‘ప్రియాంక గాంధీ అందమే ఆమెకు శత్రువా?’: అభిప్రాయం

ఫొటో సోర్స్, AFP
- రచయిత, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఎంత చదువుకున్నా, ఎంత సమర్థంగా ఉద్యోగం చేసినా, కాస్త అందంగా ఉంటే ఆ లెక్కలే వేరు. అందానికి ప్రాముఖ్యత ఇవ్వడంతో నేను ఏకీభవించను. కానీ సమాజంలో అందం ప్రాధాన్యత చాలా ఎక్కువ. అందం కూడా ఓ భారం అయినపుడు నేను నిజంగానే షాక్కు గురవుతాను.
అందమైన ముఖం ఉంటే, తప్పకుండా వారి మెదడు బలహీనంగా ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగం లేదా ఇతర అవకాశాలు అందం కారణంగానే వచ్చాయి. ఏదీ కొత్తగా, స్పెషల్గా చేయలేరు. ఎందుకంటే సామర్థ్యం ఉండాల్సిన చోట అందానికి ప్రాధాన్యత ఉంది.
ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ అయ్యాక ఇలాంటి రెండు నాల్కల ధోరణిని మళ్లీ చూశాను. పార్టీ జనరల్ సెక్రెటరీ అయ్యాక, కొందరు బీజేపీ నాయకులు ఇలా కామెంట్ చేశారు -
''లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ.. చాక్లెట్ లాంటి ముఖాన్ని తెరపైకి తెస్తోంది.''
''కాంగ్రెస్ పార్టీకి ఏదైనా మేలు జరుగుతుందంటే, ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా, సభలు, సమావేశాల్లో సీట్లు ఖాళీగా కనిపించవు.''
''అందమైన ముఖంతో ఓట్లను సాధించలేరు..''

ఫొటో సోర్స్, Reuters
ఒకవేళ అందం నిర్వచనంలోకి ఒదగని మహిళా నాయకురాలు ఉన్నా, ఆమెకు సరైన గౌరవం దక్కుతుందా అంటే అదీ లేదు.
బహుజన్ సమాజ్వాది పార్టీ అధినేత్రి మాయావతి గురించి సమాజ్వాది నేత ములాయం సింగ్ యాదవ్ మాట్లాడుతూ..
''ఎవరైనా రేప్ చేయాలనుకునేంత అందంగా మాయావతి ఉందా..?'' అన్నారు.
రాజ్యసభ ఎంపీ శరద్ యాదవ్.. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజె గురించి మాట్లాడుతూ, వసుంధర రాజె కాస్త ఒళ్లు చేశారు. ఆమెను విశ్రాంతి తీసుకోనివ్వండి అని కామెంట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
అన్ని రాజకీయ పార్టీల్లోనూ చాలా మంది మగవాళ్లున్నారు. పురుషుల కంటే మహిళలు బలహీనులు అని వారు భావిస్తారు. వారి వాదనను సమర్థించుకోవడానికి ఎలాంటి లాజిక్నైనా మాట్లాడుతారు.
మీకు అవమానం కలిగిన చోట, మీ శరీరం గురించి సిగ్గులేని కామెంట్స్ వినిపించే చోట, మీ శరీరపు కొలతలు, అందం ఆధారంగా మీ పనితీరును కించపరుస్తున్న చోట మీరు ఉండగలరా? పని చేయగలరా?
ఈ మహిళలను చూడండి.. వారు ఎన్నుకున్న మార్గంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారి చర్మం తెల్లగా ఉన్నా లేకున్నా, ఇలాంటి కామెంట్లు, అవమానాలకు వీరి చర్మం మొద్దుబారి ఉంటుంది.
పార్లమెంటులో మహిళల సంఖ్య ఇంకా తక్కువగానే ఉంది. మొదటి లోక్సభలో 4% ఉన్న మహిళల సంఖ్య 16వ లోక్సభలో 12%కి పెరిగింది.
ఓసారి మన పొరుగు దేశాలను పరిశీలిస్తే, నేపాల్ పార్లమెంటులో మహిళలు 38% ఉన్నారు. ఇక బంగ్లాదేశ్, పాకిస్తాన్లో వారి ప్రాతినిధ్యం 20% ఉంది.
కలలు కనడం ఆపండి.. అని మీరు అనేలోపు, మీకు ఓ విషయం చెప్పాలి. ఆఫ్రికా ఖండంలోని రువాండలో మహిళలకు సుముచిత స్థానం కల్పించడంలో మరో అడుగు ముందుకు వేసింది. రువాండ పార్లమెంటులో 63 శాతం మంది మహిళలు ఉన్నారు.
భారత్లో మహిళలకు ఓటు హక్కు దశాబ్దాల కిందటే స్వాతంత్ర్యంతో పాటు వచ్చింది. కానీ, రాజకీయాల్లో శక్తిమంతమైన స్థానాలు మాత్రం దక్కలేదు.
రాజకీయ పార్టీలు ఇప్పటికీ పురుషాధిక్యంగానే ఉన్నాయి. అసెంబ్లీకైనా, లోక్ సభకైనా మహిళలకు టిక్కెట్లివ్వడానికి వెనుకాడుతూనే ఉన్నాయి.
2014 లోక్సభ ఎన్నికల్లో 7,500 మంది అభ్యర్థులు బరిలో ఉంటే అందులో మహిళలు 8 శాతం మాత్రమే. సుమారు 500 మంది మాత్రమే మహిళలు బరిలో ఉన్నారు.
'అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్'(ఏడీఆర్) అధ్యయనం ప్రకారం ఈ 500 మందిలో మూడో వంతు మహిళలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసినవారే. అంటే రాజకీయ పార్టీలు టిక్కెట్లిచ్చింది ఇంకా తక్కువమందికేనన్నమాట.
ఆమ్ ఆద్మీ పార్టీ 59 మంది మహిళలకు టికెట్లివ్వగా కాంగ్రెస్ 60, బీజేపీ 38 మందికి టికెట్లిచ్చింది.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమబెంగాల్లో మూడో వంతు స్థానాల్లో మహిళలను బరిలో దించి మిగతా అన్ని పార్టీల కంటే అధిక ప్రాధాన్యమిచ్చింది.

ఫొటో సోర్స్, Twitter/Facebook
గెలుపు శాతంలో అతివలే ముందు
టికెట్లివ్వడంలో పార్టీలు చిన్నచూపు చూస్తున్నా విజయ శాతంలో మాత్రం మహిళలే ముందుంటున్నారు.
2014 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన పురుష అభ్యర్థుల్లో 6 శాతం మందే విజయం సాధిస్తే మహిళల్లో 9 శాతం మంది గెలుపు అందుకున్నారు.
మహిళల పోటీ విషయంలో సానుకూల మార్పు దిశగా పార్టీలు ఆలోచించడం అవసరం. పార్టీల్లో మార్పు రాకపోతే పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎప్పటికీ ఆమోదం లభించదు. ఒకవేళ లభించినా అమలు కాదు.

ఫొటో సోర్స్, AFP
పదవి ఆమెది.. పెత్తనం ఆయనది..
పంచాయతీల్లో తొలుత మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించి ఆ తరువాత దాన్ని 50 శాతానికి పెంచారు. దీనివల్ల వారి ప్రాతినిధ్యం పెరిగింది.
అయితే, పార్టీల తీరు మారకపోవడంతో పురుషాధిక్యమే కనిపిస్తోంది. మహిళలు పేరుకు సర్పంచులుగా ఉంటున్నారు.. పెత్తనమంతా భర్తలు, మామలు, తండ్రులు, సోదరులదే.
మహిళలను తక్కువ అంచనావేయడమే దీనికి కారణం. ఒకవేళ వారు సమర్థులే అయినప్పటికీ వారు నేర్చుకోవడానికి, మందుకుసాగడానికి అవకాశం ఇవ్వరు.
కానీ, కొందరు మహిళలు ఈ అవరోధాల గురించి ఏమీ మాట్లాడకుండా తమ పథంలో తాము దూసుకెళ్తున్నారు.
వారిలో అందగత్తెలున్నారు.. నల్లగా, లావుగా ఉన్నవారూ ఉన్నారు.
మహిళలు కావడం ఒక్కటే కాదు.. తక్కువ కులాలుగా మాట్లాడే వర్గాల నుంచి వచ్చినవారు, గిరిజన తెగలు, పేద, మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చినవారు అందరూ ఉన్నారు.
కానీ, వారు నిర్భీతిగా ఉండే నాయకులుగా ఎన్నికయ్యారు. వారిని హేళన చేసే వ్యాఖ్యలు అవమానకరం కాదు, ఆ వ్యాఖ్యలు చేసే మనుషులే అవమానకరం అని వారికి తెలుసు.
ఇవి కూడా చదవండి:
- రెండు దేశాలు తప్ప ఏ దేశ జాతీయ జెండాలోనూ కనిపించని రంగు ఏంటి? అది ఎందుకు కనిపించదు?
- మహిళల్లో సున్తీ (ఖత్నా) అంటే ఏమిటి... ఐక్యరాజ్య సమితి దీన్ని ఎందుకు నిషేధించాలంటోంది... #EndFGM
- ఆ అమ్మాయిలిద్దరూ ప్రేమించుకున్నారు... పెళ్ళి చేసుకున్నారు
- లైంగిక వేధింపులు: చట్ట ప్రకారం ఫిర్యాదు చేస్తారా? సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారా?
- ‘ముస్లింలపై దాడులను అడ్డుకోవడంలో భారత్ విఫలం’
- పీరియడ్స్ సమయంలో సెక్స్ తప్పా? ఒప్పా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








