You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమెరికా బాంబర్లను ధ్వంసం చేస్తామంటున్న ఉత్తర కొరియా
అమెరికా బాంబర్లను కూల్చేసే హక్కు తమకుందని ఉత్తరకొరియా ప్రకటించింది. తమ దేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం ప్రకటిస్తున్నారని.. అందువల్ల ఆ యుద్ధ విమానాలు తమ భూభాగంలో లేకున్నా వాటిని కూల్చేస్తామని ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రి యోంగ్-హో ప్రకటించారు.
ఉత్తర కొరియా ఇలాగే మాటల దాడిని కొనసాగిస్తే, 'ఆ దేశ నాయకత్వం ఎక్కువ కాలం ఉండద'న్న ట్రంప్ ట్వీట్పై ఆయన ఇలా ప్రతిస్పందించారు.
''మా దేశంపై మొదట యుద్ధాన్ని ప్రకటించింది అమెరికానే'' అని యోంగ్-హో అన్నారు. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించి, న్యూయార్క్ వదిలి వెళ్లబోయే ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఐక్యరాజ్య సమితిలో చేసిన ప్రసంగంలో యోంగ్-హో.. అమెరికా అధ్యక్షుణ్ని ''నేనే గొప్ప అనుకునే మతి భ్రమించిన వ్యక్తి''గా అభివర్ణించారు.
'ఎవరు ఎక్కువ కాలం ఉంటార'న్న ప్రశ్నకు తమ దేశం సమాధానం ఇస్తుందని హెచ్చరించారు.
కొట్టపారేసిన అమెరికా
ఉత్తర కొరియా ప్రకటనను కొట్టిపారేసిన అమెరికా, ప్యాంగ్యాంగ్ ఇలాంటి రెచ్చగొట్టే మాటలు ఆపేయాలని హెచ్చరించింది.
పెంటగాన్ ప్రతినిధి కల్నల్ రాబర్ట్ మానింగ్, ''రెచ్చగొట్టే చర్యలు మానకపోతే, ఉత్తర కొరియాకు సరైన సమాధానం చెబుతాం'' అని హెచ్చరించారు.
అమెరికా వరుసగా ఆంక్షలు విధిస్తున్నా, ఉత్తర కొరియా తన అణ్వాయుధ, బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు కొనసాగిస్తూనే ఉంది. ఇతర దేశాలు తమ దేశంపై దాడి చేయకుండా తమకు అవే రక్షణ అని అంటోంది.
మాకు ఆ హక్కుంది: అమెరికా
ఇటీవల అమెరికాకు చెందిన బీ1-బీ లాన్సర్ బాంబర్లు, ఎఫ్-5 ఫైటర్లు ఉత్తర కొరియాకు తూర్పున ఉన్న సముద్ర జలాలపై గస్తీ తిరిగిన నేపథ్యంలో ఉత్తర కొరియా హెచ్చరికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
అలా గస్తీ తిరిగేందుకు తమకు హక్కు ఉందని అమెరికా వాదిస్తోంది.
ఆ యుద్ద విమానాలు తమ మీద దాడులు చేసేందుకే అని ఉత్తర కొరియా భావిస్తే ఏమిటనేది ఇప్పుడు కలవరపెడుతున్న ప్రశ్న.
బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్లోనూ సబ్స్క్రైబ్ చేసుకోండి