కరోనావైరస్: ఇండియాలో వాయు కాలుష్యం పెరిగితే కోవిడ్ కేసులు పెరుగుతాయా?

    • రచయిత, వికాస్ పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దేశ రాజధాని దిల్లీతో పాటు దేశంలో ఇతర నగరాలలో కూడా గత రెండు వారాల నుంచి వాయు కాలుష్య స్థాయిలు పెరుగుతున్నాయి.

వాయు కాలుష్యం వలన కోవిడ్ కేసులు, మరణాలు పెరిగే అవకాశం ఉందని కొన్ని అంతర్జాతీయ అధ్యయనాలు చెప్పిన నేపథ్యంలో కాలుష్య స్థాయిలు పెరుగుతున్నాయని వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.

వాయు కాలుష్యంలో ప్రతీ 2 .5 క్యూబిక్ మీటర్ ప్రాణాంతకమైన రేణువులకి ఒక్క మైక్రోగ్రామ్ రేణువులు పెరిగినా - 8 శాతం కోవిడ్ మరణాలు పెరుగుతాయని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనం చెబుతోంది.

కలుషిత వాయువులైన నైట్రోజెన్ ఆక్సయిడ్, వాహనాల నుంచి భూమి పైకి వెలువడే వాయువులు, శిలాజ ఇంధనాలను కాల్చడం వలన వచ్చే వాయువులకు దీర్ఘ కాలం పాటు గురి కావడానికి కోవిడ్ సోకడానికి మధ్య సంబంధం ఉందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అధ్యయనం చెబుతోంది.

ఇటువంటి కలుషిత వాయివులు ఊపిరితిత్తుల పై ప్రభావం చూపించి ఇన్ఫెక్షన్ బారిన పడేందుకు దారి తీస్తాయని అధ్యయన సహ రచయత మార్కో ట్రావగ్లియో బీబీసీకి చెప్పారు.

ఇటీవల దిల్లీలో పీఎం 2.5 స్థాయిలు సగటున ప్రతీ క్యూబిక్ మీటర్ కి 180 - 300 మైక్రోగ్రాముల స్థాయికి చేరాయి. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిమితి కంటే 12 రెట్లు ఎక్కువ.

ఈ పరిణామం చాలా ఆవేదనతో కూడుకున్నది. ఈ సంవత్సరంలో ఏర్పడ్డ కఠినమైన లాక్ డౌన్ వలన పరిశ్రమలు మూతపడి, ట్రాఫిక్ కూడా లేకపోవడంతో దిల్లీ పౌరులు కొంత కాలం పాటు పరిశుభ్రమైన గాలిని పీల్చుకోగలిగారు.

అయితే, వాతావరణ కాలుష్యానికి కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ కి మధ్య గల సంబంధం గురించి భారతదేశంలో ఇంకా ఎటువంటి అధ్యయనాలు జరగలేదు. అయితే, వైద్య నిపుణులు మాత్రం కోవిడ్-19 తో దేశం చేస్తున్న పోరాటానికి మాత్రం వాతావరణ కాలుష్యం గండి పెట్టవచ్చని హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే కోవిడ్ కేసుల సంఖ్యలో రెండవ స్థానంలో, మరణాల విషయంలో మూడవ స్థానంలో ఉంది. అయితే, ప్రతీ 10 లక్షల జనాభాకి చోటు చేసుకుంటున్న మరణాల సంఖ్య మాత్రం తక్కువగానే ఉంది.

అయితే, రోజు రోజుకి పెరుగుతున్న వాయు కాలుష్యం కోవిడ్ కేసుల సంఖ్యను పెంచే అవకాశం ఉందని అంటున్నారు.

కరోనా వలన బాగా ప్రభావితమైన నగరాలలో దిల్లీ ఒకటి. దిల్లీ ప్రజలు గత కొన్నేళ్లుగా కాలుష్యం బారిన తీవ్ర స్థాయిలో పడుతున్నారు.

రానున్న శీతాకాలంలో పరిస్థితి విషమంగా మారే ప్రమాదం ఉందని, హార్వర్డ్ యూనివర్సిటీ బయో స్టాటిస్టిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ ఫ్రాన్సెస్కా డొమినికి బీబీసీ కి చెప్పారు.

దిల్లీలో నవంబర్ నుంచి ఫిబ్రవరి నెలల మధ్యలో గాలి బాగా కలుషితంగా మారిపోతుంది. పరిసర ప్రాంతాలలో రైతులు గోధుమ గడ్డిని కాల్చడం, వాహన, పారిశ్రామిక కాలుష్యం, దీపావళికి మందుగుండు సామాను కాల్చడంతో పాటు, గాలి వేగం తక్కువగా ఉండటం వలన వాతావరణం పూర్తిగా విషవాయువులతో నిండిపోతుందని అన్నారు.

హార్వర్డ్ అధ్యయనం అమెరికాతో సహా మరో 3000 దేశాలలో సర్వే నిర్వహించింది. కానీ, దిల్లీలో గతంలో నమోదయిన గాలి కాలుష్యం రికార్డులను పరిశీలిస్తే ఇక్కడ కనిపించే ఫలితాలు మాత్రం భయపెట్టే విధంగా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరిత నగరాలలో దిల్లీ ఒకటి.

జనాభా సాంద్రత, సామాజిక ఆర్ధిక అంశాలను కూడా ఈ అధ్యయనం పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు డాక్టర్ డొమినికి చెప్పారు.

కోవిడ్ 19 కి అత్యధికంగా ప్రభావితమైన నగరాలలో గాలి కాలుష్యాన్ని సత్వరమే తగ్గించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

దిల్లీ ప్రజలు ఈ శీతాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కేంబ్రిడ్జి అధ్యయనం కోసం పని చేసిన పరిశోధకులు ఇఝౌ యు చెబుతున్నారు.

"ఒకే సారి కోవిడ్ కేసులు పెరిగితే వైద్య రంగం పై పెను భారం పడుతుందని దాంతో, మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది" అని ఆయన అన్నారు.

అమెరికాలో పేద వర్గాలు కోవిడ్ కి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎయిర్ పొల్యూషన్ అండ్ హెల్త్ రీసెర్చ్ డైరెక్టర్ మేరీ ప్రునికి చెప్పారు.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

భారతదేశానికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఎందుకంటే, సాధారణంగా పేద ప్రజలు కాలుష్యం ఎక్కువగా ఉండే పారిశ్రామిక ప్రాంతాల దగ్గర, నిర్మాణ స్థలాల దగ్గర లేదా, రద్దీగా ఉండే ప్రాంతాల దగ్గర నివాసముంటారు.

వాయు కాలుష్య స్థాయిలను అదుపులో పెట్టాల్సిన అవసరం ఉందని, లేని పక్షంలో రాజధాని రెండు రకాల వైద్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవలసిన అవసరం ఏర్పడుతుందని దిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా చెప్పారు.

"ఇది భయోత్పాతం కలిగించే విషయం" అని తమిళనాడులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ లో పల్మనరీ మెడిసిన్ విభాగాధిపతి డి జె క్రిస్టోఫర్ అన్నారు.

పీఎం2.5 రేణువులు రక్తంలోకి ప్రవేశించక ముందు ఊపిరితిత్తులను నాశనం చేసి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు లోను చేస్తాయి.

డైయాబిటిస్, బిపి, గుండె జబ్బులు, ఉబ్బసం లాంటి జబ్బులు ఉన్న వారు అధిక స్థాయిలో కాలుష్యానికి గురి కావడం వలన వారి పై ఇది మరింత అధిక ప్రభావం కలుగ చేస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అది ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల రోగ నిరోధక శక్తిని కూడా దెబ్బ తీస్తుందని ఆయన చెప్పారు.

"మానవ శరీరానికి ఊపిరితిత్తులు ప్రవేశ ద్వారం లాంటివి. దానికి ఏదైనా హాని జరిగితే అది తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అలా బలహీన పడినవారు కోవిడ్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే "బలహీనపడిన సైన్యం సహాయంతో యుద్ధం చేయడం లాంటిదే" అని డాక్టర్ క్రిస్టోఫర్ అన్నారు.

విషకారకాలు కూడా కరోనావైరస్ వ్యాప్తికి దోహదం చేస్తాయని నిపుణులు అంటున్నారు.

"వాయు కాలుష్యం రోగ నిరోధక శక్తిని తగ్గించడం మాత్రమే కాకుండా, గాలి కాలుష్యంలో ఉండే ప్రమాదకరమైన రేణువులు, నైట్రోజెన్ డయాక్సైడ్ లాంటి వాయువులు కోవిడ్ లాంటి వైరస్ లు మరింత కాలం సజీవంగా ఉండటానికి, వ్యాప్తి చెందడానికి వాహకాలుగా పని చేస్తాయని ప్రునికి చెబుతున్నారు.

నైట్రోజెన్ డయాక్సైడ్ వలన శరీరంలోకి చేరే గ్రాహకాల వలన వైరస్ 100 రెట్లు అతుక్కుని ఉండిపోతుందని ఎలుకల పై నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది.

ఈ కరోనా మహమ్మారి సమయంలో మనం కలుషితమైన గాలిని గనుక తప్పించుకోగలిగితే మంచిదని డాక్టర్స్ ఫర్ క్లీన్ ఎయిర్ అనే ప్రజా ఆరోగ్య ప్రచార కార్యక్రమం హెచ్చరించింది.

శీతాకాలంలో దిల్లీలో రోజుకు 15,000 కేసులు నమోదు కావచ్చని ఒక ప్రభుత్వ నివేదిక అంచనా వేసింది. అలాగే, కాలుష్యం కూడా ఈ కేసులు పెరిగేందుకు ఒక కారణం కావచ్చు.

"ప్రస్తుతం ఒక అత్యవసర పరిస్థితి నెలకొని ఉంది" అని క్రిస్టోఫర్ అన్నారు. కోవిడ్ ఉత్పాతం నుంచి రక్షించుకోవాలంటే వాయు కాలుష్యాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు.

ముఖ్యంగా దిల్లీ ప్రభుత్వం వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. లేని పక్షంలో ఒక చీకటి శీతాకాలాన్ని చూడవలసి వస్తుందని ఆయన అభిప్రాయ పడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)