స్నేహ దుబే: పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ఖాన్ ఐక్యరాజ్య సమితిలో లేవనెత్తిన ప్రశ్నలకు గట్టిగా జవాబిచ్చిన భారతీయ అధికారిణి

ఫొటో సోర్స్, ANI
ఐక్యరాజ్యసమితి (ఐరాస) 76వ జనరల్ అసెంబ్లీ సమావేశంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్ భారత్పై మాటల దాడి చేశారు.
అయితే, ఇమ్రాన్ ఖాన్ ప్రసంగం ముగిసిన వెంటనే భారత్ ఆయనకు గట్టిగా సమాధానం చెప్పింది. భారత ఫస్ట్ సెక్రటరీ, ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారిణి అయిన స్నేహ దుబే ఐరాస వేదికగా సమాధానం ఇచ్చారు.
సమాధానం చెప్పే హక్కు (రైట్ టు రిప్లై)ను ఉపయోగించుకుని, పాకిస్తాన్ ప్రధానమంత్రి లేవనెత్తిన ప్రతి ప్రశ్నకు భారత్ తరఫున స్నేహ దుబే బదులిచ్చారు.
నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం కశ్మీర్లో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ముస్లింలను భయాందోళనలకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఇస్లామోఫోబియా అనే పదాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఐక్యరాజ్యసమితికి ఇమ్రాన్ ఖాన్ విజ్ఞప్తి చేశారు.
"జమ్ము కశ్మీర్పై ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానాలను భారత్ ఉల్లంఘిస్తోంది. యూఎన్ పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా మాత్రమే వివాదాస్పద ప్రాంతంపై ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని భద్రతామండలి స్పష్టంగా చెప్పింది. కశ్మీర్లో మానవ హక్కులను కూడా భారత్ కాలరాస్తోంది. దాన్ని చూసి చూడనట్లు ప్రపంచం వ్యవహరించడం బాధాకరం" అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ వ్యాఖ్యలపై భారత ఫస్ట్ సెక్రటరీ స్నేహ దుబే అదే యూఎన్ జనరల్ అసెంబ్లీలో గట్టిగా సమాధానం చెప్పారు.
భారత అంతర్గత వ్యవహారాలను ప్రపంచ వేదికల మీదికి తీసుకురావడానికి, అబద్ధాలతో ఇండియా ఇమేజ్ను దెబ్బతీయడానికి ఇమ్రాన్ఖాన్ ప్రయత్నిస్తున్నారని స్నేహ దుబే అన్నారు.
"పాకిస్తాన్లో టెర్రరిస్టులు స్వేచ్ఛగా తిరుగుతారు. కానీ అక్కడి సాధారణ ప్రజల ముఖ్యంగా మైనారిటీల జీవితాలు తలకిందులయ్యాయి. టెర్రరిస్టులను పెంచి పోషించడం పాకిస్తాన్కు అలవాటేనన్న విషయం దాని చరిత్రను, విధానాలను చూస్తే తెలుస్తుంది. సీమాంతర ఉగ్రవాదంతో పొరుగు దేశాలను పాక్ వేధిస్తోంది" అని స్నేహ దుబే చెప్పారు.

ఫొటో సోర్స్, @IndiaUNNewYork on Twitter
స్నేహ దుబే చెప్పిన ఐదు సమాధానాలపై చర్చ
1.టెర్రరిస్టులకు పాకిస్తాన్ బహిరంగంగా మద్దతు ప్రకటించడం, ఆయుధాలు ఇవ్వడాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాయి. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి నిషేధం విధించిన టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పించిన చరిత్ర కూడా పాకిస్తాన్కు ఉంది. ఒసామా బిన్ లాదెన్కు పాకిస్తాన్ ఆశ్రయం కల్పించింది. ఇవాళ్టికి కూడా ఒసామాను అమరవీరుడిగానే పాకిస్తాన్ చూస్తోంది. ఇప్పటికీ ఆ విధానాలను పాకిస్తాన్ సమర్థించుకుంటూనే ఉంది. నేటి ఆధునిక ప్రపంచంలో అలాంటి ధోరణి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు.
2.తమది ఉగ్రవాద బాధిత దేశమని పాకిస్తాన్ తరచూ చెప్పుకుంటోంది. ఉగ్రవాదంపై పోరాడుతున్నామని అంటోంది. ఇరుగుపొరుగు దేశాలకు మాత్రమే హాని తలపెడతారన్న ఆశతో పాకిస్తాన్ తన ఇంటి వెనకే టెర్రరిస్టులను పెంచి పోషిస్తోంది. కానీ పాకిస్తాన్ విధానాల వల్ల ఈ ప్రాంతం, ప్రపంచం మొత్తం నష్టపోతోంది.
3.జమ్ము కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలు భారత్లో అంతర్భాగం. అవెప్పుడూ భారత్వే. అక్రమంగా ఆక్రమించుకున్న భూభాగం నుంచి వెళ్లిపోవాలని పాకిస్తాన్ను కోరుతున్నాం.
4.పాకిస్తాన్లోని మైనార్టీలు అంటే సిక్కులు, హిందువులు, క్రిస్టియన్లు భయం గుప్పిట్లో బతకుతున్నారు. వాళ్ల హక్కులను ప్రభుత్వమే కాలరాస్తోంది. భారత్లో అన్ని వర్గాలకు సముచిత స్థానం ఉంది. దేశ అత్యున్నత పదవులను చేపట్టిన మైనార్టీలు కూడా ఉన్నారు. కానీ బహుళత్వాన్ని అర్థం చేసుకోవడం పాకిస్తాన్కు చాలా కష్టం. పాకిస్తాన్ రాజ్యాంగం మైనార్టీలు అత్యున్నత పదవులు చేపట్టకుండా అడ్డుకుంటోంది. ఈ విషయంలో పాకిస్తాన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
5.పాకిస్తాన్ సహా ఇరుగుపొరుగు దేశాలన్నింటితో సత్సంబంధాలు కొనసాగించాలని భారత్ కోరుకుంటోంది. అయితే, దానికి అనుకూలమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత పాకిస్తానిదే. సీమాంతర ఉగ్రవాదానికి తమ భూభాగాన్ని వాడకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. తీవ్రవాదులకు ఎలాంటి సాయం చేయడం లేదని పాకిస్తాన్ తనన తాను నిరూపించుకోవాలి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
పాకిస్తాన్ ఏం చెప్పింది?
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్ శనివారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడారు. భారత్పై తీవ్ర ఆరోపణలు చేశారు.
కశ్మీర్ విషయంలో 2019 ఆగస్టు 5 నుంచి భారత్, చట్ట వ్యతిరేక, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుందని ఆయన ఆరోపించారు.
భారత్, కశ్మీర్లో 9 లక్షల మంది సైనికులను మోహరించిందని, కశ్మీర్ నాయకులను జైల్లో పెట్టిందని విమర్శించారు. కశ్మీర్లో మీడియా, ఇంటర్నెట్పై కూడా నిషేధం ఉందని చెప్పారు.
కశ్మీర్లో శాంతియుత నిరసన ప్రదర్శనలను కూడా బలవంతంగా అడ్డుకుంటున్నారని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. 13వేల మంది కశ్మీరీ యువకులను భారత ప్రభుత్వం కిడ్నాప్ చేసి, వేధించిందని ఆయన ఆరోపించారు.
ఇవి కూడా చదవండి
- గాయని చిత్ర: ‘నాకు తెలుగు నేర్పించింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. ఆయన పాటల్లో నాకు బాగా నచ్చిన పాట..’
- అఫ్గానిస్తాన్: తాలిబాన్ పాలనలో బిడ్డకు జన్మనివ్వడం అంటే ఎలా ఉంటుంది..
- స్మార్ట్ గ్లాసెస్: స్మార్ట్ ఫోన్ పనులన్నీ కళ్ల జోళ్లే చేస్తే ఏమవుతుంది?
- విశాఖపట్నం: 'కచ్చలూరు బోటు ప్రమాదంలో చనిపోయిన నా పిల్లలే మళ్లీ నాకు కవలలుగా పుట్టారు'
- వర్జినిటీ: కన్యత్వం అనే భావనకు కాలం చెల్లిందా?
- అఫ్గానిస్తాన్: 'మరణ దండన, కాళ్లూ చేతులు నరికే శిక్షలు మళ్లీ అమలు చేస్తాం' - తాలిబాన్లు
- క్యాన్సర్ రావడానికి ప్లాస్టిక్ బాటిల్స్లో నీరు తాగడం కూడా ఒక కారణమా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)












