ఝోంగ్ సాన్‌సాన్: వాటర్ బాటిళ్లు, వ్యాక్సీన్‌ సంస్థతో ముకేశ్ అంబానీని వెనక్కు నెట్టేసిన చైనా కొత్త బిలియనీర్

జుంగ్ సాన్ సాన్

చైనాలో వ్యాక్సీన్ ఉత్పత్తి సంస్థ, బాటిల్డ్ వాటర్ కంపెనీల యజమాని ఝోంగ్ సాన్ సాన్ ఆసియాలోనే అత్యంత ధనవంతుల జాబితాలో చేరారు.

ఈ ఏడాది ఆయన ఆస్తుల విలువ సుమారు రూ. 51 వేల కోట్ల (7 బిలియన్ డాలర్ల) మేర పెరిగింది.

దీంతో ఆయన ఆసియాలోని ధనవంతుల జాబితాలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, చైనాలోని అలీబాబా అధినేత జాక్ మాను కూడా అధిగమించారు.

ఆయన ఆస్తుల విలువ సుమారు 5 లక్షల 68 వేల కోట్ల రూపాయలు ( 77.8 బిలియన్ డాలర్లు). బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచ ధనవంతుల జాబితాలో ఆయన స్థానం 11కి చేరింది.

ఈయనకు 'ఒంటరి తోడేలు' అనే పేరు కూడా ఉంది. ఆయన జర్నలిజం, పుట్టగొడుగుల పెంపకం చేసి, ఆ తర్వాత ఆరోగ్య రంగంలోకి అడుగు పెట్టారు.

వ్యాక్సీన్ ఉత్పత్తి సంస్థ బీజింగ్ వాంటాయి బయోలాజికల్ పబ్లిక్ సంస్థను కొనుగోలు చేసి ఏప్రిల్ నెలలో వీటి షేర్లను చైనీస్ స్టాక్ మార్కెట్లో పెట్టారు.

మరో మూడు నెలల తర్వాత నోంగ్ఫు స్ప్రింగ్ బాటిల్ వాటర్ కంపెనీలో షేర్లను హాంగ్ కాంగ్ స్టాక్ ఎక్స్చేంజి లో పెట్టారు.

వాటి విలువ ఒక్కసారిగా పెరగడంతో ఆయన అప్పటి వరకు ఆసియాలోనే అత్యంత ధనవంతునిగా ఉన్న అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా ని అధిగమించారు

అప్పటి నుంచి ఈ బాటిల్ వాటర్ కంపెనీ హాంగ్‌కాంగ్ లో అత్యంత విలువైన స్టాక్ మార్కెట్ లిస్టింగ్ లలో చేరిపోయింది. వాటి షేర్ విలువ వాటిని ప్రవేశ పెట్టినప్పటి నుంచి ఉన్న విలువ కంటే 155 శాతం పెరిగింది.

బీజింగ్ వాంటాయి షేర్లు అయితే 2000 శాతానికి పైగా పెరిగాయి. ఈ సంస్థ కోవిడ్ వ్యాక్సీన్ తయారు చేస్తోంది.

అకస్మాత్తుగా పెరిగిన ఈ షేర్ల విలువ ఝోంగ్ సాన్ సాన్‌ని ఆసియాలోనే అత్యంత ధనికుల జాబితాలో అత్యున్నత స్థానంలోకి తీసుకుని వెళ్ళిపోయింది. ఇది చరిత్రలోనే అత్యంత వేగవంతంగా సంపద పెరిగిన ఉదాహరణల్లో ఒకటని బ్లూమ్ బర్గ్ పేర్కొంది.

ధనవంతులు మరింత కుబేరుల్లా మారుతున్నారు

ప్రపంచంలో చాలా మంది ధనవంతులు ఈ మహమ్మారి సమయంలో వారి ఆస్తుల విలువ విపరీతంగా పెరగడాన్ని చూసారు.

అలాంటి వారిలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఒకరు.

భారతదేశంలో అంబానీ ఆస్తుల విలువ సుమారు ఒక లక్ష 33 వేల కోట్ల రూపాయల (18.3 బిలియన్ డాలర్ల) నుంచి సుమారు 5 లక్షల 61 వేల కోట్ల రూపాయిలు (76. 9 బిలియన్ డాలర్ల) కు పెరిగింది.

ఆయన రిలయన్స్ సంస్థలను టెక్నాలజీ, ఈ కామర్స్ టైటన్ గా మార్చేందుకు ఒప్పందాలు కుదుర్చుకోవడంతో ఆయన ఆస్తుల విలువ కూడా అకస్మాత్తుగా పెరిగింది.

రిలయన్స్ జియోలో 5. 7 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడతామని ఫేస్ బుక్ ఈ సంవత్సరం మొదట్లో ప్రకటించింది.

కానీ, వీరందరికీ భిన్నంగా జాక్ మా ఆస్తి విలువ మాత్రం 61.7 బిలియన్ డాలర్ల నుంచి 51.2 బిలియన్ డాలర్లకు పడిపోయింది.

ఆయన సంస్థల పై చైనా రెగ్యులేటర్లు పర్యవేక్షణ చేయడం కూడా పెరిగింది.

వ్యాపారాలలో అలీ బాబా గుత్తాధిపత్య ధోరణి పై వచ్చిన వ్యాఖ్యల పై ఆయన పై విచారణ జరుగుతోంది. అలీబాబా అనుబంధ సంస్థ ఆంట్ గ్రూప్ లిస్టింగ్ ని స్టాక్ మార్కెట్ లో బ్లాక్ చేశారు.

చైనా లో కొత్తగా పుట్టిన బిలియనీర్లు అందరూ టెక్ పరిశ్రమ నుంచి వచ్చిన వారే. కానీ, హువాయ్ , టిక్ టాక్, వి చాట్ విషయంలో చైనా కి అమెరికా కు మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు కూడా చైనా లో టెక్నాలజీ రంగంలోని స్టాక్ లను కిందకు నెట్టేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)