You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అప్పట్లో కపిల్ దేవ్కు బైక్ యాక్సిడెంట్, ఇప్పుడు రిషబ్ పంత్కు కారు ప్రమాదం - కీలక ఆటగాళ్లు సొంతంగా డ్రైవ్ చేయొద్దని సీనియర్లు ఎందుకు చెప్తున్నారు
భారత వికెట్ కీపర్, బ్యాట్స్మన్ రిషబ్ పంత్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ విషయాన్ని ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు.
రిషబ్ పంత్ గాయాల తీవ్రత గురించి వైద్యులు బీబీసీతో చెప్పారు.
ప్రమాదం జరిగిన వెంటనే రిషబ్ను తొలుత రూర్కీ సివిల్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. తదుపరి చికిత్స కోసం డెహ్రాడూన్లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే ఆయనకు ప్రస్తుతం చికిత్స జరుగుతోంది.
ఈ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్, డాక్టర్ యాగ్నిక్ మాట్లాడుతూ, ‘‘కొద్దిసేపటి క్రితమే రిషబ్ పంత్ను ఇక్కడికి తీసుకొచ్చారు. వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. కొన్ని పరీక్షల తర్వాత మాత్రమే గాయాల తీవ్రత గురించి వివరంగా చెప్పగలం. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకగడగా ఉంది.
ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జన్స్ నిపుణులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. పూర్తి పరీక్షలు అయ్యాకే అంతర్గత గాయాల గురించి తెలుస్తుంది’’ అని ఆయన చెప్పారు.
ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారు?
శుక్రవారం ఉదయం 25 ఏళ్ల రిషబ్ పంత్ ఘోర కారు ప్రమాదానికి గురయ్యారు.
రూర్కీలోని తన ఇంటి నుంచి రిషబ్, కారులో న్యూఢిల్లీ వస్తుండగా ఉదయం 5:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
కారు వేగంగా డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. అయినప్పటికీ అతను దాన్నుంచి తప్పించుకోగలిగాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రిషబ్ తల, వీపు, కాళ్లకు గాయాలయ్యాయని వారు అంటున్నారు.
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామీ మాట్లాడుతూ, రూర్కీ సమీపంలో ఈరోజు క్రికెటర్ రిషబ్ పంత్ ప్రమాదానికి గురయ్యారని అన్నారు. తదుపరి చికిత్స కోసం డెహ్రాడూన్కు తరలిస్తున్నట్లు చెప్పారు. రిషబ్ వేగంగా కోలుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు.
ముందు అద్దాలు పగలడం వల్లే..
హరిద్వార్ ఎస్ఎస్పి అజయ్ సింగ్ ఈ ప్రమాదం గురించి బీబీసీతో మాట్లాడారు.
"ఉదయం 5.30-6 గంటల మధ్య ప్రమాదం జరిగింది. రిషబ్ పంత్ కారు డివైడర్ను ఢీకొట్టింది. ముందు అద్దాలు పగిలి అతను బయటపడ్డాడు. కారులో మంటలు చెలరేగాయి. ప్రథమ చికిత్స తర్వాత, లైఫ్ సపోర్ట్తో కూడిన అంబులెన్స్లో దెహ్రాదూన్లోని మాక్స్ ఆసుపత్రికి తరలించారు’’ అని ఆయన చెప్పారు.
ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తే ప్రమాదం జరిగిన తర్వాత విండ్ స్క్రీన్ను పగులగొట్టి పంత్ బయటకు వచ్చినట్లు అనిపించిందని అజయ్ సింగ్ తెలిపారు.
నివేదికల ప్రకారం, మెర్సిడెస్ కారును స్వయంగా రిషబ్ నడుపుతూ వస్తున్నారు.
‘అమ్మకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నా’- రిషబ్ పంత్
ఉదయం దాదాపు 5:30 గంటలకు ప్రమాదం జరిగిన తర్వాత 108 అంబులెన్స్లో రిషబ్ పంత్ను సమీపంలోని సక్షమ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అక్కడ ఆర్థోపెడిక్ సర్జన్, ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ సుశీల్ నాగర్ అతనికి చికిత్స చేశారు.
తన ఆసుపత్రిలో రిషబ్ పంత్ 3 గంటల పాటు ఉన్నారని బీబీసీకి డాక్టర్ నాగర్ చెప్పారు.
‘‘ఉదయం రిషబ్ను ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు అతని పరిస్థితి కాస్త క్రిటికల్గా అనిపించింది. ఆసుపత్రిలోని వైద్యుల బృందం ఆయనను పరీక్షించింది.
ఎక్స్రే తీయగా ఎముకలకు ఎలాంటి గాయం తగల్లేదని తెలిసింది. కుడి మోకాలి లిగ్మెంట్కు గాయమైంది.
అతని మోకాలికి ప్లాస్టర్ వేసి కార్డియాక్ అంబులెన్స్లో మ్యాక్స్ ఆసుపత్రికి పంపించాం’’ అని సుశీల్ నాగర్ వివరించారు.
రిషబ్ పంత్ను ఎక్కడి నుంచి వస్తున్నారని డాక్టర్ నాగర్ అడగగా.. ‘దిల్లీ నుంచి వస్తున్నా. అమ్మకు సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నా’ అని రిషబ్ చెప్పాడు.
యాక్సిడెంట్ ఎలా అయిందని డాక్టర్ నాగర్ ప్రశ్నించగా... ‘‘కొంచెం నిద్ర పోయినట్లు నాకు గుర్తుంది, అంతే’’ అని రిషబ్ బదులిచ్చాడు.
విండ్ స్క్రీన్ బద్దలు కొట్టుకొని బయటకు రావడం వల్లే బహుశా పంత్ బతికిపోయాడని డాక్టర్ నాగర్ అన్నారు.
కీలక ఆటగాళ్లు సొంతంగా వాహనం నడపాల్సిన అవసరం లేదు’- కపిల్ దేవ్
భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం గురించి మాట్లాడుతూ, ‘‘రిషబ్ పంత్కు జరిగిన ఘటన ఇతరులెవరికీ జరుగకూడదు’’ అని అన్నారు.
ఒక ప్రైవేటు చానెల్తో మాట్లాడుతూ ఈ ఘటన ఒక గుణపాఠం లాంటిదని వ్యాఖ్యానించారు.
‘‘ఇలాంటి దుర్ఘటనలకు దారి తీసే పనులు మనం చేయకూడదని ఈ ఘటన ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా ఆటగాళ్లకు ఇది వర్తిస్తుంది. నేను యువ ఆటగాడిగా ఉన్నప్పుడు నాకు బైక్ యాక్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత నా సోదరుడు నన్ను బైక్ నడపనివ్వలేదు.
రిషబ్ పంత్కు జరిగినది మరెవరికీ జరుగకూడదు. అతన్ని పెద్ద ప్రమాదం నుంచి కాపాడినందుకు భగవంతునికి ధన్యవాదాలు. కానీ, ఇలాంటి కీలక ఆటగాళ్లు కాస్త జాగ్రత్తగా నడుచుకోవాలి. సొంతంగా వాహనాలను నడపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఒక డ్రైవర్ను ఏర్పాటు చేసుకోవచ్చు.
డ్రైవింగ్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. దీన్ని నేను కూడా ఒప్పుకుంటా. కానీ, మీపై బాధ్యత ఉన్నప్పుడు మీరు కాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది’’ అని కపిల్ వ్యాఖ్యానించారు.
‘త్వరగా కోలుకో రిషబ్’
రోడ్డు ప్రమాదం వార్త వచ్చినప్పటి నుంచి రిషబ్ పంత్ అభిమానులతో పాటు క్రికెట్ ప్రపంచానికి సంబంధించిన ప్రముఖులు ఆయన కోలుకోవాలంటూ ట్వీట్లు చేస్తున్నారు.
రిషబ్ ప్రమాదం నుంచి బయటపడ్డాడని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చీఫ్, మాజీ భారత క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశారు. ‘చాంప్ త్వరగా కోలుకో’ అంటూ ట్వీట్ చేశారు.
రిషబ్ కోలుకుంటున్నాడని, అతని పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని బీసీసీఐ కార్యదర్శి జై షా ట్వీట్ ద్వారా చెప్పారు.
‘‘రిషబ్ పంత్ గురించి ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులు, అతనికి చికిత్స అందిస్తున్న వైద్యులతో మాట్లాడాను. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. స్కానింగ్లు చేస్తున్నారు’’ అని ఆయన ట్వీట్లో చెప్పారు.
భారత మాజీ కెప్టెన్, హెచ్సీఏ అధ్యక్షుడు మొహమ్మద్ అజహరుద్దీన్ ట్వీట్ చేస్తూ, పంత్ సురక్షితంగా ఉన్నాడని తెలియడంతో ఉపశమనంగా ఉందని అన్నారు.
భారత మాజీ డాషింగ్ బ్యాట్స్మన్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ట్వీట్ చేశారు.
‘‘ప్రియమైన రిషబ్ వేగంగా కోలుకోవాలని కోరుకుంటున్నా. వీలైనంత త్వరగా కోలుకో’ అని ట్వీట్లో పేర్కొన్నాడు.
ఇటీవల బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను గెలుపొందిన భారత జట్టులో రిషబ్ పంత్ సభ్యుడు.
రిషబ్ కారు ప్రమాదం గురించి తెలిసిన తర్వాత జాతీయ ఆటగాళ్లతో పాటు అంతర్జాతీయ క్రికెటర్లు కూడా ట్వీట్ చేస్తున్నారు.
తన ఆలోచనలన్నీ రిషబ్ చుట్టే తిరుగుతున్నాయని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ ట్వీట్ చేశారు. త్వరగా రిషబ్ కోలుకోవాలని ట్వీట్లో పేర్కొన్నారు.
భారత మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి కూడా పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
వ్యాఖ్యాత హర్షా భోగ్లేతో పాటు క్రికెటర్లు అభినవ్ ముకుంద్, మునాఫ్ పటేల్, మనోజ్ తివారీ ట్వీట్ చేశారు.
సోషల్ మీడియాలో వీడియోలు, పొటోలు
రిషబ్ పంత్ కారు ప్రమాదానికి సంబంధించిన పొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అలాగే కొన్ని వీడియోలను కూడా యూజర్లు పంచుకుంటున్నారు. వాటిలో కారు బోల్తా పడినట్లుగా కనిపిస్తోంది.
స్పోర్ట్స్ తక్ అనే అధికారిక ట్విటర్ ఖాతా, ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వీడియో అంటూ ఒక వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
శుభాంకర్ మిశ్రా అనే యూజర్, కారు దగ్ధమవుతున్న వీడియోను ట్వీట్ చేశారు. కారు డివైడర్ను ఢీకొన్న ఆరు నిమిషాలకే కారులో మంటలు చెలరేగాయని ఆయన పేర్కొన్నారు.
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)