కరోనావైరస్ లాక్ డౌన్: ‘సామాజిక బంధాల’ విస్తరణ తొందరపాటు అవుతుందా?

    • రచయిత, జాషువా చీతమ్
    • హోదా, బీబీసీ న్యూస్

మనుషులను ఒకరితో ఒకరు కలవకుండా తీవ్రమైన కట్టడి చేయడం ద్వారా ప్రపంచంలోని చాలాదేశాలు కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించగలిగాయి.

కానీ ఒకపక్క ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతుండటం, ప్రజల మానసిక స్థితిగతులు దెబ్బతింటుండటంతో కరోనావైరస్ కేసులు మరోసారి పెరగకుండా లాక్ డౌన్‌ నిబంధనల్ని సడలించడం ఎలా అని ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాయి.

అందుకే కొందరు పాలకులు, విధాన నిర్ణేతలు మన సామాజిక బంధాలను (సోషల్ బబుల్) విస్తరించడం ఎలా అన్నదానిపై దృష్టి పెట్టారు. అంటే, ప్రజలు తమ కుటుంబం, స్నేహితుల్లో ఎంపిక చేసిన కొందరిని కలుసుకోవడం ఎలా అన్నదానిపై కసరత్తు చేస్తున్నారు.

బెల్జియంలో స్థానిక మీడియాకు లీకైన ఒక నివేదిక ప్రకారం... ప్రతి వారాంతంలో ఒక వ్యక్తి తనకు నచ్చిన పది మంది వ్యక్తులతో సమావేశమయ్యేందుకు, లేదంటే కలుసుకునేందుకు అనుమతి ఇవ్వాలని అధికారులు ఆలోచిస్తున్నారు.

ఇన్‌ఫెక్షన్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ఒక గ్రూపుగా ఏర్పడబోయే పదిమందిలో ఒకరు మిగిలిన తొమ్మిదిమందిని గుర్తించాలి. అయితే ఒక్కసారి ఓ గ్రూపులో సభ్యుడైన తర్వాత వారు మరే ఇతర గ్రూపుతో సంబంధం పెట్టుకోకూడదు.

అయితే, దీనిని ఎలా పర్యవేక్షిస్తారు అనేదానిపై స్పష్టత లేదు. కానీ సామాజికంగా ఇదో పెనుసమస్యగా మారుతుందంటారు కొందరు. మనం మనకున్న కుటుంబ సభ్యులు, స్నేహితుల్లో పదిమందినే ఎంచుకోవాలంటే ఎవరిని ఎంచుకోవాలి, ఒకవేళ మనం ఎంచుకున్నా ఆ వ్యక్తి... తన టాప్ 10లో మనల్ని కలుపుకోకపోతే పరిస్థితి ఏంటి?

శనివారం నుంచి బెల్జియం లాక్ డౌన్ నిబంధనలను సడలించింది. ఆ సడలింపుల్లో ఈ ఆలోచన లేదు. కానీ మిగిలిన దేశాలు ఈ తరహా ఆలోచనలపై దృష్టి సారించాయి.

'ఇంటి సభ్యులు' అనే మాటకు నిర్వచనాన్ని విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు స్కాట్లాండ్ ప్రధానమంత్రి నికోలా స్టర్జియాన్ బీబీసీ రేడియో స్కాట్లాండ్‌కు గతవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ప్రజలు చిన్నచిన్న సమూహాలుగా కలుసుకునేందుకు అనుమతించాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఆమె చెప్పారు.

''ఒంటరిగా ఉంటున్నవారు సామాజిక బంధాలను ఏర్పరచుకునేందుకు మరో ఒంటరి వ్యక్తిని లేదా ఇద్దరు, ముగ్గురు వ్యక్తులను కలిసేందుకు ప్రోత్సహించాలనుకుంటున్నాం'' అని ప్రధాని నికోలా అన్నారు.

చాలా త్వరగా లాక్ డౌన్ నిబంధనలు అమలు చేసిన దేశాల్లో న్యూజీలాండ్ ఒకటి. ఇప్పుడు ఈ దేశం కూడా ఇలాంటి సామాజిక విస్తరణ విధానాన్ని సిద్ధం చేసింది.

వచ్చేవారం నుంచి తమ కుటుంబానికి దగ్గరివారిని, ఐసోలేషన్‌లో ఉన్న సంరక్షకులు లేదంటే ఒకే పట్టణం లేదా నగరంలో ఐసోలేషన్‌లో నివసిస్తున్న వారితో న్యూజీలాండ్ ప్రజలు తమ సామాజిక బంధాలను విస్తరించుకోవచ్చు.

న్యూజీలాండ్‌లో నమోదవుతున్న కోవిడ్ -19 కేసుల సంఖ్య గత కొద్దివారాల నుంచి వేగంగా తగ్గుముఖం పడుతోంది. ఇప్పటి వరకు న్యూజీలాండ్‌లో 18మంది చనిపోగా, 1472 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

లాక్ డౌన్ సమయంలో ప్రజలపై మానసికంగా, సామాజికంగా పడే ప్రభావాన్ని గుర్తించి దాన్ని నివారించేందుకు చేసిన కృషికి న్యూజీలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ ప్రశంసలు అందుకున్నారు. ప్రజల స్థితిగతుల్ని అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా ఆమె మాట్లాడిన తీరును అంతా అభినందిస్తున్నారు.

కానీ ఒక పక్క వ్యాక్సిన్ తయారీకి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తుండగానే, మరోసారి వైరస్ ప్రబలుతుందేమోనన్న భయంతో ప్రజల మధ్య సామాజిక దూరాన్ని కొనసాగించాలని చాలాదేశాలు భావిస్తున్నాయి.

ఈ సామాజిక బంధాలు విస్తరిస్తాయా?

సామాజిక దూరం నిబంధనలు మరికొంత కాలం అంటే ఈ ఏడాది చివరి వరకు కొనసాగించాల్సి ఉందని ఇంగ్లండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ క్రిస్ విట్టీ అన్నారు. కానీ ఈ నిబంధనలను, వాటి అమలును ఎంతకాలం కొనసాగించగలరు అన్నది ఊహించడం కష్టమే.

అయితే నిర్ణయాలు తీసుకునే ముందు శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు అతి ముఖ్యమైన రీప్రొడక్షన్ రేటు అంటే ప్రజల్లో వ్యాధి వ్యాపించే రేటు గురించి ఆలోచిస్తున్నారు. బ్రిటన్‌లో ఈ రీప్రొడక్షన్ రేటు 1 అని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ (ఎల్ఎస్‌హెచ్‌టీఎం) సంస్థ అంచనా వేసింది. అంటే ఒక వ్యక్తి తన నుంచి వ్యాధిని సగటున ఒక వ్యక్తికి మాత్రమే వ్యాపించేలా చేయగలుగుతున్నాడని అర్ధం.

చాలా దేశాల ప్రభుత్వాలు తమ దేశంలో ఈ వైరస్ రీప్రొడక్షన్ రేటు ఒకటికన్నా తక్కువయ్యే వరకు లాక్ డౌన్ నిబంధనలను సడలించవద్దని భావిస్తున్నాయి. ఆ కారణంగానే బ్రిటన్ లాక్ డౌన్ నిబంధనలను మరికొన్ని వారాలు పొడిగించింది.

లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ సంస్థలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న స్టెఫాన్ ఫ్లాషే కూడా యూకేలో లాక్ డౌన్ నిబంధనల సడలింపు తొందరపాటు అవుతుందని అన్నారు.

అయితే వ్యాక్సిన్ కోసం పరిశోధనలు కొనసాగుతున్న తరుణంలో సామాజిక బంధాల విస్తరణ అనేది ప్రజలకు పరిస్థితుల్ని తట్టుకునే శక్తినిస్తుందని స్టెఫాన్ అంటున్నారు.

''ఇది మహమ్మారిని తరిమికొట్టడానికి రూపొందించింది కాదు, కానీ సమాజానికి ఉపయోగపడుతుంది. కోవిడ్ సమస్య చాలా కాలం పాటు ఉంటుంది, కాబట్టి సమాజం సవ్యంగా సాగేలా చూసే ఏదైనా మంచిదే'' అంటున్నారు ప్రొఫెసర్ స్టెఫాన్.

‘ప్రజలకు కావాల్సింది ఒక ఆత్మీయ ఆలింగనం’

లాక్‌డౌన్ వల్ల మానసికంగా ఎంత ప్రభావం పడుతుందో ఇప్పటికే ప్రపంచమంతా అనుభవించింది. అమెరికాలో నేషనల్ మెంటల్ హెల్త్ హెల్ప్ లైన్‌కు వచ్చే కాల్స్‌లో భారీ పెరుగుదల కనిపించింది. అవి దాదాపు 900 శాతం పెరిగాయి.

ఇక అట్లాంటిక్ వ్యాప్తంగా మహమ్మారి కారణంగా పెరుగుతున్న ఒత్తిళ్ల నుంచి, మానసిక సమస్యల నుంచి బయటపడటానికి బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ తన ఉద్యోగుల కోసం ఒక ప్రత్యేక హాట్ లైన్ ఏర్పాటు చేసింది.

కోవిడ్-19 నేపథ్యంలో ప్రజలు తమకు ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళనలను పరిష్కరించుకునేందుకు భారత్ కూడా ఒక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. 08046110007 నంబర్‌కు ఫోన్ చేసి ప్రజలు నిపుణుల సలహాలను పొందవచ్చని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచించింది.

సామాజిక బంధాలను స్వల్పంగా విస్తరించడం వల్ల ప్రజల మానసిక స్థితిగతులు మెరుగుపడతాయనడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు యూకేలోని సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్ సంస్థ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆండీ బెల్.

''దీని ప్రభావం అందరిపై సమానంగా లేదు అనే విషయం అర్థం చేసుకోవడం ముఖ్యం" అని బీబీసీతో అన్నారు ఆండీ బెల్.

''మీకు రక్షణ లేకపోయినా, ఆదాయం లేకపోయినా, జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న భవనంలో నివసిస్తున్నా... లాక్ డౌన్‌లో ఉండటం చాలా కష్టంగా మారుతుంది. ఇలాంటివి ఉన్నప్పుడు మానసిక ఆరోగ్య సమస్యలు మరింత ఎక్కువగా ఉంటాయి'' అంటారు బెల్.

''ఇప్పుడు మనం దీన్ని స్వయంగా అనుభవిస్తూ నేర్చుకోబోతున్నాం" అని బెల్ చెప్పారు.

కానీ జాగ్రత్తగా మేనేజ్ చేయగలిగితే ఇలాంటి నిర్ణయాలు ఉపయోగపడతాయని రీథింక్ మెంటల్ ఇల్‌నెస్ సంస్థ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బ్రెయిన్ డౌ అంటారు.

''తాము ఇళ్లలో ఇరుక్కుపోయామని ఆందోళన పడుతున్న ప్రజలు ఆ ఆందోళన నుంచి బయటపడటానికి ఇది ఉపయోగపడుతుంది. ఆన్‌లైన్‌లో సోషలైజ్ అయ్యే విషయంలో ప్రజలు చాలా క్రియేటివ్‌గా ఉన్నారు. కానీ వాస్తవానికి ప్రజలకు ఇప్పుడు ఒక ఆత్మీయ ఆలింగనం కావాల్సి ఉంది'' అని ఆయన చెబుతున్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)