కేరళ: ఇంట్లో కుళాయి తిప్పితే మద్యం వచ్చింది

మద్యంతో కలుషితమైన నీరు

ఫొటో సోర్స్, JOSHY MALIYEKKAL

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ కోసం

ఇంట్లో కుళాయి తిప్పితే, నీళ్లు రావాలి. కానీ, నీళ్లకు బదులు బీరు, బ్రాందీ, రమ్ కలగలసిన మద్యం వస్తే..?

కేరళలో త్రిసూర్ జిల్లా చలకూడిలోని 18 అంతస్తుల అపార్ట్‌మెంట్లో ఇలా మద్యమే వచ్చింది. ఎక్సైజ్ అధికారుల చర్యే దీనికి కారణం.

అడ్డగీత
News image
అడ్డగీత

సాల్మన్ అవెన్యూ అనే ఈ అపార్టుమెంట్ పక్కన ఉండే బార్ నుంచి స్వాధీనం చేసుకున్న ఆరు వేల లీటర్ల బీరు, బ్రాందీ, రమ్‌ను అధికారులు పారబోయాలని నిర్ణయించుకున్నారు.

"అపార్టుమెంట్, బార్ మధ్య గోతిని తవ్వించి సీసాల్లోని మద్యాన్ని ఆదివారం అందులో పోశారు. సోమవారం ఉదయం వంటగదుల్లో కుళాయిల నుంచి గోధుమ రంగులో మద్యం వాసనతో నీళ్లు రావడం మొదలైంది" అని అపార్టుమెంటు యజమాని జోషీ మలియెక్కల్ బీబీసీతో చెప్పారు.

"అధికారులు పారబోసిన మద్యం లోపలకు ఇంకి భూగర్భ జలాల్లో కలిసిపోయింది. అలా మా అపార్టుమెంట్ పైప్‌ లైన్లోకి చేరింది. ఈ సమస్యతో పిల్లలు బడికి, పెద్దవాళ్లు ఉద్యోగాలకు వెళ్లలేకపోయారు" అని ఆయన తెలిపారు.

ఈ పరిణామంతో కంగుతిన్న అపార్టుమెంటు వాసులు మున్సిపాలిటీ అధికారులను, పోలీసులను ఆశ్రయించారు. ఇంతలో ఎక్సైజ్ అధికారులు తమ తప్పిదాన్ని గుర్తించారు. అపార్టుమెంటు వాసులకు తాగునీటిని సరఫరా చేస్తామంటూ ముందుకొచ్చారు.

ఎక్సైజ్ అధికారులు చేసిన పనితో తమ ప్రధాన నీటి వనరైన బావిలో నీరంతా కలుషితమైపోయిందని అపార్టుమెంట్ వాసులు అంటున్నారు.

"అధికారులు ఇంచుమించు రోజుకు ఐదు వేల లీటర్ల నీరు సరఫరా చేస్తారు. ఈ నీళ్లు మాకు చాలనే చాలవు. బావిలోని నీటిని మూడు రోజులుగా బయటకు తోడేస్తున్నాం. బావిలోని నీరంతా తోడేందుకు నెల రోజులు పట్టేలా ఉంది" అని జోషి విచారం వ్యక్తంచేశారు.

మద్యంతో కలుషితమైన నీరు

ఫొటో సోర్స్, JOSHY MALIYEKKAL

మద్యం ఎందుకు పారబోశారు?

ఈ బార్ దాదాపు ఆరేళ్లుగా మూసి ఉంది. ఇందులో నిల్వ ఉన్న మద్యాన్ని పారబోయాలంటూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. అక్రమంగా మద్యం నిల్వ ఉంచడంతో అప్పట్లో ఈ బార్‌పై అధికారులు దాడి చేశారు.

సాధారణంగా ఇలాంటి మద్యాన్ని తగులబెడతారని, స్థానిక జనాభాకు హాని కలగకుండా దీనిని ధ్వంసం చేయాల్సి ఉంటుందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి బీబీసీతో చెప్పారు.

మద్యాన్ని గొయ్యి తవ్వి పారబోసిన అధికారులపై ఫిర్యాదు దాఖలు చేస్తే చట్ట ప్రకారం తాము చర్యలు తీసుకుంటామని త్రిసూర్ జిల్లా సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

దేశంలోకెల్లా మద్యం అత్యధిక వినియోగం కేరళలో ఉంది.

స్పోర్ట్స్ ఉమెన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)