అకౌంటులో మనీ లేకున్నా ఎంత విత్ డ్రా చేస్తే అంత ఇచ్చిన ఏటీఎంలు... క్యూ కట్టిన కస్టమర్లు

    • రచయిత, జెసికా లారెన్స్
    • హోదా, బీబీసీ న్యూస్ ఎన్ఐ

సాంకేతిక లోపం తలెత్తడంతో ఐర్లాండ్‌లోని ‘బ్యాంక్ ఆఫ్ ఐర్లాండ్’ కస్టమర్లకు ఏటీఎంల నుంచి విత్ డ్రా చేసినప్పుడు రావాల్సిన కంటే పెద్ద మొత్తంలో నగదు వచ్చింది.

ఖాతాల్లో తక్కువ డబ్బు ఉన్నప్పటికీ, అసలు ఖాతాలో డబ్బు లేనప్పటికీ ఏటీఎం నుంచి విత్ డ్రా చేయడానికి ప్రయత్నిస్తే చాలు పెద్ద మొత్తంలో డబ్బులొచ్చాయి.

దీంతో ఏటీఎంల వద్ద జనం బారులుతీరారు. సోషల్ మీడియాలో ఇలాంటి ఫోటోలు, వీడియోలు చాలా కనిపించాయి.

మరోవైపు ఇంకొందరికి కార్డ్, కాంటాక్ట్ లెస్, క్యాష్ మెషీన్ సర్వీసులు పనిచేయలేదు.

సాంకేతిక సమస్య ఏర్పడడంతో ఇలా జరిగిందని బ్యాంక్ వెల్లడించింది. అయితే, బుధవారం ఉదయం నాటికి ఆ బ్యాంక్ సాంకేతిక లోపాన్ని సరిదిద్దింది.

కాగా, టెక్నికల్ ప్రాబ్లం కారణంగా ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రా చేసినవారు, బ్యాంకింగ్ యాప్ సహాయంతో డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసినవారు తమ ఖాతాలో ఉన్న డబ్బు క న్నా అధికంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడిందని, అలాంటి లావాదేవీలను పరిశీలించి సర్దుబాటు చేస్తామని బ్యాంక్ వెల్లడించింది.

అలాగే సాంకేతిక సమస్య కారణంగా ఎవరైనా నగదు సేవలు పొందలేక అసౌకర్యానికి గురైతే క్షమించాలంటూ బ్యాంక్ తన ఖాతాదారులను కోరింది.

లోపాన్ని సవరించడానికి ప్రయత్నిస్తామని చెప్పింది.

కాగా, మంగళవారం రాత్రి కొన్ని నగదు విత్ డ్రా యంత్రాల వద్ద అసాధారణ స్థాయిలో యాక్టివిటీ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని, కొన్ని ఆర్థిక సంస్థలలో తలెత్తిన సాంకేతిక సమస్య గురించి తమకు తెలిసిందని ఐర్లాండ్ పోలీసులు చెప్పారు.

మంగళవారం మధ్యాహ్నం నుంచి బ్యాంక్ ఆఫ్ ఐర్లాండ్ కస్టమర్లలో కొందరికి కార్డులు పనిచేయలేదు. కాంటాక్ట్ లెస్ విధానంలో కానీ ఏటీఎంలలో కానీ డబ్బు తీసుకోలేకపోయారు.

మరికొందరికి మాత్రం తమతమ ఖాతాలలో ఉన్న కంటే ఎక్కువగా డ్రా చేయడానికి, ట్రాన్స్‌ఫర్ చేయడానికి అవకాశం ఏర్పడింది.

ఇవి కూడా చదవండి: