కరోనావైరస్‌: మొదటి మృతిని ధ్రువీకరించిన అమెరికా... ఆందోళన అవసరం లేదన్న ట్రంప్

అమెరికాలో కరోనావైరస్ బాధిత తొలి మరణం నమోదైంది. కోవిడ్ -19 కారణంగా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి వయసు సుమారు 50 ఏళ్లు ఉంటుందని, వాషింగ్టన్‌లో కింగ్ కౌంటీ ప్రాంతానికి చెందిన వారని అధికార వర్గాలు వెల్లడించాయి.

మరిన్ని కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉందని, అయితే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.

ఇరాన్‌పై ఉన్న ప్రయాణ ఆంక్షల్ని మరింత విస్తృతం చేస్తున్నామని అధికారులు తెలిపారు. అలాగే కరోనావైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న ఇటలీ, దక్షిణ కొరియా ప్రాంతాలకు అమెరికన్లు వెళ్లద్దని కూడా విజ్ఞప్తి చేశారు.

అమెరికాలో అసలేం జరుగుతోంది?

కరోనావైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి ఇటీవల కాలంలో ఎటువంటి ప్రయాణాలు చెయ్యలేదని వైద్య వర్గాలు తెలిపాయి. అంతకుముందు వైరస్ సోకిన వ్యక్తి ఓ మహిళ అని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం కొంత గందరగోళానికి దారి తీసింది. తాజా మరణంతో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు వాషింగ్టన్ గవర్నర్ జే ఇన్స్లీ.

ట్రంప్ ఇంకా ఏమన్నారు

కరోనావైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు తమ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని, ఎవ్వరూ ఆందోళనకు గురికావాల్సిన పనిలేదని ట్రంప్ అన్నారు. గడిచిన 14 రోజుల్లో ఇరాన్ నుంచి వచ్చే విదేశీయులపై కూడా నిషేధం విధిస్తున్నట్టు విదేశాంగమంత్రి మైక్ పాంపేయో తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)