కోవిడ్: హోటల్ క్వారంటైన్‌లో ఉన్న మహిళలపై వేధింపులు

కరోనా వైరస్​ కారణంగా హోటల్లో క్వారంటైన్ అయిన తమను జీ4ఎస్​ కంపెనీకి చెందిన సెక్యూరిటీ గార్డులు లైంగికంగా వేధించారని నలుగురు యువతులు ‘బీబీసీ’కి చెప్పారు.తాము లిఫ్ట్​లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ గార్డు తనతో శృంగారంలో పాల్గొనాలని అడిగారని.. మరో గార్డు కౌగిలించుకుని సెల్ఫీ దిగుదామ‌ని అడిగారని వెల్ల‌డించారు.హోట‌ల్స్‌లో క్వారంటైన్‌లో ఉంటున్న వారిని నిబంధ‌న‌లు పాటించేలా చూడ‌టానికి ప్ర‌భుత్వం ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల‌ కంపెనీల‌తో ఒప్పందం చేసుకుంది.

ఈ ఆరోపణలపై స్పందించిన జీ4ఎస్ సంస్థ ‘‘మేం మా ఉద్యోగులు నుంచి అత్యుత్త‌మ క్ర‌మ‌శిక్ష‌ణ నియ‌మావ‌ళిని ఆశించాం. వారిపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ జ‌రిపాం’ అని చెప్పింది.కరోనా వ్యాప్తి రేటు ఎక్కువగా ఉన్న దేశాలను యూకే రెడ్ లిస్టులో పెట్టింది. వీటి నుంచి యూకేకి వచ్చే ప్ర‌యాణికుల‌ను 10 రోజుల కఠిన క్వారంటైన్‌లో ఉంచుతోంది.

కేవలం వ్యాయామం కోసం మాత్రమే గది నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతిస్తోంది. అలా వెళ్లేటప్పుడు వారితో పాటు గార్డులు ఉంటారు.క్వారంటైన్​లో ఉన్న ఎవరైనా ఆన్​లైన్ ఆర్డర్లు పెడితే, వాటిని కూడా గార్డులే తెచ్చి అందిస్తున్నారు. భద్రత కోసం ఉంటున్న వారిలో మహిళా గార్డులు తక్కువగా ఉన్నారని క్వారంటైన్‌లో ఉన్న ఏడుగురు మహిళలు తెలిపారు.

కోవిడ్​ కారణంగా దుబయి​లో పని చేసిన నర్సు మారీ సిడ్వెల్(28) ఇటీవల యూకే తిరిగొచ్చారు. పది రోజల క్వారంటైన్​లో భాగంగా నాటింగ్​హోమ్​లోని పెంటాహోటల్​లో బస చేశారు. మారీ ఆర్డర్ చేసిన వాటిని ఇద్దరు గార్డులు రెండు సార్లు తీసుకుని వచ్చారు.

తొలుత వచ్చిన గార్డు క్వారంటైన్ నియమాలను పాటించారని మారి చెప్పారు. రెండో సారి వచ్చిన గార్డు మాత్రం నిబంధనలను ఉల్లంఘిస్తూ 'మీకు క్రికెట్​ ఆడటం వచ్చా? సెల్ఫీ దిగుదామా?' అని అడిగారని ఆమె చెప్పారు.

అందుకు తాను నిరాకరించగా ఆ గార్డ్ 'నాకు నెగిటివ్. పర్లేదు' అని ఒత్తిడి చేసినట్లు మారీ వివరించారు.ఆ తర్వాత తాను వెనకడుగు వేయగా.. 'నాకు ఓ హగ్ ఇస్తావా?' అని గార్డు అడిగినట్లు మారీ తెలిపారు. ఆ తర్వాత రూమ్ లోపలికి అతను రాబోతుండగా.. భయం వేసి వెంటనే తలుపు మూసేసినట్లు వెల్లడించారు.ఈ విషయమై తాను రిసెప్షన్​కి ఫోన్​ చేసి, ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. మళ్లీ ఇలాంటి సంఘటన జరగదని వారు హామీ ఇచ్చారని మారీ వివరించారు.

అయితే, గార్డుల వద్ద ఉన్న కార్డులతో వారు ఏ రూమ్​లోకైనా వెళ్లడానికి యాక్సెస్ ఉంటుందని తెలిసిన తరువాత రాత్రుళ్లు చాలా భయమేసిందన్నారు మారీ.

‘ఎక్సర్‌సైజ్ నుంచి వస్తుంటే కోరిక తీర్చమన్నాడు’

జింబాబ్వే నుంచి స్వదేశానికి వచ్చిన కేథరిన్​ గొడొల్ఫిన్​(46)కి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.

పది రోజుల క్వారంటైన్​ కోసం ఆమె హిత్రో బాత్​ రోడ్​ హాలిడే ఇన్​ అనే హోటల్​లో బస చేశారు. ఎక్సర్​సైజుల కోసం లిఫ్ట్​లో వెళ్తున్న ఆమెతో ఓ గార్డు కూడా వచ్చాడని కేథరిన్​ చెప్పారు. అతను తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపారు.

మరుసటి రోజు ఎక్సర్​సైజులు పూర్తి చేసుకుని లిఫ్ట్​లో వస్తుండగా, అదే గార్డు తన కోరిక తీర్చాలని కోరాడని చెప్పారు. ఈ విషయమై జీ4ఎస్​ కంపెనీకి ఫిర్యాదు చేసినా, వారు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పలేదని వివరించారు.దీనిపై జీ4ఎస్​ను బీబీసీ సంప్రదించినా, వారు ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

అమీ, జానెట్​ వీలర్ అనే మహిళలకు కూడా జీ4ఎస్​ సిబ్బంది నుంచి ఇలాంటి సంఘటనలే ఎదురయ్యాయి.

అమీ, పార్క్ గ్రాండ్​ హోటల్​ బస చేశారు. 'మీరు అందంగా ఉన్నారు. మనం డేట్​కు వెళదామా? అని ఓ గార్డు నన్ను అడిగాడు' అని అమీ చెప్పారు. వేరే గార్డు కాపలాగా తన రూమ్ వద్ద ఉన్నా, సదరు వ్యక్తి కూడా వచ్చి అక్కడే నిలబడ్డాడని తెలిపారు.మిల్టన్ కీన్స్​​లోని మారియట్​ హోటల్​లో బస చేసిన జానెట్ వీలర్​కి తన రూమ్​ మారాల్సిన అవసరం కలిగింది. అలా మారే సమయంలో ఆమె 20 నిమిషాల పాటు ఓ గార్డుతో పాటు కారిడార్‌లో వెయిట్ చేశారు.

'మీకు పెళ్లయిందా? మీరు ఒంటరిగా ప్రయాణిస్తున్నారా? మీకు నల్లజాతీయులంటే ఇష్టమేనా?' అని గార్డు ప్రశ్నించినట్లు ఆమె తెలిపారు. ఆ సమయంలో తనకు చాలా భయమేసిందన్నారు.

సెక్యూరిటీ గార్డులతో తమకు ఎలాంటి సంబంధం లేదని హోటల్ యాజమాన్యాలు బీబీసీకి తెలిపాయి.

వాళ్లను హెల్త్ అండ్ సోషల్ కేర్ వారు కాంట్రాక్టుకి తీసుకున్నారని వివరించాయి.

పార్క్ గ్రాండ్, మారియటల్, రాడిసన్ హోటల్స్​ ఆరోపణలను తీవ్రంగా పరిగణించాయి. ఈ సంఘటనలపై విచారణ చేయాలని జీ4ఎస్​ను కోరినట్లు వివరించాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)