అహ్మద్ పటేల్: కాంగ్రెస్ సీనియర్ నేత దిల్లీలో బుధవారం తెల్లవారుజామున మృతి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కోశాధికారి అహ్మద్ పటేల్ (71) బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు దిల్లీలోని ఒక హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. ఆయన కుమారుడు ఫైజల్ పటేల్ ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేశారు.

"నా తండ్రి మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నవారందరికీ కరోనావైరస్ నియమాలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సామాజిక దూరం పాటిస్తూ వైరస్ వ్యాప్తికి గురి కాకుండా జాగ్రత్త వహించాలని కోరుతున్నాను" అని కూడా ఫైజల్ ఖాన్ తన ట్వీట్‌లో తెలిపారు.

అహ్మద్ పటేల్‌కు దాదాపు నెల రోజుల కిందట కరోనా సోకింది. ఆయన కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా పని చేశారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సలహాదారుగా ఉన్న రోజుల్లో ఆయన పార్టీలో శక్తిమంతుడైన నాయకుడిగా గుర్తింపు పొందారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1995లో ఆయన కేంద్ర మంత్రిగా పని చేశారు. ఆయన మూడు సార్లు లోక్‌సభకు, అయిదు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన చివరిసారిగా 2017లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు.

అహ్మద్ పటేల్‌ను 1986లో గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆ రాష్ట్రానికి పంపించారు. 1988లో గాంధీ-నెహ్రూ కుటుబానికి చెందిన జవహర్ భవన్ ట్రస్ట్ బాధ్యతలు చేపట్టారు. ఆయన రాజీవ్ గాంధీకి ఎంత సన్నిహితులుగా ఉన్నారో, ఆ తరువాత కాలంలో సోనియా గాంధీకి కూడా అంతే సన్నిహితంగా మెలిగారు.

అహ్మద్ పటేల్ 1949 ఆగస్ట్ 21న ఇషాక్ పటేల్, హవాబెన్ పటేల్ దంపతులకు గుజరాత్, భరూచ్ జిల్లాలోని పిరామల్ గ్రామంలో జన్మించారు. 1980లలో భరూచ్ కాంగ్రెస్‌కు పెట్టని కోటగా ఉండేది. అక్కడి నుంచి ఆయన మూడు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.

అహ్మద్ పటేల్ ఎంతో కాలం ప్రజా జీవితంలో ఉన్నారని, ఆయన మృతి బాధాకరం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి అహ్మద్ పటేల్ అని, ఆయన మరణం పార్టీకి తీరలని ోలటు అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.

అహ్మద్ పటేల్ మృతి పట్ల మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంతాపం ప్రకటించారు. ఒక నమ్మకస్థుడైన మిత్రుడిని కోల్పోయాను అని ఆయన ట్వీట్ చేశారు.

అహ్మద్ పటేల్ మరణం తనను ఎంతో బాధించిందని కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ అన్నారు.

ఆయన కుమారుడు ఫైజల్‌తో ప్రతి రోజూ మాట్లాడుతూనే ఉన్నాను. పటేల్ ఎంతో చురుకైన, గంభీరమైన నేత అని, ఏ బాధ్యతనైనా ఎంతో శ్రద్ధతో నిర్వర్తించే వారని సింఘ్వీ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)