దర్శి బస్సు ప్రమాదం - ప్రకాశం: సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ పెళ్లి బస్సు, ఏడుగురు మృతి.. ఈ ఘటన ఎలా జరిగింది?

    • రచయిత, వడిశెట్టి శంకర్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఓ పెళ్లి బస్సు నాగార్జున సాగర్ కాలువలోకి దూసుకెళ్లడంతో ఏడుగురు చనిపోయారు. వీరిలో ఒకరు ఆరేళ్ల చిన్నారి.

12 మంది గాయాలపాలయ్యారు.

ఇది ఏపీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు.

సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది.

ఘటనా సమయంలో బస్సులో 40 మంది పెళ్లివారు ఉన్నట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

కాకినాడకు పెళ్లి రిసెప్షన్‌కు వెళ్తుండగా...

ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన కొందరు కాకినాడలో పెళ్లి రిసెప్షన్ కోసం ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకున్నారు.

బయలుదేరిన కొద్దిసేపటికే బస్సు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు.

మృతుల్లో అబ్దుల్ అజీజ్, అబ్దుల్ హనీ, షేక్ రమీజ్, నూర్జహాన్, జానీ బేగం, సబీనాతోపాటు ఆరేళ్ల హీనా ఉన్నారు.

గాయపడ్డ వారిని ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణాలపై విచారిస్తున్నామని బీబీసీకి దర్శి పోలీసులు చెప్పారు.

బస్సు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

ఆర్టీసీ పెళ్లి బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

పొదిలి నుంచి కాకినాడకు పెళ్లిబృందంతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న ఎన్‌సీపీ కాల్వలో పడిపోయిందని, ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు.

ప్రమాదం జరిగిన స్థలానికి పోలీసు సిబ్బంది, ఇతర అధికారులు వెళ్లారని, సహాయ చర్యలు చేపట్టారని, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించినట్లు అధికారులు వివరించారు.

ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తోడుగా నిలవాలన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)