పక్షులు సుదూర ప్రాంతాలకు దారి తప్పకుండా ఎలా వలస పోతాయి... ఆ రహస్యమేంటి?

    • రచయిత, హెలెన్ బ్రిగ్స్
    • హోదా, బీబీసీ సైన్స్ కరెస్పాండెంట్

పక్షులు సముద్రాలు దాటుకుని సుదూర ప్రాంతాలకు ఎలా వలస పోగలుగుతున్నాయి? దీని వెనుక ఉన్న మిస్టరీని ఛేదించడంలో శాస్త్రవేత్తలు ఓ అడుగు ముందుకు వేశారు.

రాబిన్ పక్షుల మీద పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు అవి భూ ఆయస్కాంత క్షేత్రాన్ని ఎలా గ్రహిస్తాయనే విషయంలో కొన్ని ఆధారాలను గుర్తించ గలిగారు.

మనుషులు అయస్కాంత దిక్సూచితో ఉత్తర, దక్షిణాలను గుర్తించడం మనకు తెలిసిందే. అయితే, పక్షుల్లో అలాంటి 'సజీవ అయస్కాంత దిక్సూచి' అంతర్గతంగా ఇమిడి ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

పక్షుల కంటిలోని ఒక రసాయనం అయస్కాంతానికి స్పందిస్తుందన్నదే ఈ తాజా అధ్యయనాలకు రుజువు కాగలదని వారు చెబుతున్నారు.

భూ అయస్కాంత క్షేత్రాన్ని పక్షులు 'చూడగలవు' అని తెలుస్తోంది కానీ, ఆ విషయాన్ని కచ్చితంగా చెప్పలేమని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ పీటర్‌ హోరే అన్నారు.

"వలసపోయే పాటల పక్షుల్లో ఒక పరమాణువు భూ అయస్కాత క్షేత్ర దిశను గుర్తించగలుగుతుందని మేం అనుకుంటున్నాం. అవి కచ్చితంగా ఆ పని చేస్తాయి. అలా గుర్తించిన సమాచారాన్ని ఉపయోగిస్తూనే అవి వేలాది కిలోమీటర్లు వలసపోగలుగుతున్నాయి" అని పీటర్ బీబీసీతో చెప్పారు.

ప‌క్షులు, సముద్ర‌పు తాబేళ్లు, చేప‌లు, కీట‌కాలు భూ అయస్కాంత క్షేత్ర దిశను ఆధారంగా చేసుకుని సుదూర ప్రాంతాల‌కు ఎలా వ‌ల‌స‌పోతున్నాయో తెలుసుకునేందుకు దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు.

యూరోపియ‌న్ రాబిన్ ప‌క్షుల కంటి రెటీనాలో ఉండే క్రిప్టోక్రోమ్ అనే ప‌ర‌మాణువు అయస్కాంత క్షేత్ర దిశ‌ను గుర్తించేలా చేస్తుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు భావిస్తున్నారు.

ఇది అయస్కాంత సెన్సార్‌లా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి, శుద్ధి చేసిన దాని అణురూపాంతరంపై ప్రయోగశాలలో ఆక్స్‌ఫర్డ్‌ బృందం పరిశోధనలు జరిపింది. దీనిలో అధిక అయస్కాంతతత్వాన్ని కలిగిన 'రాడికల్స్‌' జతలను ఏర్పరచుకునే సామర్థ్యం ఉందని కనుగొన్నారు.

రాబిన్ క‌ళ్ల‌లోకి కాంతి చేరిన త‌ర్వాత దాని రెటీనాలో కొన్ని ర‌సాయ‌న చ‌ర్య‌లు జ‌రుగుతాయ‌ని పీటర్ హోర్ చెప్పారు. ఇవి క్రిప్టోక్రోమ్ పరమాణువులోని ఎల‌క్ట్రాన్ల‌ను క‌దిలేలా చేసి, ఒక ర‌క‌మైన శ‌క్తిని ఉత్ప‌త్తి చేస్తాయ‌న్నారు. కొద్దిసేపు మాత్ర‌మే ఉండే ఈ శ‌క్తి ఒక మైక్రోస్కోప్‌లా ప‌ని చేసి ప‌క్షిని అయస్కాంత క్షేత్రం దిశ‌ను గుర్తించేలా చేస్తాయ‌ని ఆయన వివరించారు. ఇదంతా తమ అంచ‌నా మాత్ర‌మేన‌ని, దీనిపై ఇంకా చాలా పరిశోధనలు జ‌ర‌గాల్సి ఉంద‌ని వెల్ల‌డించారు.

వ‌ల‌స వెళ్ల‌ని కోళ్ల‌లాంటి జీవుల‌తో పోల్చితే వ‌ల‌స‌పోయే రాబిన్స్‌లో అయస్కాంత క్షేత్రం దిశ‌ను గుర్తించే ప‌దార్థం ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతున్న‌ట్లు తేలింది. రాబిన్ ప‌క్షులు యూర‌ప్‌, స్కాండినేవియా, ర‌ష్యాలోని చ‌ల్ల‌టి ప్రాంతాల నుంచి వేడి ప్రాంతాల‌కు వంద‌ల మైళ్లు ప్ర‌యాణిస్తుంటాయి.

ఈ ప‌రిశోధ‌న నేచ‌ర్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురితమైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)