You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అరుణాచల్ ప్రదేశ్లో హెలికాప్టర్ కూలి ఏడుగురి మృతి
భారత వైమానిక దళానికి చెందిన ఎమ్ఐ-17 వి5 హెలికాప్టర్ కూలిన ఘటనలో ఏడుగురు సిబ్బంది చనిపోయారు. ఈ మేరకు సీనియర్ ఐఏఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్లోని భారత్-చైనా సరిహద్దులో ఉన్న తవాంగ్ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
నేటి ఉదయం ఆరు గంటల ప్రాంతంలో హెలికాప్టర్కి రోజువారీ నిర్వహణ పరీక్షలను చేస్తున్నప్పుడు అది కూలిందని ఆ అధికారి వివరించారు.
ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి విచారణ కమిటీని నియమించినట్టు ఆయన చెప్పారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు గాయపడ్డ వ్యక్తిని స్థానిక ఆస్పత్రిలో చేర్చాయి.
ఇవి కూడా చూడండి
నిత్యం మారే వాతావరణం
హెలికాప్టర్ కూలిన ప్రాంతంలో వాతావరణం నిత్యం మారుతూ ఉంటుంది. ఈ భారత - చైనా సరిహద్దు రాష్ర్టం అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇటీవలే బీబీసీ ప్రతినిధి నితిన్ శ్రీవాత్సవ తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా అక్కడి వాతావరణం గురించి మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ వాతావరణం చాలా వేగంగా మారుతూ ఉంటుంది. ఇక్కడ ఒక్కసారిగా ఎండ వస్తుంది. అలాగే మబ్బులూ కమ్ముకుంటాయి. హఠాత్తుగా వర్షం వస్తుంది. దీంతో ఇక్కడ గతంలోనూ పలు ప్రమాదాలు జరిగాయి.’’ అని వివరించారు.
అరుణాచల్లో నిత్యం ప్రమాదమే
- ఈ ఏడాది జులైలో భారత వాయుసేనకు చెందిన హెలికాప్టర్ కూలిపోయింది. ఇద్దరు చనిపోయారు.
- ఇటీవల ఇటా నగర్లో వాతావరణం అనుకూలించక ఎంఐ 17 హెలికాప్టర్ కూలిపోయింది. హోం మంత్రి కిరణ్ రిజిజు తృటిలో తప్పించుకున్నారు.
- 2015లో పవన్ హన్స్ హెలికాప్టర్ కూలిపోగా.. ముగ్గురు చనిపోయారు. అరుణాచల్ ప్రదేశ్లోని టిరాప్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.
- 2011 ఏప్రిల్ 29న ఈ రాష్ర్ట మాజీ సీఎం డోర్జీ ఖండూ హెలికాప్టర్ కూలిన ఘటనలో మృతి చెందారు.
- ఇదే ఏడాది ఏప్రిల్ 16న ఒక హెలికాప్టర్ కూలిపోగా 16 మంది చనిపోయారు.
- 1997లో తవాంగ్లో చీతా హెలికాప్టర్ కూలడంతో.. అప్పటి రక్షణ శాఖ మంత్రి ఎన్వీఎన్ సోము, మేజర్ జనరల్ రమేశ్ నాగ్ పాల్ మరో ఇద్దరు చనిపోయారు.
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లోనూ సబ్స్క్రైబ్ చేయండి.)