మయన్మార్‌ ఎయిర్‌లైన్స్‌: ముందు చక్రాలు లేకున్నా క్షేమంగా విమాన ల్యాండింగ్

ముందు చక్రాలు పనిచేయకున్నా, మయన్మార్‌లో ఓ విమానాన్ని పైలట్ చాకచక్యంతో క్షేమంగా దించారు. మాండలే విమానాశ్రయంలో దాన్ని ల్యాండ్ చేశారు.

రన్‌వేపై విమానం కొద్దిదూరం జారుకుంటూ వెళ్లినప్పటికీ, పెనుప్రమాదం తప్పింది.

అందులో ప్రయాణిస్తున్న మొత్తం 89 మంది గాయాలేవీ లేకుండా క్షేమంగా బయటపడ్డారు.

మయన్మార్ రవాణాశాఖ మంత్రి విన్ ఖాంట్ రాయిటర్స్ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. ల్యాండింగ్‌లో పైలట్ కెప్టెన్ మ్యాట్ మో ఆంగ్ చూపించిన నైపుణ్యాన్ని ప్రశంసించారు.

మయన్మార్ జాతీయ ఎయిర్‌లైన్స్‌ (ఎంఎన్‌ఏ)కు చెందిన ఎంబ్రాయర్ 190 విమానం ఇలా దిగాల్సి వచ్చింది.

యాంగూన్ నుంచి ఈ విమానం బయల్దేరిందని, ముందు చక్రాలు విఫలం కావడంతో పైలట్ అత్యవసర ప్రక్రియలను అనుసరించి దాన్ని దించారని ఎమ్‌ఎన్ఏ పేర్కొంది.

ముందు చక్రాలు బయటకు వస్తున్నాయో, లేదో నిర్ధరించుకునేందుకు విమానాన్ని ల్యాండింగ్‌కు ముందు విమానాశ్రయం చుట్టూ రెండు సార్లు పైలట్ చక్కర్లు కొట్టించారని, విమాన బరువును తగ్గించేందుకు ఇంధనాన్ని చాలావరకూ మండించారని వివరించింది.

ఈ ఘటనకు సంబంధించినవిగా పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు వీడియోలు పోస్ట్ చేశారు.

విమానం వెనుక చక్రాలపై దిగిన తర్వాత తల భాగం రన్‌వేపై తాకినప్పుడు చిన్నగా మంటలు రాజుకోవడం వాటిలో కనిపించింది. దాదాపు 25 సెకన్లపాటు విమానం జారుకుంటూ వెళ్లి ఆగిపోయినట్లుగా వాటిలో ఉంది.

గత వారం రోజుల్లో మయన్మార్‌లో జరిగిన రెండో విమాన ప్రమాదం ఇది.

యాంగూన్‌లో బుధవారం ప్రతికూల వాతావరణంలో ల్యాండ్ అయిన విమానం రన్‌వేపై నుంచి జారి పక్కకు వెళ్లిపోయింది.

ఈ ఘటనలో 17 మందికిపైగా గాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)