కొత్త ‘బాబ్రీ’ మసీదు కట్టేది ఎక్కడ? ఎలా ఉంటుంది?

ధన్నీపుర్ గ్రామంలో సున్నీ వక్ఫ్ బోర్డుకు స్థలం కేటాయించారు

ఫొటో సోర్స్, BALBEER

ఫొటో క్యాప్షన్, ధన్నీపుర్ గ్రామంలో సున్నీ వక్ఫ్ బోర్డుకు స్థలం కేటాయించారు
    • రచయిత, సరోజ్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అయోధ్య రామజన్మభూమి వివాదం ముగిసిపోయింది. ఆగస్టు 5న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ కూడా జరిగింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

36 నుంచి 40 నెలల్లో మందిర నిర్మాణం పూర్తి చేయనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది.

అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ మందిరం ప్లాన్‌కు అనుమతి కూడా లభించినట్లు వార్తలు వస్తున్నాయి.

మరోవైపు మసీదు నిర్మాణం విషయంలోనూ చర్యలు ఊపందుకున్నాయి. సున్నీ వక్ఫ్ బోర్డు తమకు కేటాయించిన ఐదు ఎకరాల స్థలాన్ని ఎలా వినియోగించుకోవాలన్నది నిర్ణయించేందుకు ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసింది.

అయోధ్య రామ జన్మభూమి వివాదంపై సుప్రీం కోర్టు తీర్పునిస్తూ రామ మందిరం కోసం ట్రస్టు ఏర్పాటు చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు మసీదు నిర్మాణం కోసం ఐదు ఎకరాలు కేటాయించాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది.

ఈ తీర్పు తర్వాత అయోధ్యకు సమీపంలోని ధన్నీపుర్ గ్రామంలో యూపీ ప్రభుత్వం సున్నీ వక్ఫ్ బోర్డుకు మసీదు కోసం ఐదు ఎకరాలు కేటాయించింది.

ఈ స్థలం ఇదివరకు వ్యవసాయశాఖకు చెందిన ఫామ్ హౌస్‌లో భాగంగా ఉండేది. ప్రస్తుతం అక్కడ పొలాలు కూడా ఉన్నాయి. ఓ దర్గా కూడా ఉంది. అయోధ్యలోని రామజన్మభూమి స్థలానికి, ఇది దాదాపు 25 కి.మీ.ల దూరం ఉంటుంది.

అయితే, అయోధ్య కేసులోని కక్షిదారులు, అయోధ్యలోని ముస్లింలలో కొందరు ఇంత దూరంలో మసీదుకు స్థలాన్ని కేటాయించడాన్ని తప్పుపట్టారు.

ప్రొఫెసర్ ఎంఎస్ అక్తర్
ఫొటో క్యాప్షన్, ప్రొఫెసర్ ఎంఎస్ అక్తర్

ఆర్కిటెక్ట్‌గా ఎస్ఎం అక్తర్

తమకు కేటాయించిన స్థలంలో మసీదు నిర్మాణం కోసం డిజైన్‌ను రూపొందించేందుకు జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ ఫ్రొఫెసర్ ఎస్ఎం అక్తర్‌ను ఆర్కిటెక్ట్‌గా ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ఎంపిక చేసింది.

జామియా యూనివర్సిటీలోని ఆర్కిటెక్చర్ విభాగానికి అక్తర్ డీన్‌గా ఉన్నారు. ఆయనకు ఈ రంగంలో దాదాపు 30 ఏళ్ల అనుభవం ఉంది. ఇండో ఇస్లామిక్ నిర్మాణాల డిజైన్ల రూపకల్పనలో ఆయన బాగా పేరు తెచ్చుకున్నారు.

ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్‌కు తాను ఎలాంటి దరఖాస్తూ చేయలేదని, తన సమర్థతతను గుర్తించే ఆ ఫౌండేషన్ తనకు ఈ అవకాశం ఇచ్చిందని అక్తర్ బీబీసీతో అన్నారు.

ఐదు ఎకరాల స్థలంలో మసీదుతోపాటు కట్టనున్న వివిధ నిర్మాణాలకు కూడా డిజైన్లు రూపొందించాలని తనకు సూచించారని ఆయన వివరించారు.

ప్రొఫెసర్ అవ్వకముందు చాలా సంస్థల్లో తాను కన్సల్టెంట్‌గా పనిచేశానని, జామియా యూనివర్సిటీలో చాలా భవనాలు డిజైన్ కూడా చేశానని అక్తర్ చెప్పారు.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ ఉత్తర్‌ప్రదేశ్ చాప్టర్ అధ్యక్షుడిగా, కార్యదర్శిగా కూడా అక్తర్ ఇదివరకు పనిచేశారు.

ఆయనది లఖ్‌నవూ.

బాబ్రీ మసీదు

మసీదు ప్లాన్ ఎలా ఉండబోతోంది?

అయోధ్యలో రామ మందిరాన్ని చాలా గొప్పగా నిర్మించబోతున్నారని చర్చ జరుగుతోంది. విశ్వ హిందూ పరిషద్‌తో కలిసి గుజరాత్‌కు చెందిన వాస్తుకారుడు చంద్రకాంత్ సోమ్‌పుర మందిరం మోడల్‌ను రూపొందించారు. దీనికి కొన్ని మార్పులు చేసి, ఇప్పుడు మందిరం నిర్మించబోతున్నారు.

మసీదు కూడా ఇంతే గొప్పగా ఉండబోతుందా?

‘‘ఒకే ఆర్టిటెక్చర్‌ను రెండోసారి చేయలేమని మా వృత్తిలో అంటుంటారు. కాలం చెల్లింది పురాతత్వం అవుతుంది. సజీవంగా ఉన్నదే ఆర్కిటెక్చర్‌. కాలానికి తగినట్లు ఉండేలా డిజైన్ చేసినప్పుడే, అది సజీవంగా ఉంటుంది. ఇలా ఆలోచిస్తేనే, మనం కొత్త కొత్త వాటికి రూపును ఇవ్వగలుగుతాం’’ అని అక్తర్ అన్నారు.

మరి, కొత్తగా నిర్మించబోయే మసీదు ఇదివరకటి బాబ్రీ మసీదుకు పూర్తి భిన్నంగా ఉంటుందా?

ఈ ప్రశ్నకు అక్తర్ అవుననే బదులు ఇస్తున్నారు. కొత్త మసీదులో అసలు గుమ్మటమే ఉండదని అన్నారు.

ఈ విషయమై సున్నీ వక్ఫ్ బోర్డు అనుమతి ఆయనకు లభించిందా అన్న ప్రశ్నకు... ‘‘డిజైన్ రూపొందించే ముందు అనుమతి ఎవరూ తీసుకోరు. యూరప్‌లో, ఇతర దేశాల్లో కొత్త కొత్త థీమ్‌లతో నిర్మాణాలు జరగుతున్నాయి. పునరుత్పాదక శక్తితో పనిచేసే మసీదులు కడుతున్నారు. అన్నీ పునర్వినియోగం చేసుకునేలా రూపొందిస్తున్నారు’’ అని అక్తర్ జవాబు చెప్పారు.

ప్రస్తుతానికి మసీదు రూపం ఎలా ఉండాలనేదాని గురించి తాను ఇంకా ఆలోచించడం మొదలుపెట్టలేదని ఆయన అన్నారు.

అయోధ్యకు 25 కి.మీ.ల దూరంలో ఈ స్థలం ఉంది

ఫొటో సోర్స్, SAMIRATMAJ MISHRA/BBC

ఫొటో క్యాప్షన్, అయోధ్యకు 25 కి.మీ.ల దూరంలో ఈ స్థలం ఉంది

భారతీయతకు ప్రతిబింబంగా...

ఐదు ఎకారల విస్తీర్ణంలో ఒక పెద్ద కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నామని, అందులో భాగంగానే మసీదు ఉండబోతుందని అక్తర్ చెప్పారు.

కాంప్లెక్స్‌ను ‘ఖిద్మత్ ఏ ఖల్క్’ అనే థీమ్‌తో రూపొందిస్తున్నారు. దీని అర్థం మానవ సేవ.

ఈ కాంప్లెక్స్ ఇస్లాంను, భారతీయతను ప్రతిబింబించేలా ఉంటుందని అక్తర్ చెబుతున్నారు.

కాంప్లెక్స్‌లో ఆసుపత్రితోపాటు విద్యా సంస్థ కూడా ఉంటుందని అంటున్నారు. అయితే ఆ విద్యా సంస్థ సాధారణ పాఠశాల కాకపోవచ్చని, చరిత్రను బోధించడం ద్వారా జనాలకు విజ్ఞానం అందించే సంస్థై ఉండొచ్చని చెబుతున్నారు.

మసీదు ప్లాన్ ఎప్పటిలోగా రూపొందుతుందన్న ప్రశ్నకు అక్తర్ జవాబు ఇవ్వలేదు. మసీదుకు ఏ పేరు పెడుతారు?, నిర్మాణం మొదలుపెట్టే కార్యక్రమానికి ఎవరిని ఆహ్వానిస్తారు? అన్న వివరాలు కూడా చెప్పలేదు.

ఈ మసీదు డిజైన్ రూపొందించే బాధ్యతను తనకు అప్పగించడం చాలా పెద్ద విషయమని, దీని పట్ల తనకు ఎంతో గర్వంగా ఉందని అక్తర్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)