సిరివెన్నెల సీతారామశాస్త్రి: 'తరలి రాద తనే వసంతం' అంటూ తరలి రాని లోకాలకు వెళ్లిన సినీ కవికి ప్రముఖుల నీరాజనం

పాటల రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృతితో టాలీవుడ్ ఒక సాహిత్య శిఖరాన్ని కోల్పోయిందని తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు కళకారులు, రచయితలు వ్యాఖ్యానించారు.

సినీ గేయ రచనలో వేటూరితో కలిసి నడిచి, ఆయన వారసత్వాన్ని నేటి దాకా కొనసాగిస్తూ వచ్చిన సిరివెన్నెల తెలుగు సినిమా చరిత్రలో తనదైన పేజీని సృష్టించుకున్నారని సినీ ప్రముఖులు వ్యాఖ్యానించారు.

సీతారామశాస్త్రి లేకపోవడం సాహిత్యానికి చీకటి రోజుగా మెగాస్టార్ చిరంజీవి అభివర్ణించారు. తన సినిమా రుద్రవీణ లో ఆయన రాసిన తరలి రాద తనే వసంతం పాటను చిరంజీవి ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు.

నడిచి వచ్చే నక్షత్రంలా ఆయన స్వర్గద్వారాల వైపు సాగిపోయారు. మనకు సాహిత్యాన్ని కానుకగా ఇచ్చి వెళ్లారని చిరంజీవి ట్వీట్ చేశారు.

సీతారామశాస్త్రి మృతిపట్ల హీరో బాలకృష్ణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

‘‘తెలుగు పాట‌ని త‌న సాహిత్యంతో ద‌శ‌దిశ‌ల వ్యాపింప‌జేసిన ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి నాకు ఎంతో ఆప్తులు. నేను న‌టించిన చిత్రాల‌కు వారు అద్భుత‌మైన పాట‌లు రాశారు. సినిమా పాట‌కు సాహిత్య గౌర‌వాన్ని క‌లిగించిన వ్య‌క్తి సిరివెన్నెల ఈ రోజు మ‌న మ‌ధ్య లేక‌పోవ‌డం చాలా బాధాక‌రం. వారి ప‌విత్ర ఆత్మ‌కు శాంతి చేకూర్చాల‌ని ఆ భ‌గ‌వంతున్ని కోరుకుంటున్నాను. వారి కుంటుంభ స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను" అని నటుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌ ఒక ప్రకటనలో తెలిపారు.

సీతారామశాస్త్రి సరస్వతీ పుత్రుడని, ఆయన మరణం సినీ రంగానికి పెద్ద లోటని నటుడు మోహన్ బాబు అన్నారు.

ఆ పాట చిరస్మరణీయం

తెలుగు భాష ఉన్నంత కాలం సీతారామశాస్త్రి రాసిన పాట ఉంటుందని హీరో జూనియర్ ఎన్టీయార్ అన్నారు. ఆయన మరణం సినిమా పరిశ్రమకు తీరని లోటని ఎన్టీయార్ ట్విటర్ సంతాప సందేశంలో పేర్కొన్నారు.

సీతారామశాస్త్రి మరణం తనకు వ్యక్తిగతంగా కూడా లోటని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అస్వస్తత నుంచి కోలుకుంటారని భావించానని, ఈ దుర్వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని పవన్ కల్యాణ్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

సీతారామశాస్త్రి మృతిపట్ల మరో నటుడు నందమూరి కల్యాణ్ రామ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

అక్షరం ఆరిపోయింది

సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం పై త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన కామెంట్లు తెలుగు సినీ సాహిత్యాభిమానులకు చిరపరిచితం. అర్ధంకాని వారు కూడా ఈ పాటను అర్ధం చేసుకోవాలి అనిపించేలా రాయడం సిరివెన్నెల స్టైల్ అంటూ త్రివిక్రమ్ ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు.

సిరివెన్నెల మరణంతో ఇప్పుడు ఆ అక్షర జ్యోతి ఆరిపోయిందని త్రివిక్రమ్ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.

సిరివెన్నెల మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ తన సంగీత దర్శకత్వంలో ఆపద్భాంధవుడు సినిమాకు ఆయన రాసిన ఒక పాట తొలి చరణాన్ని ఎం.ఎం.కీరవాణి చేతి రాతతో ట్విటర్‌లో షేర్ చేశారు.

తనకు జీవితంలో మర్చిపోలేని పాటలను అందించిన సీతారామశాస్త్రిగారి మరణం పట్ల తాను షాక్‌కు గురయ్యానని కథానాయిక పూజాహెగ్డే ట్విటర్‌లో పేర్కొన్నారు. సినిమా పరిశ్రమకు ఆయన లేకపోవడం పెద్ద లోటని పూజాహెగ్డే అన్నారు.

అల వైకుంఠపురంలో సినిమాకు ‘సామజవరగమన’ అంటూ సిరివెన్నెల రాసిన పాట పెద్ద హిట్ అయ్యింది.

మరోవైపు సినిమా అభిమానులు కూడా సీతారామ శాస్త్రివి మృతిపట్ల ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున సంతాపం ప్రకటిస్తున్నారు.

‘‘ఆగిపోయిన మీ మీ కలాన్ని చూసి కవితాప్రేమికుల హృదయాలు కదిలి కన్నీరుగా మారుతున్నాయి. మీరు మీ రచనలలో శాశ్వతంగా ఉంటారు’’ అని ఓ యూజర్ పేర్కొన్నారు.

‘‘దివినుంచి భువికేగినా, మీ పాటల జ్ఞాపకాలతో మా మనసులో పదిలంగానే ఉంటారు’’ అంటూ మరో యూజర్ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)