టోక్యో ఒలింపిక్స్: చరిత్ర సృష్టించిన భారత మహిళల హాకీ జట్టు, ఆస్ట్రేలియాపై విజయంతో సెమీ ఫైనల్స్‌లో చోటు

టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల ఫీల్డ్ హాకీ క్వార్టర్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాపై భారత జట్టు విజయం సాధించింది.

గుర్‌జీత్ కౌర్ సంపాదించిన గోల్ పాయింట్‌తో ప్రపంచ ర్యాంకింగ్‌లలో నంబరు 2గా ఉన్న ఆస్ట్రేలియా జట్టు ఒత్తిడికి గురైంది.

భారత్ ఈ లీడ్ పాయింట్‌ను మ్యాచ్ మొత్తం కొనసాగించింది.

ఆస్ట్రేలియా ఒక్క గోల్ కూడా కొట్టలేదు.

గుర్‌జీత్ కొట్టిన గోల్ భారత్‌కు విజయాన్ని తెచ్చిపెట్టింది.

భారత మహిళల హాకీ జట్టు సెమీస్‌లో అడుగుపెట్టడం ఇదే తొలిసారి.

49ఏళ్ల తర్వాత తొలిసారి పురుషుల హాకీ జట్టు కూడా సెమీ ఫైనల్స్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.

ఇది చరిత్రలో నిలిచిపోయే గోల్

'ఇది చరిత్ర పుస్తకాల్లో నిలిచిపోయే గోల్' అని ''టోక్యో 2020 ఫర్ ఇండియా'' ట్విటర్ హ్యాండిల్ ట్వీట్‌చేసింది.

''అద్భుతమైన డ్రాగ్ ఫ్లిక్‌తో గుర్‌జీత్ కొట్టిన ఈ గోల్ చూడండి. చరిత్రాత్మక క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఇదే ఆస్ట్రేలియాపై భారత్‌కు గెలుపును తెచ్చిపెట్టింది''అని పేర్కొంది.

మరోవైపు ఇది అద్భుత విజయమని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యానించింది.

''భారత మహిళల జట్టు తమ సంపూర్ణ శక్తి సామర్థ్యాలను పెట్టి ఆసిస్‌పై చరిత్రాత్మక విజయాన్ని నమోదుచేసింది''అని పేర్కొంది.

''పెద్ద కలలు కనండి.. చరిత్రను తిరగరాయండి''అని హాకీ ఇండియా ట్వీట్ చేసింది.

''మరోవైపు భారత మహిళల హాకీ జట్టుకు అభినందనలు. మీరు భారత్‌ తలెత్తుకునేలా చేశారు. తర్వాతి మ్యాచ్‌కు మీకు బెస్ట్ విషెస్''అని కేంద్ర మాజీ క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ ట్వీట్‌చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)