హరితారెడ్డి: పోలీసులపై మంత్రి భార్య ఆగ్రహం..
ఆంధ్రప్రదేశ్లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య పోలీసులతో ‘దురుసుగా’ మాట్లాడిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అయింది.
ఆ ఘటనపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి వివరణ ఇచ్చారు.
‘‘ఆ రోజు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తరఫున ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ప్రోగ్రాం కోసం నేను వైజాగ్ వెళ్లాను. నా తరఫున పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో నా భార్య పాల్గొంది. అయితే నాలుగు గ్రామాల్లో పంపిణీ చేసిన తర్వాత పోలీసులు వచ్చి మీకు బందోబస్తు ఇస్తామని ఆమెకు చెప్పారు. దీంతో పోలీసులు వస్తారని ఆమె రెండు గంటలపాటు వేచిచూశారు. వాళ్లు లేటుగా వచ్చేసరికి.. మీకు జీతాలు ఇస్తుంది ప్రభుత్వమా లేక వైసీపీ వాళ్లా? అని తను అడిగింది. అందులో తప్పేముంది? ఎవరిని కావాలని మందలించం. అప్పుడున్న పరిస్థితి, ప్రోగ్రాం కోసం అక్కడివారు ఫోన్లు చేస్తూ ఉండటంతో అలా జరిగింది.’’ అని ఆయన బీబీసీతో చెప్పారు.
మరో ఘటనలో తిరుపతి కార్పొరేషన్ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాసులు అన్న కుమారుడు పాల్గొనడంపై విమర్శలు వచ్చాయి.
అయితే, స్థానిక సమస్యలపై మాట్లాడడానికి తన అన్న కుమారుడు వెళ్లారే కానీ అధికారులతో సమీక్ష జరపలేదని ఎమ్మెల్యే శ్రీనివాసులు ‘బీబీసీ’తో చెప్పారు.
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బృందమ్మ ఆసుపత్రి తనిఖీ చేయడం కూడా వివాదాస్పదమైంది. ఈ అంశంపై స్పందన కోసం సుధీర్ రెడ్డిని ఫోన్లో సంప్రదించేందుకు బీబీసీ పలుమార్లు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు.

ఫొటో సోర్స్, UGC









