చైనా: షియాన్ నగరంలో కఠిన లాక్‌డౌన్.. ఆహారం అందక ప్రజల ఆకలి కేకలు

కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుండటంతో చైనాలోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే లాక్‌డౌన్ విధించారు. వైరస్‌తో బాధపడుతున్న వారిని క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. అయితే, లాక్‌డౌన్ నిబంధనలు దారుణంగా ఉన్నాయని, తిండి కూడా తినే పరిస్థితి లేదని షియాన్‌ నగరంలో ప్రజలు ఆరోపిస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర లాక్‌డౌన్‌లతో పోలిస్తే, ఇక్కడి స్థానికులు తక్కువ సదుపాయాలు పొందుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యావసరాల కోసం కూడా ప్రజలను బయటకు రానివ్వడం లేదు.

ప్రభుత్వం సరుకులు సరఫరా చేస్తున్నప్పటికీ వాటిని తెచ్చుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నామని సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు.

షియాన్ నగరంలో గత తొమ్మిది రోజులుగా లాక్‌డౌన్ అమలులో ఉంది. మొదట్లో ఆంక్షలు తక్కువగా ఉండేవని, ఆహారం, ఇతర అవసరాల కోసం రెండు రోజులకొకసారి ఇంటికొక వ్యక్తిని బయటకు వెళ్లనిచ్చేవారని వారు తెలిపారు.

కానీ, గత సోమవారం నుంచి నిబంధనలను కఠినం చేశారు. కోవిడ్-19 టెస్టులకు తప్ప మరే కారణంతోనూ ప్రజలు బయటకు రావడానికి వీలులేదు.

దీంతో తమకు ఆహారం, ఇతర సరుకులు కావాలంటూ ప్రజలు సోషల్ మీడియా ప్లాట్‌పామ్ వీబోలో సాయం అడుగుతున్నారు. ప్రభుత్వం పంపిన సరుకులు అందడం లేదని వారు ఆరోపిస్తున్నారు.

''ఇతర ప్రాంతాలలో సరుకులు అందుతున్నాయని విన్నాను. కానీ, ఇక్కడ మా పరిస్థితి దారుణంగా ఉంది. మా కాంపౌండ్‌లో ఎవరినీ బయటకు రానివ్వడం లేదు. నేను నాలుగు రోజుల క్రితం ఆన్‌లైన్‌లో కిరాణ సామాగ్రిని ఆర్డర్ చేసాను. కానీ, అవి అందేలా లేవు. కొద్దిరోజులుగా మా ఇంట్లో కూరగాయలు కూడా లేవు'' అని శుక్రవారంనాడు ఓ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

''ప్రభుత్వం అందిస్తున్న సాయంలో వివక్ష కనిపిస్తోంది. మా ప్రాంతానికి ఏమీ రాలేదు. మీరందరూ గ్రూప్‌గా సరుకులు ఆర్డర్ చేసుకొమ్మని చెప్పారు. కానీ ధరలు ఎక్కువగా ఉన్నాయి'' అని ఓ యూజర్ రాశారు.

ఈ వారంలో రికార్డు చేసిన ఓ వీడియో చైనాలో వైరల్ అవుతోంది. ఓ ప్రాంతంలో ప్రజలు ఆహారం లేదంటూ పోలీసులతో గొడవపడటం ఇందులో కనిపిస్తుంది.

ఓ వ్యక్తి తన ఇంట్లో సరుకులు అయిపోయాయని అధికారులకు చెబుతుండటం, ఓ మహిళ తాము 13 రోజులుగా లాక్‌డౌన్‌లో ఉన్నామని, కూరగాయల కోసం నాలుగు గంటలుగా క్యూలో నిలబడాల్సి వచ్చిందని చెబుతుండటం ఈ వీడియోలో కనిపిస్తుంది.

ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే గ్లోబల్ టైమ్స్ పత్రిక, కొన్ని ప్రదేశాలలో కాంపౌంట్ గేట్ల వరకు సరుకులు చేర వేస్తున్నామని పేర్కొంది. ఇళ్ల దాకా చేర్చేందుకు తగినంతమంది సిబ్బంది లేరని, డ్రైవర్లలో చాలామంది సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండంటంతో సరుకులు డెలివరీ కష్టంగా ఉందని వెల్లడించింది.

తక్కువ సిబ్బంది కారణంగా సరుకుల పంపిణీలో ఇబ్బందులు నిజమేనని బుధవారం నాడు అధికారులు అంగీకరించారు.

అయితే గురువారం నాటికి, షియాన్‌లో నివాసితులకు అవసరమైన సామాగ్రికి అందుతోందని ఆ దేశ వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు చెప్పినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ వెల్లడించింది.

అధికారులు, సిబ్బంది ప్రజలకు ఆహార పదార్ధాలు, అవసరమైన సరుకులు అందిస్తున్న దృశ్యాలు ప్రభుత్వ టెలివిజన్‌లు వార్తలు ప్రసారం చేశాయి.

''మాకు ప్రభుత్వం అందిస్తున్న సాయం చేరింది. ఇది మూడు నాలుగు రోజులు తినడానికి సరిపోతుంది'' అని ఓ వ్యక్తి వీబోలో రాశారు.

చైనా గత కొద్దిరోజులుగా షియాన్ నగరంలో జీరో-కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తుండటంతో బస్ స్టేషన్, రైల్వే స్టేషన్‌లు మూతపడ్డాయి. విమానాలను నిలిపేశారు. లక్షల సంఖ్యలో కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు.

షియాన్‌లో డిసెంబర్ 9 నుండి 1300 పైగా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. 2022 ఫిబ్రవరిలో చైనా వింటర్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే, తాజా పరిణామాలతో ఈ క్రీడావేడుకల నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

వింటర్ ఒలింపిక్ ఈవెంట్‌కు కోవిడ్ "అతిపెద్ద ముప్పు" అని చైనా ఇంతకు ముందే పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)