ఇరాక్ దుమ్ము తుపాను: బాగ్దాద్‌లో ఆకాశం కాషాయ రంగులోకి మారిపోయింది.. ఎందుకంటే..

ఇరాక్ దేశాన్ని నారింజ రంగు దుమ్ము మేఘాలు కమ్మేశాయి. దీంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆకాశం కాషాయ రంగులోకి మారిపోయింది.

ఈ దుమ్ము తుపాను కారణంగా బాగ్దాద్, నజాఫ్ విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.

సోమవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ నిపుణులు ప్రకటించారు.

మధ్య ప్రాచ్య దేశాల్లో ఇలాంటి దుమ్ము తుపానులు పెరుగుతున్నాయి. వాతావరణ మార్పుల వల్ల, భూమి-నీరు అధికంగా వినియోగించడం వల్ల ఇలాంటి తుపానులు వస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

శనివారం ఇరాక్‌లోని పలు ప్రాంతాల్లో 500 మీటర్ల దూరంలో ఉన్న వస్తువులు కూడా స్పష్టంగా కనిపించని పరిస్థితి నెలకొంది.

గత నెలలో వరుసగా దుమ్ము తుపానులు ఇరాక్‌ను చుట్టుముట్టాయి. డజన్లకొద్దీ పౌరులు శ్వాస ఇబ్బందులతో ఆస్పత్రుల పాలయ్యారు.

దేశంలో కరువు, భూముల ఎడారీకరణ, వర్షపాతం తగ్గిపోవడం వల్ల మరిన్ని దుమ్ము తుపానులు వస్తాయని వాతావరణ శాఖ అధికారులు ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో అన్నారు. నగరాల్లోను, చుట్టుపక్కలా పచ్చగా ఉండే ప్రాంతాలు తగ్గిపోవడం వల్ల కూడా ఇలాంటి దుమ్ము తుపానులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.

2026 నాటికి ఏటా 300 దుమ్ము తుపానులను ఇరాక్ ఎదుర్కోవాల్సి రావొచ్చునని 2016లో ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్ఈపీ) అంచనా వేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)