పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు: జనం పెద్దగా లేరనే అమిత్ షా ఝాడ్‌గ్రామ్ ర్యాలీని రద్దు చేశారా?

పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఎన్నికల ప్రచారం జోరు పెంచింది.

సోమవారం హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో రెండు ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు.

కేంద్ర హోంమంత్రి మొదట ఝాడ్‌గ్రామ్‌లో పార్టీ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించాలి. కానీ, హెలికాప్టర్‌లో టెక్నికల్ సమస్య తలెత్తడంతో ఆయన అక్కడకు వెళ్లడానికి బదులు, వర్చువల్‌గా ప్రసంగించారు.

ఆయన తన ప్రసంగంలో ప్రచారం కోసం నేను ఝాడ్‌గ్రామ్ రావాల్సింది. కానీ దురదృష్టవశాత్తూ నా హెలికాప్టర్ పాడవడంతో మీ మధ్యకు రాలేకపోయాను" అని చెప్పారు.

జనాలు లేరనే షా రాలేదు- టీఎంసీ

అమిత్ షా ఝాడ్‌గ్రామ్‌ ర్యాలీకి రాకపోవడాన్ని రాష్ట్ర అధికార పార్టీ టీఎంసీ ఒక పెద్ద ప్రచారాంశంగా మర్చుకుంది.

"ఆ ర్యాలీలో జనాలు లేరు, అందుకే, తప్పనిసరి పరిస్థితుల్లో అమిత్ షా తన నిర్ణయం మార్చుకోవాల్సి వచ్చింది" అని తృణమూల్ ప్రతినిధి కృణాల్ ఘోష్ ఆరోపించారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గౌరవ్ పాంధీ కూడా కొన్ని ఫొటోలు, వీడియోలు ట్వీట్ చేసి అమిత్ షా సభ గురించి విమర్శలు చేశారు.

"జనం తక్కువగా రావడంతో అమిత్ షా పశ్చిమ బెంగాల్ ర్యాలీ రద్దయ్యింది. గోదీ మీడియా (దత్తత మీడియా) మాత్రం, ఇది సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం వల్ల అంటుంది. కానీ, వాస్తవం ఏంటంటే మొదటి దశ ఎన్నికల ముందే బీజేపీ పతనం ప్రారంభమైంది" అన్నారు.

మరో ట్వీట్‌లో ఒక వీడియో పోస్ట్ చేసిన గౌరవ్ "సభ జరిగే ప్రాంతంలో ఉన్న ఖాళీ కుర్చీలు పశ్చిమ బెంగాల్లో బీజేపీ కథను చెబుతున్నాయి. అమిత్ షా ఆ ర్యాలీకి వెళ్లడానికి నిరాకరించారు. వర్చువల్లీ ప్రసంగించారు" అన్నారు.

కాంగ్రెస్, టీఎంసీలు ట్వీట్లు చేయడమ కాదు, ర్యాలీ జరిగిన ప్రాంతం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎన్డీటీవీ జర్నలిస్ట్ మనీష్ ర్యాలీ జరిగిన ప్రాంతం వీడియోను షేర్ చేశారు.

"కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఝాడ్‌గ్రామ్ సభను వాయిదా వేయాల్సి వచ్చింది. హెలికాప్టర్ రిపేరవడం వల్లేనని అధికారికంగా చెప్పారు. విపక్షాలు మాత్రం ఆశించినంత జనం రాకపోవడంతో అలా జరిగిందని అంటున్నాయి" అన్నారు.

మరోవైపు టీవీ చానళ్లు అమిత్ షా ర్యాలీ ప్రసారం గురించి ఏ వివరాలూ చెప్పలేదని బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి ట్వీట్ చేశారు.

బెంగాల్ గ్రామీణ ప్రాంతంలో ముందే ప్రకటించిన ర్యాలీలో అమిత్ షా ప్రసంగం కోసం నేను టీవీ చానళ్లు పెట్టాను. కానీ షెడ్యూల్ టైం తర్వాత రెండు సార్లు వాయిదా పడినా, చానళ్లు ఆ ప్రసారం గురించి ఏం చెప్పడం లేదు. ఏదైనా కారణం ఉందా? అన్నారు.

అసలు ర్యాలీ ఎందుకు రద్దయింది?

కానీ, అమిత్ షా ఆదివారమే ఖరగ్‌పూర్ చేరుకున్నారని, అక్కడ రోడ్ షో తర్వాత రాత్రి ఒక హోటల్లో బస చేశారని కోల్‌కతా నుంచి బీబీసీ సహచర ప్రతినిధి ప్రభాకర్ మణి తివారీ చెప్పారు.

సోమవారం ఉదయం ఆయన మొదట ఝాడ్‌గ్రామ్‌లోని జామ్దా, తర్వాత పురూలియాలోని రానీబాంధ్‌లో జరిగే రెండు ర్యాలీల్లో ప్రసంగించాల్సి ఉంది.

"జామ్దా ర్యాలీ గురించి ఉదయం నుంచీ గందరగోళం నడుస్తోంది. బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులను ర్యాలీకి రానివ్వడం లేదు. దాంతో వాళ్లు పోలీసులతో వాదనకు కూడా దిగారు. అమిత్ షా రావడం సందేహమేనని ఆ తర్వాత తెలిసింది" అని జామ్దా బీజేపీ అభ్యర్థి సుఖమయ్ సత్పథి చెప్పారు.

స్థానికులు మాత్రం "ర్యాలీ ఉదయం 11 గంటలకు జరగాలి. కానీ అప్పటికి కూడా మైదానంలో జనాలు లేకపోవడంతో, పోలీసులు తమ మద్దతుదారులను అడ్డుకున్నారని బీజేపీ నాయకులు చెప్పారు. కార్యకర్తల వాహనాలను సభ జరిగే ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల ముందే ఆపేస్తున్నారని, దాంతో జనాలు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు" అన్నారు.

మరోవైపు, "ఉదయం హెలికాప్టర్‌లో ఏదో టెక్నికల్ సమస్య వచ్చింది. దాంతో అమిత్ షాను రోడ్డు మార్గంలో ర్యాలీ జరిగే ప్రాంతానికి తీసుకెళ్లాలని అనుకున్నాం. అందుకే సభ ఆలస్యం అయ్యింది. కానీ, తర్వాత కాసేపటికి షా ర్యాలీకి వచ్చి ప్రసంగించడానికి బదులు, వర్చువల్‌గా ప్రసంగిస్తారని స్థానిక నేతలు ప్రకటించేశారు" అని బీజేపీ బెంగాల్ ఇన్‌ఛార్జ్ కైలాశ్ విజయవర్గీయ చెప్పారు.

అమిత్ షా ఆ తర్వాత రానీబాంధ్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు. తన హెలికాప్టర్‌లో టెక్నికల్ సమస్య రావడం వల్లే ఇక్కడకు చేరుకోవడం ఆలస్యమయ్యిందని ఆయన ఆ సభలో చెప్పారు.

దీనిపై కూడా టీఎంసీ విమర్శలు ఎక్కుపెట్టింది. "హెలికాప్టర్ పాడవడం వెనక ఏదో కుట్ర జరిగిందని ఆయన ఆరోపించలేదు ఎందుకో" అంది.

టీఎంసీ, కాంగ్రెస్ ఆరోపణల తర్వాత హోంమంత్రి అమిత్ షా ఝాడ్‌గ్రామ్ ర్యాలీ ఫొటోలను ట్వీట్ చేశారు. "నేను ర్యాలీకి వెళ్లలేకపోయినా, జనం ఇంత భారీగా తరలివచ్చినందుకు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)