You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఘోస్ట్ మార్క్స్: లండన్ మెట్రోలో ఈ దెయ్యపు నీడల కథ ఏంటి, అధికారులు ఏం చేశారు?
- రచయిత, నోవాహ్ వికెర్స్
- హోదా, లోకల్ డెమోక్రసీ రిపోర్టింగ్ సర్వీస్
లండన్లోని రవాణా వ్యవస్థను నిర్వహించే ట్రాన్స్పోర్ట్ ఫర్ లండన్ (టీఎఫ్ఎల్)కు ఇప్పుడు ‘ఘోస్ట్ మార్క్స్’ను తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ముఖ్యంగా అత్యంత రద్దీగా ఉండే ఎలిజబెత్ లైన్లో నిర్వహణ పరంగా ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వ ఆధ్వరంలోని టీఎఫ్ఎల్ ప్రయోగాత్మకంగా కార్యచరణ అమలుచేస్తోంది.
ఈ ఎలిజబెత్ లైన్ను హైబ్రిడ్ అర్బన్-సబర్బన్ రైల్ సర్వీసుగా చెప్తారు. ప్రత్యేక నిర్మిత రవాణా మార్గం ద్వారా సెంట్రల్ లండన్ కేంద్రంగా అన్ని మార్గాలను కలుపుతూ రైలు సర్వీసులు నిర్వహిస్తోంది టీఎఫ్ఎల్.
నిత్యం రద్దీగా ఉండే ఈ లైన్లో ప్లాట్ఫాంలపై ప్రయాణీకులు కూర్చునేందుకు బెంచీలు ఏర్పాటు చేశారు.
అవి గోడలను ఆనుకుని ఉండటం, ప్రయాణీకులు గోడలకు ఆనుకుని కూర్చోవడం వల్ల ఆ గోడలపై మరకలు ఏర్పడ్డాయి. వాటిని ‘ఘోస్ట్ మార్క్స్’ అని పిలుస్తుంటారు.
చూడటానికి ఇవి మనిషి నీడలా కనిపిస్తుంటాయి. అందుకే వీటిని ఘోస్ట్ మార్క్స్ అంటున్నారు.
ఆ ఘోస్ట్ మార్క్స్ కారణంగా ఆ స్టేషన్లు అందంగా కనిపించడం లేదని, వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.
ప్రస్తుతం టీఎఫ్ఎల్ వాటికి పరిష్కారం వెతికేపనిలో భాగంగా , ఆ గోడలపై ఘోస్ట్ మార్క్స్ కనిపించకుండా చేసేందుకు వినైల్ కవరింగ్స్తో స్టిక్కర్లను ఏర్పాటు చేయడంతో సహా, ఇతర పరిష్కారాలను వెతికేందుకు ప్రయత్నిస్తోంది టీఎఫ్ఎల్.
రీడింగ్ అండ్ హీత్రూ ఎయిర్పోర్ట్ నుంచి అబీ వుడ్, షెన్ఫీల్డ్ వరకు విస్తరించిన ఉన్న 73 మైళ్ల పొడవైన ఎలిజబెత్ లైన్లో ప్రయోగాత్మకంగా పనులు చేపట్టారు..
ఇటీవల లండన్ అసెంబ్లీలో లిబరల్ డెమోక్రట్ పార్టీకి చెందిన కరోలిన్ పిడ్జియాన్ ఈ విషయమై మేయర్ సాదిక్ ఖాన్ను లిఖితపూర్వకంగా ప్రశ్నించారు.
“దశాబ్దాలపాటు స్టేషన్లు కొత్తగా ఉంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?” అని ఆమె అడిగారు.
కరోలిన్ పిడ్జియాన్ లేఖపై మేయర్ కార్యాలయం నుంచి స్పందన వచ్చింది.
“ప్రజలకు టీఎఫ్ఎల్ పరిధిలోని అన్ని స్టేషన్లలో శుభ్రతతో కూడిన వాతావరణం ఉండేలా ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టాం" అని పేర్కొంది.
ప్లాట్ఫాంలోని గోడలపై ఉన్న ఆ దెయ్యపు గుర్తులను తొలగించేందుకు, భవిష్యత్తులో గోడలు పాడవకుండా ఉండేందుకు వినైల్ డిజైన్లతో కొత్త తరహా ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం ఎలిజబెత్ లైన్లో ప్రయోగాత్మకంగా అలాంటి పనులు చేపట్టాం” అని తెలిపింది.
“వినైల్ కవరింగ్స్ ఏర్పాటు చేయడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి టీఎఫ్ఎల్ విశ్లేషణ జరుపుతోంది” అని తెలిపింది.
అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది. రకరకాల డిజైన్లలో, బేంచీల వెనకాల ఉన్న గోడలపై వాటిని ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ఎలిజబెత్ లైన్లోనే ప్రయోగాత్మకంగా ఈ పనులు చేపడుతున్నారు.
తలనొప్పిగా మారిన ఘోస్ట్ మార్క్స్
ట్రాన్స్ఫోర్ట్ ఫర్ లండన్ (టీఎఫ్ఎల్)కు ఈ ఘోస్ట్ మార్క్స్ సవాలుగా మారాయి. ఎప్పటికప్పుడు స్టేషన్లలో పారిశుధ్య నిర్వహణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఘోస్ట్ మార్క్స్ను తొలగించడం సవాల్గా మారింది.
ట్యూబ్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన బెంచీల వెనుక ఉన్న ఆ గుర్తులు భయంగొలిపేలా ఉన్నాయని కొంతమంది ప్రయాణీకులు చెప్తున్నట్లు గతేడాది లండన్ స్థానిక మీడియా, వెబ్సైట్లు కథనాలు ప్రచురించాయి.
మై లండన్ వెబ్సైట్ రాసిన కథనం ప్రకారం.. నిర్ణీత స్టేషన్ల మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గించి, అత్యాధునిక రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో 2009లో ఈ లైన్లో పనులు ప్రారంభమయ్యాయి. 13 ఏళ్ల పాటు జరిగిన పనుల్లో సెంట్రల్ లండన్ కేంద్రంగా తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లోని స్టేషన్లను అనుసంధానిస్తూ నిర్మాణాలు పూర్తి చేశారు.
ఎలిజబెత్ లైన్లోని 24 మే 2022లో క్వీన్ ఎలిజబెత్ 2 జ్ఞాపకార్థం ఆ లైన్కు ఎలిజబెత్ లైన్గా నామకరణం చేశారు.
41 స్టేషన్లు ఉన్న ఈ మార్గంలో ఏడాదికి 204.296 మిలియన్ల మంది ప్రయాణం చేస్తారని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం 18.9 బిలియన్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టింది.
కానీ, లైన్ అందుబాటులోకి వచ్చి ఎక్కువ కాలం గడవకముందే, ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
- బెంగళూరు: ఇండియన్ సిలికాన్ సిటీలో ఇంగ్లిష్కు వ్యతిరేకంగా ఎందుకీ ఘర్షణలు?
- హ్యూమన్ రైట్స్ వాచ్: మైనారిటీలు, మహిళల పట్ల భారత్ వివక్ష చూపిస్తోందన్న 'వరల్డ్ రిపోర్ట్-2024'
- పశ్చిమ బెంగాల్: వామపక్ష ర్యాలీకి భారీగా తరలివచ్చిన జనం... వీరంతా ఓట్లేస్తారా?
- INDvsAFG: ఇషాన్ కిషన్కు ఏమైంది? క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారా
- రాజీవ్ గాంధీ నుంచి మోదీ వరకు: మాల్దీవులను భారత్ నాలుగుసార్లు ఎలా ఆదుకుందో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)