డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్‌ మృతి.. కరోనావైరస్‌కు బలైన తొలి ప్రజాప్రతినిధి

డీఎంకే ఎంఎల్ఏ జె. అన్బళగన్ కరోనావైరస్ కారణంగా బుధవారం ఉదయం మృతి చెందారు.

దేశంలో కోవిడ్19తో చనిపోయిన మొదటి ప్రజాప్రతినిధి ఆయన.

డీఎంకే అగ్ర నాయకుడు ఎం.కరుణానిధికి సన్నిహితుడైన అన్బళగన్ చెన్నైలోని చెపాక్ - ట్రిప్లికేన్ నియోజకవర్గం నుంచి తమిళనాడు శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

అన్బళగన్ తన 62వ పుట్టినరోజు నాడే చనిపోవటం విషాదకరం. ఆయనకు జూన్ 2వ తేదీన తీవ్ర శ్వాస సమస్య తలెత్తటంలో ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల్లో కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

ఆస్పత్రిలో కృత్రిమ శ్వాస అందిస్తూ చికిత్స చేస్తుండగా సోమవారం ఆయన పరిస్థితి విషమించిందని ఆస్పత్రి వెల్లడించింది.

కోవిడ్19 ఆంక్షల కారణంగా ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆయనను కలవలేకపోయారు.

డీఎంకే నాయకుడు ఒకరు బీబీసీతో మాట్లాడుతూ.. ''ఆయనకు ముందు నుంచే రక్తపోటు ఉంది. కొన్ని సంవత్సరాల కిందట కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనను చివరి నిమిషంలో చూడలేకపోయారు. ఆయన మరణం చాలా విచారకరం'' అని చెప్పారు.

భారతదేశంలో కరోనావైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. మంగళవారం నాటికి రాష్ట్రంలో మొత్తం 34,914 కేసులు నమోదవగా.. 307 మంది చనిపోయారు.

ప్రస్తుతం దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 2,76,583 కాగా.. ఇప్పటివరకూ 7,745 మంది చనిపోయారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)