WHO: ‘ఒమిక్రాన్‌ను తక్కువగా అంచనా వేయొద్దు, ఇది ప్రాణాలు తీస్తోంది’

ఒమిక్రాన్‌ వేరియంట్‌పై అన్ని దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఒమిక్రాన్‌ను తక్కువగా అంచనా వేయకూడదని వార్నింగ్ ఇచ్చింది.

ఇదివరకటి వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ వ్యాధి లక్షణాలు తీవ్రంగా లేనప్పటికీ దీన్ని తేలిగ్గా తీసుకోకూడదని హెచ్చరించింది.

గతంలో వచ్చిన కోవిడ్ వేరియంట్ల కంటే ఒమిక్రాన్ వల్ల తీవ్రంగా జబ్బు పడే అవకాశాలు తక్కువని ఇటీవల జరిగిన కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

"కానీ, ఈ వైరస్ సోకుతున్న వారి సంఖ్యతో వైద్య వ్యవస్థ ఒత్తిడికి గురవుతోంది" అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనమ్ చెప్పారు.

"డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ ప్రభావం తక్కువగానే ఉన్నప్పటికీ దీనిని తేలికపాటి వైరస్‌గా కొట్టి పారేయడానికి లేదు" అని డాక్టర్ టెడ్రోస్ చెప్పారు.

"గతంలో మాదిరిగానే, ఒమిక్రాన్ బారిన పడిన వారు కూడా ఆసుపత్రి పాలవుతున్నారు. వైరస్ సోకి మరణిస్తున్నారు. నిజానికి, కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. దీంతో, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్య వ్యవస్థలపై ఒత్తిడి పడుతోంది" అని ఆయన అన్నారు.

అమెరికాలో 24 గంటల్లో 10 లక్షల కోవిడ్ కేసులు నమోదు

ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇది వ్యాక్సీన్ తీసుకున్న వారికి కూడా ఇన్ఫెక్షన్ కలిగిస్తోంది.

కానీ, రోగం బారిన తీవ్రంగా పడకుండా ఉండేందుకు వ్యాక్సీన్లు చాలా కీలకం.

సోమవారం అమెరికాలో 24 గంటల వ్యవధిలో పది లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.

గత వారంలో ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య 71% పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అమెరికాలో 100 శాతం కేసులు పెరిగాయి. తీవ్రంగా రోగం బారిన పడిన వారిలో 90% మంది వ్యాక్సీన్లు తీసుకోలేదు.

గురువారం యూకేలో 179,756 కోవిడ్ కేసులు నమోదు కాగా, 231 మంది చనిపోయారు.

చాలా చోట్ల ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. జనవరి నెలలో ఆసుపత్రులు చాలా ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తుందని ఫ్రాన్స్ ఆరోగ్య శాఖ మంత్రి ఒలీవియర్ వెరాన్ హెచ్చరించారు.

ఆసుపత్రుల్లో సాధారణ పడకలను కూడా ఒమిక్రాన్ రోగులకు కేటాయిస్తున్నారని, డెల్టా వేరియంట్ సోకిన వారితో ఐసీయూలు నిండుతున్నాయని అన్నారు. గురువారం ఫ్రాన్స్‌లో 261,000 కేసులు నమోదయ్యాయి.

పేద దేశాల్లో కూడా జనాభాకు వ్యాక్సీన్ చేరాలని డాక్టర్ టెడ్రోస్ పిలుపునిచ్చారు.

ప్రస్తుతం వ్యాక్సినేషన్ కొనసాగుతున్న తీరు చూస్తుంటే, జులై నాటికి ప్రపంచ జనాభాలో 70% మందికి వ్యాక్సినేషన్ పూర్తి కావాలనే ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యాన్ని చేరలేమని ఆయన అన్నారు.

బూస్టర్ డోసుల కోసం పాశ్చాత్య దేశాలు వ్యాక్సీన్లను సేకరించకపోతే 2022 నాటికి ప్రపంచంలో అందరికీ సరిపోయే రీతిలో వ్యాక్సీన్ డోసులు లభ్యమవుతాయని గత సంవత్సరంలో టెడ్రోస్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)