కరోనావైరస్-రిస్ట్‌బ్యాండ్స్: చేతికి ఈ బ్యాండ్ ఉంటే మీరెక్కడికి వెళ్లినా పోలీసులు పట్టేస్తారు

కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తున్న ఈ పరిస్థితుల్లో రిస్ట్ బ్యాండ్ ద్వారా మనుషుల కదలికల్ని నియంత్రించేందుకు బల్గేరియా సిద్ధమైంది.

సోఫియాలోని సుమారు 50 మంది వ్యక్తులకు ఈ డివైస్‌ ఇచ్చి జీపీఎస్ ద్వారా వారి కదలికల్ని రికార్డు చేయనున్నారు.

ఇంటికే పరిమితం కావాలన్న ప్రభుత్వ ఆదేశాలను ప్రజలు ఉల్లంఘించకుండా ఉండేందుకు చాలా దేశాలు ఇప్పుడు ఇదే తరహా రిస్ట్ బ్యాండ్‌లను పరీక్షిస్తున్నాయి.

క్వారంటైన్‌లో ఉన్న వారి కదలికల్ని ఎప్పటికప్పుడు గమనించేందుకు దక్షిణ కొరియా, హాంకాంగ్ దేశాలు ఇప్పటికే ఎలక్ట్రానిక్ ట్రాకర్స్‌‌ను ఉపయోగిస్తున్నాయి.

బల్గేరియాలో ప్రస్తుతం ప్రయోగాత్మకంగా పోలండ్‌లో తయారైన కామోర్క్ లైఫ్ రిస్ట్ బ్యాండ్లను వినియోగించనున్నారు.

ఓ వ్యక్తి ఇంటికే పరిమితమయ్యారా లేదా అన్న విషయం మాత్రమే కాదు.. ఎప్పటికప్పుడు వారి గుండె కొట్టుకునే తీరును కూడా పరిశీలిస్తూ ఎటువంటి ప్రమాదకర పరిస్థితి తలెత్తినా ఆటోమేటిగ్గా అత్యవసర సేవల విభాగానికి ఫోన్ వెళ్లిపోతుంది.

ఇక దక్షిణ కొరియాలో క్వారంటైన్ నియమాలను ఉల్లంఘించిన వారు ఈ ట్రాకింగ్ బ్యాండ్‌ ధరించి తీరాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

తమ ఆచూకీ తెలియకుండా ఉండేందుకు ఇంట్లోనే స్మార్ట్ ఫోన్లను ఉంచి బయటకి వెళ్లిపోతున్నవారి కోసమే ఈ రిస్ట్ బ్యాండ్‌ను రూపొందించారు.

ఈ రిస్ట్ బ్యాండ్ ధరించిన వ్యక్తి ఇల్లు వదిలి బయటకు వెళ్లినా లేదా దాన్ని చేతి నుంచి తొలగించే ప్రయత్నం చేసినా వెంటనే అధికారులకు సమాచారం వెళ్లిపోతుంది.

అయితే కరోనావైరస్ పేరుతో కొన్ని ప్రభుత్వాలు అధికారాన్ని తమ గుప్పెట్లో ఉంచుకునే ప్రమాదముందని పైరసీ ఇంటర్నేషనల్ వంటి స్వచ్ఛంద సంస్థలు హెచ్చరిస్తున్నాయి కూడా. ఇటువంటి కొత్త విధానాలు తాత్కాలికంగా అసరమైనంత మేరకు మాత్రమే ఉండాలని ఆ సంస్థ పేర్కొంది.

“మహమ్మారి అంతమైన మరుక్షణం అటువంటి అసాధారణ విధానాలకు స్వస్తి చెప్పాలి” అని పైరసీ ఇంటర్నేషనల్ తన బ్లాగ్‌లో తెలిపింది.

ఏయే దేశాల్లో ఈ ప్రయత్నం మొదలైంది?

బెల్జియంలో సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటించడంలో భాగంగా ఓ రిస్ట్ బ్యాండ్‌ను పరీక్షిస్తున్నారు. ఈ బ్యాండ్ ధరించిన వ్యక్తికి 3 మీటర్ల కన్నా తక్కువ దూరంలోకి ఎవరు వచ్చినా వెంటనే వైబ్రేట్ అవుతుంది.

లెక్టెన్‌స్టైన్‌లో ప్రతి పది మందిలో ఒకరికి ఓ బ్యాండ్‌ ఇచ్చారు. అది వారి శరీర ఉష్ణోగ్రతల్ని, శ్వాసను, గుండె చప్పుడును ఎప్పటికప్పుడు నమోదు చేసి స్విట్జర్లాండ్‌లోని ఓ ల్యాబ్‌కు పంపుతుంది. అక్కడ ఆ వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ముందుముందు మరో 38వేల మందికి ఈ తరహా రిస్ట్ బ్యాండ్‌లను ఇవ్వనున్నారు.

క్వారంటైన్‌లో ఉన్న వారిని అనుక్షణం గమనించేందుకు వారి శరీర ఉష్ణోగ్రతలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు త్వరలోనే ఈ తరహా రిస్ట్ బ్యాండ్‌లను తయారు చేయనున్నట్టు భారత్ తెలిపింది.

హాంకాంగ్‌లో క్వారంటైన్లో ఉన్న వ్యక్తులు ఎలక్ట్రానిక్ బ్యాండ్ ధరించి ఇల్లు వదిలి బయటకు వచ్చినట్టయితే వెంటనే ఆ సమాచారం పోలీసులకు వెళ్లిపోతుంది.

అలాగే, ఈ డివైస్‌ ధరించిన వ్యక్తి ఎవరెవర్ని కలిశారో వారి ఆచూకీని తెలుసుకునేందుకు కూడా ఇవి సహాయపడతాయి.

రిస్ట్ బ్యాండ్ ధరించిన వ్యక్తి ఎవరితో ఎక్కువ కాలం గడిపారన్న సమాచారం కూడా దీనిలో రికార్డు అవుతుంది. అందువల్ల ఒకవేళ పరీక్షల్లో పాజిటివ్ అని తేలితే వెంటనే సంబంధితులందరికీ సమాచారం వెళ్లిపోతుంది.

యాపిల్, గూగుల్ సంస్థలు కూడా బ్లూటూత్ సాయంతో పనిచేసే ఈ తరహా వ్యక్తిగత నిఘా విధానాలను తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి. బ్రిటన్‌లో నేషనల్ హెల్త్ సర్వీస్ టెక్నాలజీ కూడా అటువంటి ప్రయత్నంలోనే ఉంది.

అయితే, బ్రిటన్‌లో సుమారు 12 శాతం స్మార్ట్‌ఫోన్ల బ్లూటూత్‌లో దీనికి అవసరమైన లో-ఎనర్జీ (బీటీఎల్ఈ) టెక్నాలజీ లేదు. స్మార్ట్‌ఫోన్లు లేని వాళ్లు సింపుల్ బ్లూటూత్ రిస్ట్ బ్యాండ్‌లను ఉపయోగించడం మంచిదని పరిశోధకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)