తెలంగాణ: ములుగు జిల్లాలో పురుషునికి కాల్చిన గడ్డపారతో ‘శీల’ పరీక్ష...

ఫొటో సోర్స్, UGC
వివాహేతర సంబంధం ఆరోపణలతో గంగాధర్ అనే వ్యక్తి చేత కాల్చిన గడ్డపారను పట్టించిన ఘటన తెలంగాణలోని ములుగు జిల్లాలో చోటు చేసుకుంది.
ఈమేరకు బంజరుపల్లికి చెందిన జగన్నాథం గంగాధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు కాపీలోని వివరాల ప్రకారం...
ఎస్టీ అయిన జగన్నాథం గంగాధర్ బంజరుపల్లి గ్రామంలో నివసిస్తున్నారు. అయితే పెద్దమ్మ కుమారుడు జగన్నాథం నాగయ్యకు గంగాధర్ మీద అనుమానం ఉంది. తన భార్యతో గంగాధర్కు సంబంధం ఉందని నాగయ్య తరచూ ఆరోపిస్తూ ఉండేవారు.
కుల పంచాయతీ దృష్టికి ఆ విషయాన్ని నాగయ్య తీసుకెళ్లారు.
తప్పు చేశాడో లేదో తెలియాలంటే గంగాధర్ కాల్చిన గడ్డపారను పట్టుకోవాలని కుల పంచాయతీలోని పెద్దలు ఆదేశించారు. దాంతో ఫిబ్రవరి 25వ తేదీన ఉదయం సుమారు 7.30 గంటల ప్రాంతంలో కన్నాయిగూడెం దగ్గర గల లక్నవరం చెరువు వద్ద పరీక్ష పెట్టారు.

ఫొటో సోర్స్, UGC
నిప్పుల్లో గడ్డపారను బాగా వేడి చేసి దాన్ని పట్టుకోవాలని చెప్పారు. చేతులు కాలక పోతే తప్పు చేసినట్లు కాదని, చేతులు కాలితే తప్పు చేసినట్లు అని పెద్దలు చెప్పారు. తప్పు చేసినట్లు తేలితే గంగాధర్ రూ.11 లక్షలు కట్టాలని వారు తీర్మానం చేశారు.
ఆ తీర్మానం ప్రకారం కాలిన గడ్డపారను రెండు చేతులతో గంగాధర్ పట్టుకున్నాడు. తన చేతులు కాలలేదు కాబట్టి తాను ఏ తప్పూ చేయలేదని, అయినా తనను డబ్బులు కట్టాలంటూ వారు వేధిస్తున్నారని గంగాధర్ ఆరోపించారు.
ప్రాణహాని కలుగుతుందని తెలిసినప్పటికీ తన చేత బలవంతంగా బాగా కాలిన గడ్డపారను పట్టించారని పోలీసులకు చేసిన ఫిర్యాదులో గంగాధర్ పేర్కొన్నారు.
గంగాధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ములుగు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు.

ఫొటో సోర్స్, UGC
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ‘కులం వేరు కావడంతో పెళ్లికి అంగీకరించని పెద్దలు... ప్రియురాలిని కత్తితో పొడిచి చంపిన ప్రియుడు’
- మనీష్ సిసోడియా: అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న ఒకనాటి అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు
- వజ్రంతో మీ ఇంటికి కావాల్సిన విద్యుత్ ఎలా వస్తుంది?
- స్వర భాస్కర్-ఫర్హాద్ అహ్మద్: హిందూ, ముస్లిం ప్రేమికులు పెళ్లి చేసుకోవాలంటే ఎలా... స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఏం చెబుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








