అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపై బీజేపీ వర్సెస్ సంఘ్ పరివార్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రదీప్ సింగ్
- హోదా, సీనియర్ జర్నలిస్ట్
దాదాపు 26 ఏళ్ల తర్వాత అయోధ్యలో రామమందిరం నిర్మాణం అంశం సంఘ్ పరివార్ అజెండాలో మళ్లీ మొదటిస్థానంలోకి వచ్చింది.
రామ మందిర నిర్మాణంపై రెండున్నర దశాబ్దాల క్రితం ఉన్నంత వ్యతిరేకత లేదని వారు భావిస్తున్నారు. కానీ ఆలయం నిర్మించే దారి మాత్రం వారికి కనిపించడం లేదు.
సంఘ్ పరివార్ దగ్గర ఇప్పుడు సమయం లేదు. ఎందుకంటే ఈ అంశం మతవిశ్వాసాలను దాటుకుని ఎన్నికల రాజకీయంగా మారిపోయింది.
2019లో ప్రధాని నరేంద్ర మోదీ విజయానికి మార్గం సుగమం కావాలంటే రామ మందిర నిర్మాణంపై తప్పనిసరిగా ఒక నిర్ణయం తీసుకోవాలని సంఘ్ భావిస్తోంది.
గత రెండున్నర దశాబ్దాలుగా ఇదే అంశంపై బీజేపీ, సంఘ్ చాలా రంగులు మర్చాయి. 1992లో బాబ్రీ మసీదు కూల్చడం లాంటి ఎన్నో పరిణామాలు జరిగాయి.
ఆ సమయంలో సంతోషపడాలో, బాధపడాలో సంఘ్ పరివార్కు అర్థం కాలేదు. పార్టీలో రకరకాల గొంతులు వినిపించడానికి అదే కారణమైంది.

ఫొటో సోర్స్, AFP
మందిరంపై నాటి విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు అశోక్ సింఘాల్ నుంచి బీజేపీలో అత్యంత ప్రముఖ నేత అటల్ బిహారీ వాజ్పేయి వరకూ ఎప్పుడూ ఒకే మాటపై నిలబడలేదు.
1992 డిసెంబర్ 7న ఉదయం కంపించిన స్వరంతో లాల్ కృష్ణ అడ్వాణీ మాటలను ఎవరెవరు విన్నారో, చూశారో వారు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోగలరు.
ఆ తర్వాత బీజేపీని రాజకీయంగా దూరంగా పెట్టడం ప్రారంభమైంది.
1996లో లోక్సభలో 161 స్థానాలు గెలుచుకున్న తర్వాత కూడా అటల్ బిహారీ వాజ్పేయికి 13 రోజుల తర్వాత ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందంటే అదే కారణం.
ఎస్విడి(సంయుక్త విధాయక్ దళ్) నుంచి 1989లో వీపీ సింగ్ జనతాదళ్ ప్రభుత్వం ఏర్పడే వరకూ తటస్థంగా ఉండే పార్టీలే కాదు, లెఫ్ట్ పార్టీలకు కూడా బీజేపీతో కలిసి నిలబడడానికి ఎప్పుడూ అభ్యంతరాలు రాలేదు. కానీ 1992 డిసెంబర్ 6న అన్నీ మారిపోయాయి.

ఫొటో సోర్స్, AFP/Getty Images
బీజేపీ హిమాచల్ ప్రదేశ్ పాలంపూర్లో జరిగిన పార్టీ జాతీయ కార్యనిర్వాహకుల సదస్సులో మొదటి సారి అయోధ్యలో రామమందిరం ఉద్యమాన్ని సమర్థిస్తూ నిర్ణయం తీసుకుంది.
రామ మందిరం ఉద్యమం వల్ల బీజేపీకి రాజకీయ లబ్ది కలిగింది అనేదానిపై ఎలాంటి వివాదం లేదు. కానీ మసీదు కూల్చడం వల్ల దానికి వచ్చిన రాజకీయ లబ్ధి కలిగిందా అనేది నమ్మకంగా చెప్పలేం.
బీజేపీని రాజకీయంగా దూరం పెట్టడం 1998లో ముగిసింది. అప్పుడు అది తన ఎన్నికల మ్యానిఫెస్టో నుంచి రామమందిరం, కామన్ సివిల్ కోడ్, ఆర్టికల్ 370 లాంటి అంశాలను తొలగించింది.
కేంద్రంలో ఆ ప్రభుత్వం ఆరేళ్లు ఉంది. కానీ ఎన్నడూ రామమందిరం, అయోధ్యను పట్టించుకోలేదు.

ఫొటో సోర్స్, RSS-TWITTER
బీజేపీపై సంఘ్కు నమ్మకం లేదు
ఏ రామమందిరం అంశం బీజేపీని రెండు లోక్సభ స్థానాల నుంచి కేంద్రంలో అధికారం వరకూ చేర్చిందో, అది కార్యరూపం దాలుస్తుందని సంఘ్ పరివార్కు నమ్మకం పోయింది.
మందిరానికి మద్దతు ఇచ్చేవారికి బీజేపీకి రామమందిరం నమ్మకం కాదు ఓట్లు సేకరించే ఒక పరికరంగా మారిపోయిందని తెలిసిపోయింది.
2002లో ఉత్తర్ ప్రదేశ్లో బీజేపీ మొదటి స్థానం నుంచి మూడో స్థానంలోకి వచ్చిన పార్టీ అయిపోయింది. 2004 లోక్సభ ఎన్నికల్లో ఒకప్పుడు 62 లోక్సభ సీట్లు వరకూ గెలుచుకున్న ఆ పార్టీ 9 స్థానాలకు పరిమితమైంది.
తర్వాత 15 ఏళ్లకు కేంద్రంలో, మరో పది రాష్ట్రాల్లో మోదీ ఉప్పెనలో బీజేపీ అధికారంలోకి తిరిగి వచ్చింది.
2014లో మోదీ ప్రధానమంత్రి, 2017లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మందిరం విషయంలో ప్రభుత్వం ఏదైనా చేస్తుందనే భావించారు. అయినా అది హామీలను దాటి ముందుకు వెళ్లలేదు.
రామమందిరం విషయంలో కేంద్రం సుప్రీంకోర్టుపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కోర్టు తీర్పు ఎన్నికలకన్నా ముందు వస్తుందని భావించింది. కానీ కోర్టు కేసును త్వరగా వినడానికి నిరాకరించడం కేంద్రం కష్టాలు పెరిగాయి.

ఫొటో సోర్స్, Getty Images
భావోద్వేగ అంశం కోసం అన్వేషణ
బీజేపీ ఎన్నికలకు ముందు ఏదైనా భావోద్వేగాలకు సంబంధించిన అంశం కోసం వెదుకుతోంది. మందిరం విషయంలో ఇప్పుడు హామీలు ఎంత మాత్రం పనికి రావడం లేదు.
ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వానికి మందిరం విషయంలో ఎలాంటి వాతావరణం కావాలంటే, దాని కోసం ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి ఉండాలి.
ప్రస్తుతం ఆరెస్సెస్, వీహెచ్పీ ప్రయత్నిస్తున్నది అదే. అయోధ్యలో చేపట్టిన ధర్మసభ విఫలమైంది. దాంతో ఆదివారం దిల్లీలోని రామ్లీలా మైదాన్లో ధర్మసమ్మేళనం నిర్వహించింది.
అయితే ఈ రెండు కార్యక్రమాలకు గతతంలో వచ్చినంత ప్రతిస్పందన లేదు.
ఈ రెండు కార్యక్రమాలను చూశాక సంఘ్ పరివార్కు అశోక్ సింఘాల్ లాంటి నాయకుల అవసరం మరోసారి తెలిసి వచ్చింది.
ఈ కార్యక్రమాల వెనుక ఉన్న మరో ఉద్దేశం సుప్రీంకోర్టు మీద ఒత్తిడి తీసుకురావడం. జనవరిలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఈ కేసు విచారణ కోసం బెంచ్ను ఏర్పాటు చేయనున్నారు.
జనవరిలో కూడా త్వరగా విచారణ ప్రారంభం కాకుంటే, కోర్టులు ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోలేదని బీజేపీ ప్రచారం చేసుకోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్పై ఒత్తిడి
అయితే కాలం గడిచే కొద్దీ సంఘ్ పరివారం ఓపిక నశిస్తోంది. ఈ ధార్మిక కార్యక్రమాలే కాకుండా రాజ్యసభ ఎంపీ రాకేష్ సిన్హా అయోధ్యపై ఒక ప్రైవేట్ బిల్లు పెట్టడం కూడా ఈ వ్యూహంలో భాగమే.
ఈ ప్రైవేట్ బిల్లు ద్వారా మిగిలిన పార్టీలను, మరీ ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టి, రామమందిరంపై ఒక స్పష్టమైన వైఖరి తీసుకునేలా చేయడం బీజేపీ లక్ష్యం.
కానీ ఫిబ్రవరి 1న చివరి బడ్జెట్ ప్రవేశపెట్టే లోపు బీజేపీ ఏదైనా ఒక చర్య తీసుకోవచ్చు. అది రామమందిరంపై విచారణ త్వరగా చేపట్టాలని సుప్రీంకోర్టును కోరడం కావచ్చు లేదా పార్లమెంట్ ద్వారా బిల్లు తీసుకురావడం కావచ్చు.
లోక్సభ ఎన్నికలకు ముందే, మందిరంపై బీజేపీ ఏదో ఒకటి చేయాలి. అప్పుడే ప్రభుత్వము, పార్టీ కూడా మందిర నిర్మాణంపై సీరియస్గా ఉన్నాయని ప్రజలు విశ్వసిస్తారు.
అప్పుడే ఆ పార్టీ రామమందిరంపై పోగొట్టుకున్న విశ్వాసాన్ని పొందగలుగుతుంది.
ఇవి కూడా చదవండి:
- ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా
- విజయ్ మాల్యాను భారత్కు అప్పగించడానికి అనుమతిచ్చిన న్యాయమూర్తి
- ప్రతిపక్షాల సమావేశం ఎన్డీయేను ఉక్కిరిబిక్కిరి చేయడానికేనా...
- బాంబే బ్లడ్ గ్రూప్: ప్రపంచంలో అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్
- ఉత్తమ్ కుమార్రెడ్డి: పైలట్ గెలిచారు.. పార్టీ ఓడిపోయింది
- తన్నీరు హరీశ్రావు: కేసీఆర్ మేనల్లుడిగా వచ్చినా.. సొంత గుర్తింపు సాధించుకున్న నాయకుడు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








