You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
INDvsPAK మ్యాచ్లో షాహిద్ అఫ్రిదీ కూతురు భారత జాతీయ జెండాను ఎందుకు ఊపింది?
ఆసియాకప్-2022ను శ్రీలంక గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక చేతిలో పాకిస్తాన్ ఓడి పోయింది.
ఆసియాకప్లో భాగంగా రెండు సార్లు భారత్, పాకిస్తాన్ పోటీపడ్డాయి. మొదటి సారి ఇండియా గెలవగా రెండోసారి పాకిస్తాన్ గెలిచింది.
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అనగానే రెండు దేశాలకు చెందిన అభిమానుల్లోనూ క్రికెట్ ప్లేయర్స్లోనూ ఉత్సాహం పెరిగిపోతుంది. ఆ మ్యాచులను చూసే అభిమానుల సంఖ్య భారీగా ఉంటుంది.
ఆసియాకప్లో కూడా పాకిస్తాన్, భారత్ మధ్య జరిగిన మ్యాచులకు అభిమానులు భారీగా వచ్చారు. దుబాయ్లో జరిగిన ఈ మ్యాచులకు పాకిస్తాన్ కంటే భారత్ నుంచే అధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు.
ఎంతగా అంటే సూపర్-4లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో షాహిద్ అఫ్రిదీ కూతురుకు పాకిస్తాన్ జెండా కూడా దొరకలేదంట. భారత్ జెండానే పట్టుకుని ఊపిందంట.
ఈ విషయాన్ని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అయిన షాహిద్ అఫ్రిదీనే చెప్పారు.
సూపర్-4లో భారత్ మీద పాకిస్తాన్ గెలిచిన సందర్భంగా ఆయన 'సామా' అనే పాకిస్తాన్ టీవీ చానెల్తో మాట్లాడుతూ ఆ విషయాన్ని పంచుకున్నారు.
చర్చలో భాగంగా మహిళా యాంకర్ మాట్లాడుతూ స్టేడియం మొత్తం భారతదేశ అభిమానులతో నిండిపోయి ఉందని అన్నారు. దానికి బదులుగా షాహిద్ అఫ్రీది ఇలా అన్నారు...
'స్టేడియంలో పాకిస్తాన్ కంటే భారత్ అభిమానులే ఎక్కువగా ఉన్నట్లు నాకు తెలిసింది. మా ఇంట్లో వాళ్లు కూడా ఆ మ్యాచ్ చూడటానికి వెళ్లారు. 90శాతం మంది ఇండియన్స్, 10శాతం మాత్రమే పాకిస్తాన్ వాళ్లు ఉంటారని నా భార్య చెప్పింది.
అక్కడ ఒక్క పాకిస్తాన్ జెండా కూడా వాళ్లకు దొరకలేదు. దాంతో నా చిన్న కూతురు భారత్ జెండాని తీసుకుని అటుఇటు ఊపింది.
నా కూతురు భారతదేశ జెండాను ఊపుతున్న వీడియో నా వద్ద ఉంది. కానీ ఆ వీడియోను ట్వీట్ చేయాలా? వద్దా? అని ఆలోచిస్తున్నా' అని అఫ్రిదీ అన్నారు.
అదే సమయంలో పక్కనే ఉన్న మరొక యాంకర్ జోక్యం చేసుకుంటూ...'మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఇది లైవ్లో కనిపించిందో లేదో నాకు తెలియదు. ఒకవేళ కనిపించినా పాకిస్తాన్ ప్రజలు చూసిన నవ్వుకుంటారు.
కానీ ఒక ఇండియన్ చేతిలో పాకిస్తాన్ జెండా ఉంటే అది కెమెరా కంట్లో పడితే పరిస్థితి దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది' అని అన్నారు.
మొత్తానికి అఫ్రిదీ చిన్న కూతురు భారత్ జెండా ఊపడాన్ని పాకిస్తాన్, భారత్ సోషల్ మీడియా యూజర్లు లైక్ చేస్తున్నారు. 'సామా టీవీ' యుట్యూబ్ చానెల్లో 'లవ్ ఫ్రం ఇండియా' అంటూ 'రాజస్థానీ రైడర్' అనే యూజర్ కామెంట్ చేశారు.
అయితే మరికొందరు విమర్శిస్తున్నారు.
'క్రికెట్ నుంచి రిటైరైన అఫ్రిదితోపాటు ఆయన కుటుంబం కూడా ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉండాలని కోరుకుంటున్నారు' అని ఖలీద్ హుస్సేన్ అనే యూజర్ అన్నారు.
భారత్ జెండా ఎగురవేసినందుకు జైలు
2016లో విరాట్ కోహ్లీ అభిమాని అయిన పాకిస్తాన్ వ్యక్తి తన ఇంటి మీద భారత్ జెండా ఎగురవేశారు. అప్పుడు ఆ వ్యక్తిని అరెస్టు చేసి 10 ఏళ్లు జైలు శిక్ష విధించారు.
పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్కు చెందిన ఆ వ్యక్తి పేరు ఉమర్ దరాజ్. నాడు జెండా ఎగురవేసినప్పుడు ఆ అబ్బాయి వయసు 22 ఏళ్లు.
పాకిస్తాన్ పీనల్ కోడ్ ప్రకారం దేశ సారభౌత్వానికి నష్టం కలిగించారంటూ సెక్షన్ 123-ఎ కింద కేసు పెట్టారు.
విరాట్ కోహ్లీ కోసమే తాను భారత జెండాను ఎగురవేసినట్లు కోర్టులో ఉమర్ దరాజ్ తెలిపాడు.
'పాకిస్తాన్ జెర్సీ ధరించినందుకు బెదిరింపులు'
ఇటీవల ముగిసిన ఆసియాకప్లో భారత్ మ్యాచ్లు చేసేందుకు ఉత్తర్ ప్రదేశ్కు చెందిన సయమ్ జైశ్వాల్ దుబాయికి వెళ్లారు. పాకిస్తాన్, భారత్ తొలి మ్యాచ్లో ఆయన పాకిస్తాన్ జెర్సీ ధరించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
నాటి నుంచి ఆయన కుటుంబానికి బెదిరింపులు వస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం... సయమ్ జైశ్వాల్ స్టేడియానికి వెళ్లేసరికి ఆలస్యమైంది. అప్పటికే ఇండియన్ జెర్సీలు అన్నీ అమ్ముడు పోయాయి. దాంతో పాకిస్తాన్ జెర్సీ వేసుకుని 'హిందుస్తాన్ జిందాబాద్' అని అరుస్తూ ఆ దేశ అభిమానులను టీజ్ చేయాలని ఆయన అనుకున్నారు.
పాకిస్తాన్ జెర్సీ వేసుకున్న జైశ్వాల్ ఫొటోలు బయటకు రాగానే చాలా మంది ఆయన కుటుంబాన్ని బెదిరించడం ప్రారంభించారు. మరికొందరు కేసు నమోదు చేయాలంటూ సోషల్ మీడియా ద్వారా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పోలీసులు, బీజేపీ నేతలను కోరారు.
అయితే ఘటన దుబాయ్లో జరిగినందున సోషల్ మీడియాలో వచ్చే ఫిర్యాదులు తీసుకుని ఇక్కడ కేసు నమోదు చేయడం సాధ్యం కాదని బరేలీ ఎస్ఎస్పీ సత్యార్థ్ అనిరుధ్ పంకజ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- మోదీ పాలనలో మహిళలపై నేరాలు పెరిగాయా, తగ్గాయా? 5 చార్టుల్లో అసలు నిజాలు
- కశ్మీర్ విషయంలో నెహ్రూ పాత్రేమిటి.. విలన్ ఆయనేనా
- బ్రిటన్ రాజరికం: కింగ్ చార్లెస్ 3 భార్య కామిలా ఎవరు, క్వీన్ కన్సొర్ట్ అని ఎందుకు పిలుస్తున్నారు?
- దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు 1991 భారత్ పర్యటన.. ‘నాకు పాస్పోర్ట్ కూడా లేదు’
- షేన్ వార్న్: 'బాల్ ఆఫ్ ది సెంచరీ' కథ ఇదీ..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)