Urvashi Rautela: ఈ సినీ నటి టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ వెంటపడుతున్నారా? ఈమె ఆస్ట్రేలియా వెళ్లడంపై ఆన్‌లైన్‌లో ట్రోలింగ్ ఎందుకు?

సినీ నటి ఊర్వశి రౌతేలా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఆమె తన ప్రయాణంలో తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకదాని తర్వాత ఒకటి షేర్ చేసుకున్నారు. ఆ ఫొటోలకు ఆమె ''నా హృదయం చెప్పినట్లు వింటున్నాను. అది నన్ను ఆస్ట్రేలియా తీసుకువచ్చింది'' అని క్యాప్షన్ పెట్టారు.

ఈ ఫొటోలు, క్యాప్షన్‌ల కారణంగా ఆమె విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. ఇంటర్నెట్ యూజర్లు ఆమెను స్టాకర్ (వెంటపడే వ్యక్తి) అని విమర్శిస్తున్నారు.

రౌతేలా పోస్టులపై కమేడియన్ శుభమ్ గౌర్ కూడా కామెంట్ చేశారు. ''మనకు ఇంకా కొన్ని వారాలే మిగిలి ఉన్నాయి. ప్రపంచకప్ పోటీలను వేరే చోటికి మార్చగలమా?'' అని రాశారు.

మరొక యూజర్ "ఛోటూ భయ్యా వేటను దీదీ ఆపదు" అని రాశారు.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ కూడా ఈ విషయంపై ట్వీట్ చేస్తూ, "రిషబ్ పంత్‌కి మంచి లాయర్ కావాలి. నిషేధపు ఉత్తర్వులు సంపాదించడానికి అర్హుడు" అని రాశారు.

ఊర్వశి రౌతేలా ఆసియా కప్ సందర్భంగా ఇండో-పాక్ మ్యాచ్‌ని చూడటానికి దుబాయ్ వచ్చినప్పుడు కూడా ఆమె విపరీతంగా ట్రోల్స్‌కు, మీమ్స్‌కు గురయ్యారు.

రౌతేలా ఎందుకు ట్రోల్ అవుతున్నారు?

వచ్చే వారం నుంచి ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఇప్పటికే భారత జట్టు ఆస్ట్రేలియా చేరుకుంది. రిషబ్ పంత్ కూడా జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో సభ్యుడు.

ఇప్పుడు ఊర్వశి రౌతేలా తాను ఆస్ట్రేలియాలో ఉన్నట్లు ఫొటోలను షేర్ చేసుకున్నారు. దీంతో మరోసారి ఇంటర్నెట్ యూజర్లు ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఆమె పర్యటనకు, రిషబ్ పంత్‌ పర్యటనకు ముడిపెడుతూ కామెంట్లు చేస్తున్నారు.

పంత్‌, రౌతేలా మధ్య వివాదం కొత్త విషయం కాదు. బహిరంగంగా పేర్లు ప్రస్తావించుకోకున్నా, తమ పోస్టులు, ఫొటోల ద్వారా ఇద్దరూ పరోక్షంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

'బాలీవుడ్ హంగామా' అనే యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్పీ అనే పేరు చెబుతూ రౌతేలా అనేక విషయాలు మాట్లాడారు. దీంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది.

''మిస్టర్ ఆర్పీ ఒకసారి హోటల్ లాబీలో నన్ను కలవడానికి చాలా గంటలు వేచి చూశాడు'' అని ఆమె ఆ ఇంటర్వ్యూలో అన్నారు.

ఆ రోజు తాను అలసిపోయి ఉన్నానని, ఆర్పీ తనకోసం వచ్చాడని తెలియక గదిలో నిద్రపోయానని, లేచి చూసేసరికి ఆర్పీ నుంచి 16-17 మిస్డ్ కాల్స్ ఉన్నాయని ఊర్వశి చెప్పుకొచ్చారు.

ఇంకెప్పుడైనా ముంబయిలో కలుద్దామని తాను ఆర్పీకి చెప్పానని, ముంబయిలో ఒకసారి కలుసుకున్నామని ఊర్వశి వెల్లడించారు. కానీ, తమ సమావేశంపై మీడియాలో చాలా రకాలుగా రాశారని చెప్పారు.

ఈ మొత్తం ఇంటర్వ్యూలో రౌతేలా ఎక్కడా రిషబ్ పంత్ పేరును నేరుగా ప్రస్తావించలేదు. కానీ దీని తర్వాత రిషబ్ పంత్ ఇన్‌స్టా స్టోరీ స్క్రీన్ షాట్ వైరల్ కావడం ప్రారంభించింది.

పంత్ తన స్టోరీలో "పాపులర్ కావడానికి, హెడ్‌లైన్లలో ఉండటానికి కొంతమంది ఇంటర్వ్యూలలో అబద్ధాలు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. పేరు కోసం కొంతమంది ఇలా పాకులాడటం బాధాకరం. వారిని భగవంతుడే రక్షించుగాక'' అంటూ రాసుకొచ్చారు.

పంత్ ఈ స్టోరీని పోస్ట్ చేసిన కొద్దిసేపటికే తొలగించినప్పటికీ, ఊర్వశి రౌతేలా దీనిని వదిలిపెట్టలేదు. ఆమె కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పోస్ట్ చేశారు.

''Chotu bhaiyaa should play bat ball, main koyi munni nahi hoon badnaam hone with young kiddo darling tere liye, ( ఛోటుభయ్యా బ్యాట్ బాల్ ఆడాలి. నీలాంటి పిల్లల కారణంగా నేను బద్నాం కాను) అంటూ స్టోరీ రాశారు.

దీనికి హ్యాపీరక్షాబంధన్, ఆర్పీఛోటుభయ్యా, కౌగర్‌హంటర్ అంటూ హ్యాష్‌ట్యాగ్‌లు పెట్టారు.

క్షమాపణలు చెప్పిన ఊర్వశి

కొన్ని రోజుల తర్వాత వీరిద్దరి మధ్య వాదోపవాదాలు ఆగిపోయాయి. సెప్టెంబర్‌లో రౌతేలా మరొక వీడియో వైరల్ కావడం ప్రారంభించింది. ఈ వీడియోలో, ఆమె ఒక ఇంటర్వ్యూలో ఆర్పీకి సారీ చెప్పడం కనిపిస్తుంది. రౌతేలా క్షమాపణలు చెబుతున్న ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఆమె మరోసారి ట్రోల్స్‌కు గురయ్యారు.

దీనిపై పంత్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. విషయం సద్దుమణిగిన తర్వాత మళ్లీ రౌతేలా ఆస్ట్రేలియ పర్యటన మరోసారి వివాదాన్ని రేపింది.

ఊర్వశి రౌతేలా ఎవరు?

ఊర్వశి రౌతేలా 2013లో 'సింగ్ సాబ్ ది గ్రేట్' సినిమాతో తన సినిమా కెరియర్‌ను ప్రారంభించారు. 20 ఏళ్ల వయసులో ఊర్వశి రౌతేలా మిస్ దివా యూనివర్స్ 2015 టైటిల్‌ను సాధించారు. అదే సంవత్సరంలో, ఆమె మిస్ యూనివర్స్ 2015లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. అయితే, దాన్ని సాధించలేకపోయారు.

తర్వాత ఆమె 'సనమ్ రే', 'గ్రేట్ గ్రాండ్ మస్తీ', 'హేట్ స్టోరీ 4', 'పాగల్‌పంటి' వంటి బాలీవుడ్ చిత్రాలలో కనిపించారు. పలు మ్యూజిక్ ఆల్బమ్‌లకు కూడా రౌతేలా పని చేశారు.

2018 సంవత్సరంలో, అండమాన్ అండ్ నికోబార్ ప్రభుత్వ పర్యాటక శాఖ ఆమెను విశ్వంలోనే అతి పిన్న వయస్కురాలైన అందగత్తె (Youngest Most Beautiful woman in the Universe 2018 ) గా ప్రకటించింది.

ఉత్తరాఖండ్‌కు చెందిన రౌతేలా, తన పేరు మీద ఫౌండేషన్‌ను కూడా నడుపుతున్నారు. ఈ సంస్థ పేద ప్రజలకు సహాయం చేస్తుంది.

రిషబ్ పంత్ ఎవరు?

రిషబ్ పంత్ భారత క్రికెట్ జట్టులో వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్. 2016లో అండర్-19 ప్రపంచకప్‌లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో రిషబ్ తొలిసారి అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఉత్తరాఖండ్‌కు చెందిన పంత్, ఐపీఎల్ జట్టు దిల్లీ డేర్‌ డెవిల్స్‌కు ఎంపికయ్యాడు. సీజన్ ముగిసే సమయానికి జట్టుకు కెప్టెన్ అయ్యాడు.

2017లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అప్పుడు అతని వయస్సు కేవలం 19 సంవత్సరాలు. భారతదేశం తరపున టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆడిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు.

2018లో తొలి టెస్ట్ ఆడాడు రిషబ్. తన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో మొదటి స్కోరును సిక్సర్‌తో మొదలుపెట్టిన మొదటి భారతీయుడు కూడా అతనే. ప్రపంచంలో అలా క్రికెట్ స్కోరును సిక్స్‌తో ప్రారంభించిన వారిలో పంత్ 12వ ఆటగాడు.

2019 క్రికెట్ ప్రపంచ కప్‌లో కూడా పంత్ ఆడాడు. ఈ సంవత్సరం జరిగే టీ20 ప్రపంచ కప్ జట్టులో సభ్యుడు. ప్రస్తుతం ఆయన వయసు 25 సంవత్సరాలు. చిన్న వయసులోనే అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేసిన వాడిగా రిషబ్ పంత్ పేరు తెచ్చుకున్నాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)