టీ20 వరల్డ్‌కప్ 2022: భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఫైనల్స్ రావాలని మాజీ క్రికెటర్లు ఎందుకు కోరుకుంటున్నారు?

    • రచయిత, పంకజ్ ప్రియదర్శి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌, పాకిస్తాన్‌ జట్లు ఫైనల్స్‌కు వస్తాయా, రావా అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారని ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ అన్నాడు. 

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. 

నవంబర్ 9, 10 తేదీల్లో జరగనున్న సెమీఫైనల్స్‌లో, తొలుత పాకిస్తాన్ న్యూజిలాండ్‌తో తలపడుతుంది. మరుసటి రోజు భారత్, ఇంగ్లండ్‌తో తలపడుతుంది.

భారత్, పాకిస్తాన్ జట్లు ఫైనల్‌కు చేరుకోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య ఫైనల్‌ మ్యాచ్ జరిగింది. కేవలం అయిదు పరుగుల తేడాతో పాకిస్తాన్ ఓడిపోయింది. భారత్ కప్ సొంతం చేసుకుంది. అయితే, ఆ తరువాత భారత్ ఎప్పుడూ టీ 20 వరల్డ్ కప్ గెలవలేదు.

ప్రస్తుతం జరుగుతున్న టోర్నమెంటులో పాకిస్తాన్ కాస్త వెనక్కి వెళ్లి, మళ్లీ ముందుకొచ్చింది. తొలి మ్యాచ్‌లో భారత్‌తో, రెండో మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో ఓడిపోయింది. దాంతో, పాక్ జట్టు సెమీఫైనల్‌కు చేరడం కష్టమని క్రికెట్ నిపుణులు పెదవి విరిచారు.

కానీ పాకిస్తాన్ మిగిలిన మ్యాచ్‌లు గెలవడమే కాకుండా, కొంత అదృష్టాన్ని కూడా మూటగట్టుకుంది. ఒక ముఖ్యమైన మ్యాచ్‌లో, నెదర్లాండ్స్ దక్షిణాఫ్రికాను ఓడించి పాకిస్తాన్‌కు మార్గం సుగమం చేసింది. 

ఎట్టకేలకు, పాక్ జట్టు సెమీ ఫైనల్స్‌కు చేరుకోవడంపై క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

షేన్‌ వాట్సన్‌ ఏమన్నాడు

భారత్, పాకిస్తాన్‌లను ఫైనల్‌లో చూడాలని అందరూ కోరుకుంటున్నారని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ అన్నాడు. 

2007లో జరిగిన ఫైనల్‌లో కూడా ఇరు జట్లు ముఖాముఖి తలపడ్డాయని, ఈసారి కూడా రెండు జట్లు ఫైనల్ ఆడాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నాడు. 

అయితే, సెమీస్‌లో ఈ రెండు జట్లూ తమ ప్రత్యర్థులపై గెలవడం అంత సులభమేమీ కాదు.

న్యూజిలాండ్ మంచి ఫాంలో ఉంది. అత్యుత్తమ బ్యాట్స్‌మెన్, ఫాస్ట్ బౌలర్లతో మైదానంలోకి దిగుతుంది. పాకిస్తాన్ కూడా తమ బౌలర్ల నుంచి మంచి ప్రదర్శనను ఆశిస్తోంది. 

పాకిస్తాన్ సెమీ ఫైనల్స్‌కు వచ్చిన విధానం ఆ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని, సెమీస్‌లో మరింత స్వేచ్ఛగా ఆడుతుందని షేన్ వాట్సన్ అభిప్రాయపడ్డాడు. 

చాలా టోర్నమెంటుల్లో, ఎలాగోలా ఫైనల్‌కు చేరుకునే జట్టే టైటిలు కైవసం చేసుకుంటుందని వాట్సన్ అన్నాడు. 

న్యూజిలాండ్‌కు పాకిస్తాన్ గట్టి పోటీ ఇస్తుందని అన్నాడు.

ఇతర మాజీ క్రికెటర్లు ఏమంటున్నారు?

షేన్ వాట్సన్ మాత్రమే కాదు, ఇతర మాజీ క్రికెటర్లు కూడా భారత్, పాకిస్తాన్‌ జట్లు ఫైనల్‌కు వస్తాయని అంచనా వేస్తున్నారు. 

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ ఏకంగా ట్విట్టర్‌లో పోల్ నిర్వహించాడు. 75 శాతం ఓట్లు ఫైనల్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు అనుకూలంగా వచ్చాయి.

భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా దీనిపై ట్వీట్ చేశాాడు. 

"అకస్మాత్తుగా, ప్రపంచ కప్‌లో ఆ ఫ్లేవర్ వచ్చేసింది. పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. భారత్-పాకిస్తాన్ మధ్య ఫైనల్ జరుగుతుందా?" అన్నాడు. 

సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ట్వీట్ చేస్తూ, "మళ్లీ సౌతాఫ్రికా ఓడిపోయిందా! పాకిస్తాన్‌కు ప్రాణం తిరిగొచ్చింది. ఇది మరో 1992 ప్రపంచ కప్ అవుతుందా? లేక 2007 టీ20 ప్రపంచ కప్ అవుతుందా? వారాంతంలో మరో భారత్-పాక్ మ్యాచ్ చూడబోతున్నామా?" అన్నారు.

ప్రారంభం నుంచి పాక్ ఆట తీరు పట్ల అసంతృప్తితో ఉన్న మాజీ పాకిస్తాన్ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా ఫైనల్స్ పట్ల ఆసక్తి కనబరిచాడు.

"ఏ జట్టూ తమ ఉత్తమ ప్రదర్శన కనబర్చలేదు. అందుకే పోటీ రసవత్తరంగా మారింది. ఈ వరల్డ్ కప్ ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోతుంది" అని ట్వీట్ చేశాడు.

"పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్‌కు చేరితే, అది కచ్చితంగా ఫైనల్ ఆడుతుందని" భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా గ్రూప్ మ్యాచ్‌లు అవుతున్నప్పుడే చెప్పాడు.

ఈ టోర్నమెంటులో భారత, పాకిస్తాన్ జట్ల జర్నీ ఎలా సాగింది?

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య జరిగింది. చివరివరకు మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. భారత్ నాలుగు వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. 

ఆఖరి ఎనిమిది బంతులు పాకిస్తాన్‌కు పీడకలలా మారాయి. భారత్ జట్టు చివరి ఎనిమిది బంతుల్లో 28 పరుగులు చేయాల్సి ఉంది. విరాట్‌ కోహ్లీ విజృంభించి ఆడడంతో భారత్ గెలుపు సొంతం చేసుకుంది. పాక్ బౌలర్లు నో బాల్, వైడ్ వేసి భారత్‌కు సాయం చేశారు. 

పాకిస్తాన్ రెండో మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. దాంతో, పాక్ క్రికెట్ ప్రేమికులు నీరసపడ్డారు. 

ఆ జట్టుపై విమర్శలు వెల్లువెత్తాయి. గ్రూప్ దశలోనే పాకిస్తాన్ నిష్క్రమిస్తుందని చాలామంది అంచనా వేశారు.

కానీ, పాకిస్తాన్ పుంజుకుంది. తదుపరి మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై గెలుపు అన్నిటికన్నా ముఖ్యమైనది.

అయితే, గ్రూప్-2 మ్యాచ్‌లలో చివరి మ్యాచ్ వరకు సమీకరణాలు మారిపోతూనే ఉన్నాయి. పాకిస్తాన్ సెమీస్‌కు వెళుతుందా, లేదా అన్న ఉత్కంఠ కొనసాగింది.

చివరి రోజు కూడా నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికాను ఓడించి, పెద్ద దుమారాన్ని రేపుతూ మళ్లీ సమీకరణాలన్నింటినీ మార్చేసింది. ఇక పాకిస్తాన్, బంగ్లాదేశ్‌పై గెలవక తప్పని పరిస్థితి వచ్చింది. సులువుగానే ఆ మ్యాచ్ గెలిచి సెమీస్‌కు చేరుకుంది.

మరోవైపు, భారత్, ఒక మ్యాచ్ ఓడిపోయి నాలుగు మ్యాచుల్లో గెలిచి సునాయసంగా సెమీఫైనల్స్‌కు చేరుకుంది.

తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి శుభారంభం చేసింది. అయితే, దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి తరువాత భారత శిబిరంలో కొంత భయాందోళన నెలకొంది.

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌కి వర్షం ఆటంకం కలిగించడంతో ఆ జట్టు గెలుస్తుందని కాసేపు అనిపించింది. చివరికి, భారత్ గెలిచింది. ఆఖరు మ్యాచ్ జింబాబ్వేతో ఆడక ముందే సెమీస్‌లో బెర్త్ ఖాయం చేసుకుంది. 

ఇప్పుడు నవంబర్ 9న జరిగే తొలి సెమీఫైనల్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడనుండగా, నవంబర్ 10న రెండో సెమీఫైనల్లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. 

నవంబర్ 13న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ఇవి కూడా చదవండి:

సంబంధిత కథనాలు