తిరుమల తిరుపతి దేవస్థానం: 3 గంటల్లోనే 2.4 లక్షల తిరుప‌తి లడ్డూల విక్రయం - ప్రెస్‌ రివ్యూ

కేవలం 3 గంటల్లోనే 2.4 లక్షల తిరుప‌తి లడ్డూలు రికార్డు స్థాయిలో అమ్ముడు పోయాయని వెలుగు దిన‌ప‌త్రిక ఓ క‌థ‌నం ప్రచురించింది.

క‌రోనావైర‌స్‌ లాక్‌డౌన్ నేప‌థ్యంలో.. రాష్ట్ర వ్యాప్తంగా తిరుప‌తి ల‌డ్డూల‌ను టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

గుంటూరులోని టీటీడీ కల్యాణ మండపం రెడ్‌ జోన్‌ పరిధిలో ఉండ‌టంతో.. ఇక్క‌డ విక్ర‌యాలు జ‌ర‌ప‌లేదు. అయిన‌ప్ప‌టికీ ల‌డ్డూల కోసం భ‌క్తులు వచ్చారు.

రాష్ట్రంలోని మిగ‌తా జిల్లాల్లోని టీటీడీ మండపాల్లో మాత్రం ల‌డ్డూ విక్ర‌యాలు జోరుగా సాగాయి.ఈ రోజు మ‌రో రెండు లక్షల లడ్డూలను జిల్లా కేంద్రాలకు తరలించనున్నారు.

మ‌రోవైపు లడ్డూలు విక్రయించాలని తమిళనాడు, తెలంగాణ భక్తుల నుంచి కూడా విజ్ఞప్తులు వస్తున్నాయి. ప్రతి రోజు తమిళనాడుకు లక్ష, తెలంగాణకు 50వేల చొప్పున లడ్డూలు ఇవ్వాల‌ని టీటీడీ యోచిస్తోంది.

విశాఖ‌లోని ఎల్‌జీ పాలిమర్స్‌ సీజ్

స్టైరీన్‌ గ్యాస్‌ లీకేజీ ప్రమాదానికి కారణమైన ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీని జిల్లా రెవిన్యూ అధికారులు సోమవారం సీజ్ చేసిన‌ట్లు సాక్షి ఓ క‌థ‌నం ప్ర‌చురించింది.

రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ అధికారులు, పరిశ్రమల శాఖ అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఉన్న ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీలో ఈ నెల 7వ తేదీన జరిగిన గ్యాస్‌ లీకేజీ ఘటనలో 12 మంది మృత్యువాతపడగా 585 మంది అస్వస్థతకు గురయ్యారు.

ఈ ప్రమాదాన్ని రాష్ట్ర హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ చేపడుతోంది.

ముందుగా కంపెనీని సీజ్‌ చేయడంతో పాటు డైరెక్టర్ల పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

పానీపూరి తిన‌డంతో 40 మంది చిన్నారుల‌కు అస్వ‌స్థ‌త‌

పానీపూరి తిని 40 మంది అస్వస్థతకు గురైన ఘటన సోమవారం రాత్రి తెలంగాణ‌లోని ఆదిలాబాద్‌లో కలకలం సృష్టించిన‌ట్లు ఈనాడు ఓ క‌థ‌నం ప్ర‌చురించింది.

లాక్‌డౌన్‌ నిబంధనల్లో పానీపూరి తోపుడు బండ్ల నిర్వహణకు అనుమతి లేదు. అయినా కొంద‌రు విక్రేత‌లు కాలనీలకు తిరుగుతూ పానీపూరీ విక్ర‌యిస్తున్నారు.

అస్వస్థతకు గురైన వారంతా ఐదు నుంచి పదేళ్ల వయసు పిల్ల‌లే. ఆదిలాబాద్‌లోని ఖుర్షిద్‌నగర్‌‌కు చెందిన‌ వీరు కాలనీలో తోపుడుబండి వద్ద పానీపూరి తిన్నారు.

రాత్రి 9 గంటల నుంచి ఒక్కొక్కరు వాంతులు, విరేచనాలు చేసుకోవటం ప్రారంభించారు. ఒకరి తర్వాత ఒకరు రిమ్స్‌కు వస్తుండటంతో ఈ సంఖ్య 40కి చేరింది.

రాత్రి 11 గంటలకు సైతం కొందరు చిన్నారులను ఆసుపత్రికి తీసుకొస్తూనే ఉన్నారు. అస్వస్థతకు గురైన చిన్నారులకు ఎలాంటి ప్రాణాపాయం లేదని రిమ్స్‌ సంచాలకుడు బలరాం బానోత్‌ పేర్కొన్నారు.

టిక్‌టాక్‌లో కుక్కను తాళ్లతో కట్టి పైశాచికం; వారిని ప‌ట్టిస్తే రూ.50,000 న‌జ‌రానా

టిక్‌టాక్‌ను బ్యాన్ చేయాలంటూ డిమాండ్లు వ‌స్తున్న నేప‌థ్యంలో.. మ‌రో వివాదాస్ప‌ద వీడియో వెలుగులోకి వ‌చ్చిందని ఆంధ్ర‌జ్యోతి దిన‌ప‌త్రిక ఓ క‌థ‌నం ప్రచురించింది.

టిక్‌టాక్ కోసం ఇద్ద‌రు యువ‌కులు.. ఓ కుక్క‌కు నాలుగు కాళ్లు కట్టేసి చెరువులో విసిరేశారు. అంతేకాదు నీళ్ల‌లో నుంచి పైకి లేవకుండా కుక్కుపై వారు రాళ్లు కూడా విసిరారు.

సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో పెటా (పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్) ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘‘ఆ అనాగరిక చర్యను మేం కూడా గమనించాం. వారిని చట్ట ప్రకారం శిక్షించాలి. వారి వివరాలు తెలియజేయండి. వివరాలు తెలిపిన వారికి 50 వేల రూపాయల నజరానా ఇస్తాం’’ అని పెటా పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)