంకా ఆమెను సంప్రదించలేకపోయారని, ఆమె వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు.
మరో స్థానికుడు, 65 ఏళ్ల జాసన్ కాంగ్ రాయిటర్స్తో మాట్లాడుతూ.. "మాకు దగ్గర్లోని ఒక బ్లాక్లో నివాసముండే ఒక వ్యక్తి ఫోన్ చేసి, మంటలు వ్యాపించిన టవర్ బ్లాక్లలో ఒకదానిలో చిక్కుకున్నానని చెప్పారు" అని అన్నారు.
" నా హృదయం బద్ధలైంది. చాలామంది స్నేహితులు, ఇరుగుపొరుగువారు అందులో ఉన్నారు. ఏం జరుగుతుందో తెలీడం లేదు. చూడండి, అన్ని అపార్ట్మెంట్లూ కాలిపోతున్నాయి. ఏం చేయాలో తెలీడం లేదు. మేం మళ్లీ సాధారణ జీవితానికి వచ్చేందుకు ప్రభుత్వం సాయం చేస్తుందని ఆశిస్తున్నాం" అన్నారాయన.
మంటలు చెలరేగినప్పుడు తాను ఇంట్లో లేనని మంటల్లో చిక్కుకున్న బ్లాక్లలో, ఒక ఫ్లాట్లో నివసించే ఒక వృద్ధ మహిళ బీబీసీతో చెప్పారు. తన అపార్ట్మెంట్కు బీమా లేదని ఆమె ఆందోళన చెందుతున్నారు.
"ఇంటికి వెళ్లడానికి ఇల్లు లేకపోవడం చాలా బాధగా ఉంది" అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
8 భవనాల్లో దాదాపు 4,600 మంది జనాభా
ఈ సముదాయంలో ఎనిమిది బ్లాకుల్లో 2,000 ఫ్లాట్లున్నాయి. దాదాపు 4,600మంది నివసిస్తున్నారు.
కొంతమంది భవనాల్లో చిక్కుకుని ఉన్నారని భావిస్తున్నారు. అయితే ఎంతమంది చిక్కుకున్నారనేదానిపై అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు.
హాంకాంగ్లోని హౌసింగ్ సొసైటీలు చాలా చిన్నగా ఉంటాయి. భవనాల మధ్య దూరం తక్కువ. జనసాంద్రత ఎక్కువ కావడంతో అగ్నిప్రమాదం ప్రభావం ఎక్కువగా ఉంది.

ఫొటో సోర్స్, Reuters
లెవల్ 5 అగ్నిప్రమాదం
ఇది లెవల్ ఫైవ్ అగ్నిప్రమాదంగా గుర్తించారు. హాంకాంగ్లో అత్యంత తీవ్రప్రమాదాలను లెవల్ ఫైవ్గా పరిగణిస్తారు.
హాంకాంగ్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల 51నిమిషాలకు మంటలు చెలరేగాయి.
ప్రమాద స్థలంనుంచి కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్న తైపో రైల్వేస్టేషన్ నుంచి బయటకు వస్తున్నప్పుడు భారీగా పొగ వాసన వచ్చిందని బీబీసీ ప్రతినిధి ఫోబ్ కాంగ్ చెప్పారు.

ఫొటో సోర్స్, EPA/Shutterstock
సమీపంలోని భవనాలను పోలీసులు ఖాళీ చేయించారు.
ఇక్కడి ఫ్లాట్లు సాధారణంగా 400 నుంచి 500 చదరపు అడుగుల పరిమాణంలో ఉంటాయి.
ఈ కాంప్లెక్స్ సముద్ర తీరానికి, ఓ ప్రధాన రహదారికి దగ్గరగా ఉంటుంది.
మరమ్మతు పనుల కోసం భవనాల బయట కట్టిన వెదురుబొంగుల వల్ల మంటలు వేగంగా వ్యాపించాయని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters
1,000 మందికి పైగా షెల్టర్లకు తరలింపు
ఈ హౌసింగ్ ఎస్టేట్లో ఉన్న మొత్తం 8 భవనాల్లో ఏడు భవనాలపై ప్రభావం ఉందని తై పో జిల్లా కౌన్సిలర్ చెప్పారు.
వెయ్యిమందికిపైగా ప్రజలను షెల్టర్లకు తరలించామని తెలిపారు.
వీల్ చైర్లు, వాకింగ్ స్టిక్స్ ఉపయోగించే వృద్ధులను ముందుగా తాత్కాలిక షెల్టర్లకు తరలించారు.
17 ఏళ్ల తర్వాత హాంకాంగ్లో ఈ స్థాయి ప్రమాదం జరిగింది.
2008లో మాంగ్ కాక్లోని కమర్షియల్ జిల్లా కార్న్వాల్ కోర్ట్ మంట్లలో చిక్కుకుంది. ఆ ప్రమాదంలో అప్పుడు నలుగురు చనిపోయారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














