మక్కా మసీదు పేలుళ్ల కేసు: తీర్పు ఇచ్చిన జడ్జి రాజీనామా

ఫొటో సోర్స్, ecourts.gov.in
మక్కా మసీదు పేలుళ్ల కేసుపై విచారణ జరిపి, తీర్పు ఇచ్చిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక న్యాయ స్థానం జడ్జి రవీందర్ రెడ్డి రాజీనామా చేశారు.
అయితే ఆయన ఎందుకు రాజీనామా చేశారనేది తెలియలేదు. తన రాజీనామా లేఖను ఆయన ఫ్యాక్స్ ద్వారా హైకోర్టుకు పంపించారు.
రాజీనామా చేయటానికి ముందు ఆయన మక్కా మసీదు పేలుళ్ల కేసులో నిందితులంతా నిర్దోషులని తీర్పు ఇచ్చారు.
2007 మే 18న హైదరాబాద్లోని మక్కా మసీదు ప్రాంగణంలో జరిగిన బాంబు పేలుడులో 9 మంది చనిపోయారు. ఆ తర్వాత జరిగిన పోలీసు కాల్పుల్లో మరో ఐదుగురు మరణించారు.
ఈ దాడికి పాల్పడింది హిందూ అతివాదుల బృందమని దర్యాప్తు సంస్థలు అభియోగాలు నమోదు చేశాయి.
దేశంలో హిందూ అతివాదులు పాల్పడినట్లు ఆరోపణలున్న దాడుల్లో మక్కా మసీదు పేలుడు ఘటన ప్రధానమైనది.
పదకొండేళ్ల దర్యాప్తు అనంతరం ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు సోమవారం ఉదయం తీర్పు వెలువరించింది.
పదకొండేళ్ల క్రితం హైదరాబాద్లోని మక్కా మసీదులో జరిగిన బాంబు పేలుడు కేసులోఐదుగురు- అసీమానంద, దేవేంద్ర గుప్తా, లోకేశ్ శర్మ, భరత్ మోహన్లాల్ రాటేశ్వర్, రాజేందర్ చౌధరిలను నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పునిచ్చింది.
గతంలో రవీందర్ రెడ్డిని సస్పెండ్ చేసిన హైకోర్టు
రవీందర్ రెడ్డి రాజీనామాకు స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా ఆయన తెలంగాణ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. కొంత కాలంగా తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు లాంటి కొన్ని అంశాలపై హైకోర్టుతో విభేదిస్తున్నారు.
జ్యుడిషియల్ అధికారులపై అవినీతి ఆరోపణల కేసుల విచారణ ఏసీబీకి అప్పజెప్పకూడదని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు.
రవీందర్ రెడ్డి కరీంనగర్ జిల్లాకు చెందినవారు. మరో రెండు నెలల్లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య జ్యుడీషియల్ అధికారుల నియామకానికి సంబంధించి 2016 జూన్లో ఛలో హైకోర్టు పేరుతో నిరసన ప్రదర్శన నిర్వహించడంతో హైకోర్టు రవీందర్ రెడ్డితో పాటు మరో జడ్జిపై సస్పెన్షన్ విధించింది.
రెండు రాష్ట్రాల మధ్య హైకోర్టు విభజనకోసం కూడా రవీందర్ రెడ్డి గతంలో డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- 'మక్కా మసీదు' పేలుడు కేసులో ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు
- న్యాయం కోసం 26 ఏళ్లుగా ఎడతెగని పోరాటం..
- ఆరుషి కేసు: ఈ 7 ప్రశ్నలకు బదులేది?
- ఇది నిజం: 231 కేసులకు సాక్షి ఒక్కరే
- నేతల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు: అభ్యంతరం ఎవరికి? ఎందుకు?
- అవినీతి కేసులో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడికి 12 ఏళ్లు జైలు శిక్ష
- మిస్టర్ మోసగాడికి 6,637 ఏళ్ల జైలు శిక్ష
- ‘‘అమిత్ షాపై కేసును తిరగదోడాలి’’
- 2జీ కుంభకోణం కేసు: ‘ఏడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నా.. ఒక్క సాక్ష్యం లేదు’
- ‘రాజు ఎప్పుడూ తప్పు చేయడని రాజ్యాంగం చెబుతుంది. మరి తప్పు చేస్తే ఏం చేయాలి?’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








