కరోనావైరస్: ఈ మహమ్మారి దెబ్బకు ఐసీయూ అంటే ఏమిటో అందరికీ తెలిసిపోయింది...

    • రచయిత, క్రిస్టినా జె.ఆర్గజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఎప్పుడు ఏ మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా ఒక యంత్రం విషమ పరిస్థితుల్లో ఉన్న వారి ప్రాణాలను కాపాడుతూ ఉంటుంది. ఒకప్పుడు కరోనా లాంటి ఒక మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలోనే ఈ యంత్రాన్ని నిర్మించారు.

ప్రపంచవ్యాప్తంగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్, మెకానికల్ వెంటిలేషన్ మెషిన్లు సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రారంభం అయ్యాయి.

ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో ఎన్నో ఆస్పత్రులు వాటిని ఉపయోగిస్తున్నాయి. లక్షలాది కోవిడ్-19 పాజిటివ్ రోగులకు చికిత్స అందించడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

కరోనా సంక్షోభ సమయంలో ఐసీయూ, వెంటిలేటర్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ 68 ఏళ్ల క్రితం ఇవి అసలు ఉనికిలోనే లేవు.

1952 ఆగస్టులో ఇప్పటి కరోనావైరస్ లాగే ఒక మహమ్మారి వ్యాపించింది. దానివల్ల కొన్ని వేలమంది శ్వాసకోస వ్యవస్థ విఫలమై చనిపోయారు. అప్పుడు వ్యాపించిన ఆ వ్యాధి పోలియో.

68 ఏళ్ల క్రితం

డెన్మార్క్ రాజధాని కోపెన్‌హేగన్‌లో 500 పడకల బ్లేగడెమ్ ఆస్పత్రిలో రోగుల సంఖ్య భారీగా పెరగడంతో అందరికీ చికిత్స అందించలేని దారుణమైన పరిస్థితిలో పడిపోయారు డాక్టర్, నర్సులు.

ఆ రోగుల్లో ఎక్కువమంది పిల్లలే. ఆ సమయంలో పోలియో ఒక ప్రమాదకరమైన వైరల్ ఇన్ఫెక్షన్. దానికి ఎలాంటి చికిత్స లేదు.

వారిలో చాలామందికి ఎలాంటి లక్షణాలూ కనిపించకుండానే జబ్బు పడేవారు. కొన్ని కేసుల్లో ఈ వైరస్ వెన్నెముక, మెదడు నరాలపై దాడి చేసేది.

ఇది వచ్చిన రోగులకు, ముఖ్యంగా కాళ్లకు పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంటుంది.

బ్రిటన్ హెల్త్ సర్వీస్ వివరాల ప్రకారం శ్వాసకోస వ్యవస్థలోని కండరాలు పక్షవాతానికి గురైనప్పుడు ఈ వ్యాధి ప్రాణాంతకం అయ్యేది.

గత శతాబ్దం మధ్యలో ఈ పోలియో మహమ్మారికి అత్యంత తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో డెన్మార్క్ రాజధాని కోపెన్‌హేగెన్ ఒకటి.

పోలియో మహమ్మారి

సైన్స్ జర్నల్ నేచర్‌లో ప్రచురించిన ఒక ఆర్టికల్ ప్రకారం బ్లెగడెమ్‌ ఆస్పత్రికి అప్పట్లో ప్రతి రోజూ 50 పోలియో కేసులు వస్తుండేవి. వాటిలో ఆరు నుంచి 12 కేసుల్లో రోజూ శ్వాసకోస వ్యవస్థ విఫలమై సమస్యలు వచ్చేవి.

“పోలియో మహమ్మారి వ్యాపించినప్పుడు మొదట్లో ఎక్కువమంది రోగులు వచ్చేవాళ్లు. వారిలో 87 శాతం రోగులు మెదడుపై, తర్వాత వారి శ్వాసను నియంత్రించే నరాలపై పోలియో దాడి చేసేది. ఆ రోగుల్లో ఎక్కువమంది పిల్లలే ఉండేవారు”.

కానీ ఒక డాక్టర్ ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. ఆధునిక మెడికల్ సైన్స్ చరిత్రలో ఒక కీలక అధ్యాయం లిఖించారు.

డెన్మార్క్ డాక్టర్ బజార్న్ ఆజే వృత్తిపరంగా అనస్తీషియా స్పెషలిస్ట్. ఆయన తన కెరియర్‌లో సుదీర్ఘ కాలం అమెరికాలోని బోస్టన్‌లో ఉన్నారు. తన దేశం ఆరోగ్య సంక్షోభంలో చిక్కుకోవడంతో ఆయన దానికి పరిష్కారం వెతికారు. వేలమంది పోలియో రోగుల ప్రాణాలను కాపాడారు.

ఐసీయూ అంత కీలకం ఎందుకు

“ప్రధాన అవయవాలు పనిచేయకుండా అగిపోయిన రోగులకు ప్రాణరక్షక వ్యవస్థ సపోర్టు అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ పరిస్థితిలో రోగుల ప్రాణాలే ప్రమాదంలో పడవచ్చు” అని స్విట్జర్లాండ్‌లోని ఒక అతిపెద్ద ఆస్పత్రిలో కరోనా రోగుల బాగోగులు చూస్తున్న డాక్టర్ ఫిలిప్ జెంట్ చెప్పారు.

ఐసీయూలో రోగుల పరిస్థితిని సమీపం నుంచి గమనించవచ్చు. వారి అవసరాన్ని బట్టి చికిత్స మార్చవచ్చు. ఐసీయూలోనే మాత్రమే రోగులను ప్రత్యేకంగా చూసుకోవడం సాధ్యం అవుతుంది. ఐసీయూల కోసం ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సుల నిష్పత్తి చాలా ఎక్కువ ఉంటుంది. ఐసీయూలో చేర్చే రోగులను చూసుకునే డాక్టర్లు హై క్వాలిఫైడ్ అయి ఉండాలి.

బహుశా, అందుకే ఐసీయూను ఇంటెన్సివ్ మెడిసిన్ అని కూడా అంటారు. ఐసీయూలో రోగులను జాగ్రత్తగా చూసుకోవడం మాత్రమే ఉండదు. అక్కడ పరిశుభ్రత అత్యున్నత ప్రమాణాలతో ఉండేలా చూసుకుంటారు. ఇక్కడ కిడ్నీ, గుండె, శ్వాసకోశ వ్యాధులు ఉన్న రోగులకు అవసరమైన యంత్రాలు ఉపయోగించడం చాలా ముఖ్యం.

దీని గురించి డాక్టర్ ఫిలిప్ జెంట్ వివరిస్తూ.. “తరచూ ప్రజలకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తుండేవి. ఆ సమస్య ఊపిరితిత్తులకు సంబంధించినది. అందుకే ఐసీయూలో చేర్చే రోగులకు రెస్పిరేటర్స్ సాయంతో కృత్రిమ శ్వాస అందిస్తారు” అని చెప్పారు.

లోహంతో చేసిన రెస్పిరేటర్

కానీ డెన్మార్క్ లో పోలియో మహమ్మారి వ్యాపించినపుడు కోపెన్‌హేగన్‌లో ఒక రెస్పిరేటర్ మాత్రమే ఉండేది. అది కూడా లోహంతో చేసినది.. అది కాకుండా అక్కడ ఆరు ‘ఎక్స్ టర్నల్ రెస్పిరేటర్స్’ కూడా ఉండేవి.

1953లో ప్రచురించిన ఒక ఆర్టికల్‌లో రచయిత, బ్లెగడేమ్ హాస్పిటల్ చీఫ్ హెన్రీ సై అలగ్జాండర్ లాసెన్ “వాస్తవానికి పోలియో మహమ్మారి వ్యాపించినపుడు మాకు ఈ మెషిన్లు పూర్తిగా సరిపోలేదు. కానీ మేం వాటితోనే చికిత్స అందించాం. అప్పుడే వేరే దారులు కూడా వెతికాం. ముందు ముందు ఎవరికి రెస్పిరేటర్‌ పెట్టాలి, ఎవరికి పెట్టవద్దు అనే నిర్ణయం తీసుకునే పరిస్థితి మాకు రాకూడదని అనుకున్నాం” అన్నారు.

ఆ సమయంలో డాక్టర్ హెన్రీ ఎలాంటి సందిగ్ధంలో ఉన్నారో, అలాగే ఇప్పుడు కరోనా సంక్షోభ సమయంలో చాలామంది డాక్టర్లు అదే పరిస్థితిలోనే ఉన్నట్టు కనిపిస్తున్నారు.

బ్లెగడెమ్ ఆస్పత్రిలో లోహంతో చేసిన రెస్పిరేటర్ ఉండేది. దానిని 1928లో కనిపెట్టారు. అది ఒక కాప్స్యూల్‌లా ఉండేది. అందులో రోగి శరీరాన్ని ఉంచేవారు. రోగి శరీరం చుట్టూ ఆ యంత్రం శూన్యత(వాక్యూమ్)సృష్టించేంది. దానివల్ల రోగి పక్కటెముకలపై ఒత్తిడి పడుతూ ఉండేది. గాలి చొరబడేలా వారు ఊపిరితిత్తులను ఉబ్బించేవారు.

కానీ ఆ యంత్రంలో రోగి స్పృహతప్పినపుడు డాక్టర్లకు చాలా కష్టంగా ఉండేది. రోగులు తమ లాలాజలాన్ని మింగలేకపోయేవారు. కడుపులో జరిగేవి భరించలేకపోయేవారు. ఆ స్థితిలో రోగులకు తరచూ ఊపిరి తీసుకోవడంలో సమస్య వస్తుండేది.

డాక్టర్ ఇస్పెన్ ఏం చేశారు

బ్లెగడెమ్ ఆస్పత్రి కోసం డాక్టర్ ఇస్బెన్ ఒక వ్యవస్థను రూపొందించారు. దాని సాయంతో ఆ ఆస్పత్రి సమస్యలన్నీ తీరిపోయాయి. ఆ కొత్త యంత్రంపై మొట్టమొదట చికిత్స చేయించుకున్న రోగి ఒక 12 ఏళ్ల బాలిక. ఆమె పేరు వివి. పోలియో వైరస్‌తో పక్షవాతం రావడంతో ఆమె మరణం అంచుల్లో ఉంది.

ఆ మెడికల్ కేస్ గురించి డాక్టర్ ఇస్బెన్‌ను ఇంటర్వ్యూ చేసిన మరో అనస్తీషియా నిపుణుడు ప్రెబెత్ బర్తల్సన్ ఇలా వివరించారు. “అందరూ అప్పుడు వివి చనిపోతుందనే అనుకుంటున్నారు. కానీ డాక్టర్ ఇస్బెన్ సంప్రదాయ చికిత్సలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారు” అన్నారు.

పోలియో రోగులకు కూడా, సర్జరీ రోగుల్లాగే చికిత్సలు జరగాలని డాక్టర్ ఇస్బెన్ భావించేవారు. ఆయన రోగుల ఊపిరితిత్తుల్లోకి గాలిని నేరుగా పంపాలని అనుకున్నారు. అలా చేసినప్పుడు వారి శరీరం విశ్రాంతి తీసుకుంటుందని, మెల్లమెల్లగా స్వయంగా ఊపిరి తీసుకోగలుగుతుందని చెప్పారు.

ట్రాకియోస్టమీ ఆలోచన

పోలియో రోగులకు ట్రాకియోస్టమీ ఉపయోగించాలని కూడా డాక్టర్ ఇస్బెన్ సలహా ఇచ్చారు. ఈ ప్రక్రియలో రోగుల మెడ దగ్గర ఒక రంధ్రం చేసి, దాన్నుంచి ఒక ట్యూబ్ ద్వారా రోగి ఊపిరితిత్తుల్లోకి ఆక్సిజన్ సరఫరా చేస్తారు.

అప్పట్లో ఆపరేషన్ సమయంలో మాత్రమే ట్రాకియోస్టమీ ఉపయోగించేవారు కానీ, పోలియో రోగి ఉన్న ఆస్పత్రి వార్డులో దానిని చేయడం గురించి బహుశా ఎవరూ ఆలోచించలేదు.

డాక్టర్ ఇస్బెన్ విధానం పనిచేస్తుంది అని బ్లెగడెమ్ హాస్పిటల్ చీఫ్ డాక్టర్ హెన్రీకి అసలు నమ్మకమే లేదు. కానీ అప్పుడు ఆ బాలిక ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉండడంతో, ఆయన అలా చేయడానికి అనుమతి ఇచ్చారు. చివరికి అద్భుతం జరిగింది. డాక్టర్ ఇస్బెన్ విధానం వల్ల చనిపోతుందని అంతా అనుకున్న పోలియో రోగి వివి కోలుకుంది.

కానీ, ఆ ప్రక్రియలో కూడా ఒక సమస్య వచ్చింది. ఊపిరితిత్తుల్లోకి రబ్బర్ ట్యూబ్ ద్వారా గాలి పంపించడానికి యంత్రాలేవీ లేవు. దానిని అప్పట్లో చేతితో నొక్కాల్సి వచ్చేది. డాక్టర్ లేదా నర్సులు ప్రెజర్ నాబ్ లేదా బ్యాగ్ సాయంతో ట్యూబ్ ద్వారా గాలి పంపించేవారు. దానికోసం డాక్టర్ హెన్రీకి చాలా మంది సిబ్బందికి డ్యూటీ వేయాల్సి వచ్చేది.

ఐసీయూ వార్డు స్థాపన

“ఆ తర్వాత మేం శ్వాస తీసుకోడానికి ఇబ్బంది పడుతున్న రోగులందరికీ చికిత్స అందించగలిగే స్థితికి చేరుకున్నాం. పోలియో రోగుల మరణాల రేటు కూడా 87 శాతం నుంచి తగ్గి 31కి చేరింది” అని డాక్టర్ హెన్రీ చెప్పారు.

ఆ తర్వాత ఏడాది బ్లెగడెమ్ ఆస్పత్రిలో శాశ్వతంగా ఒక ఇన్సెంటివ్ కేర్ యూనిట్ వార్డు స్థాపించారు. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆస్పత్రుల్లో వాటిని ఏర్పాటు చేశారు.

ఇప్పుడు కోవిడ్-19 మహమ్మారి వేగంగా వ్యాపిస్తున్న సమయంలో ప్రపంచమంతా ఐసీయూ పడకలు, మెకానికల్ వెంటిలేటర్ల కోసం ఇబ్బంది పడుతోంది. ఎందుకంటే ఇవి లేకపోతే, కరోనా పాజిటివ్ రోగులకు వైద్య చికిత్స అందించడం కష్టం అవుతుంది.

68 ఏళ్ల క్రితం సుమారు ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక డెన్మార్క్ అనస్తీషియా నిపుణుడు అప్పటి కష్టానికి పరిష్కారం వెతికాడు అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)