ఇజ్రాయెల్-గాజా: ఐరన్ డోమ్ అంటే ఏమిటి.. ఇది ఉంటే శత్రు దాడుల నుంచి ప్రజల ప్రాణాలను 100 శాతం కాపాడొచ్చా

ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య తాజాగా చోటుచేసుకున్న ఘర్షణ సందర్భంగా హమాస్ తీవ్రవాదులు వేలాది రాకెట్లు తమ దేశంపైకి ప్రయోగించారని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపిస్తోంది.
ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ కూడా ఎదురు దాడులకు దిగుతోంది. పెద్ద ఎత్తున బాంబు దాడులతో హమాస్, పాలస్తీనా వర్గాలకు తీవ్ర నష్టం కలిగిస్తోంది.
పాలస్తీనా, ఇజ్రాయెల్ల మధ్య ఘర్షణ జరిగినప్పుడల్లా ఐరన్ డోమ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారుతుంది. తమ దేశంపై రాకెట్ దాడులు జరక్కుండా ఇజ్రాయెల్ ఏర్పాటు చేసుకున్న రక్షణ వ్యవస్థే ఐరన్ డోమ్.
మరి ఈ ఐరన్ డోమ్కు బీజం ఎప్పుడు పడింది, ఇది ఎలా పని చేస్తుంది?

ఐరన్ డోమ్ ఎలా పనిచేస్తుంది?
ఐరన్ డోమ్ అనేది ఇజ్రాయెల్ వందల కోట్ల డాలర్లు వెచ్చించి ఏర్పాటు చేసుకున్న క్షిపణి నిరోధక వ్యవస్థలలో ఒకటి.
ఈ ఐరన్ డోమ్ వ్యవస్థకు ఉండే రాడార్లు తమ గగనతలంలోకి దూసుకొస్తున్న రాకెట్లను గుర్తించి వెంటనే వాటిని ధ్వంసం చేసేందుకు రెండు క్షిపణులను ప్రయోగిస్తుంది.
ఈ ఐరన్ డోమ్ వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకుంటున్న రాకెట్లను, గురి తప్పిన రాకెట్ల మధ్య తేడాను పసిగడుతుంది. దాని ప్రకారం జనావాసాలు, ఇతర లక్ష్యాల వైపు వస్తున్న రాకెట్లనే ఇది నాశనం చేస్తుంది.
దీనివల్ల గతి తప్పిన రాకెట్ల కోసం అనవసరంగా క్షిపణులను వృథా చేయకుండా దీని రాడార్ వ్యవస్థ పనిచేస్తుంది.
ఇందులో ప్రతి నిరోధకం ఖరీదు 1,50,000 డాలర్లు(సుమారు రూ. 1.1 కోట్లు) ఉంటుందని 'టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్' వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
దీన్ని ఎలా అభివృద్ధి చేశారు?
దక్షిణ లెబనాన్ కేంద్రంగా పనిచేసిన హిజ్బుల్లా మిలటెంట్ గ్రూపుతో ఇజ్రాయెల్ యుద్ధం చేసిన 2006 ప్రాంతంలో ఈ ఐరన్ డోమ్ల తయారీకి బీజం పడింది.
హిజ్బుల్లా గ్రూప్ వేలాది రాకెట్లను ప్రయోగించడంతో ఇజ్రాయెలీలు పెద్దసంఖ్యలో మరణించడంతో పాటు భవనాలు వంటి భారీగా ధ్వంసమయ్యాయి.
దీంతో అక్కడికి ఏడాది తరువాత ఇజ్రాయెల్ రక్షణ సంస్థ 'రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్' ఒక కొత్త క్షిపణి నిరోధక వ్యవస్థను రూపొందించనుందని ఆ దేశం ప్రకటించింది.
ఈ ప్రాజెక్టుకు అమెరికా 20 కోట్ల డాలర్ల ( సుమారు రూ. 14,650 కోట్లు) నిధులు సమకూర్చింది.
కొన్నేళ్ల పాటు అధ్యయనం, అభివృద్ధి చేసిన తరువాత 2011లో దాన్ని యుద్ధంలో పరీక్షించారు. ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలోని బీర్షెబా పట్టణం లక్ష్యంగా శత్రువులు ప్రయోగించిన మిసైల్ను ఇది విజయవంతంగా అడ్డుకుంది.

ఫొటో సోర్స్, JACK GUEZ / GETTY IMAGES
లోపాలున్నాయా?
గాజా నుంచి ప్రయోగించిన రాకెట్ల వల్ల ఇజ్రాయెల్లో ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు మరణించినట్లు అక్కడి వైద్యులు చెప్పారు.
అదేసమయంలో ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో 17 మంది చిన్నారులు సహా 83 మంది చనిపోయారని పాలస్తీనా ఆరోగ్య విభాగం అధికారులు తెలిపారు.
దీని ప్రకారం చూసుకుంటే ఐరన్ డోమ్ వ్యవస్థ వల్ల ఇజ్రాయెలీలకు రక్షణ లభించిందనే చెప్పాలి.
అయినప్పటికీ ఇది క్షిపణి దాడుల నుంచి 100 శాతం రక్షణ ఇవ్వదు.

ఫొటో సోర్స్, Getty Images
గాజా నుంచి వస్తున్న రాకెట్లను 90 శాతం విజయవంతంగా అడ్డుకుంటున్న ఈ ఐరన్ డోమ్ వేరే శత్రువు నుంచి ఇలాంటి దాడులు జరిగితే ఇదే స్థాయిలో రక్షణనిస్తుందని చెప్పలేమని విమర్శకులు అంటున్నారు.
అదే హిజ్బుల్లా మిలిటెంట్లయితే హమాస్ కంటే తక్కువ సమయంలో ఎక్కువ రాకెట్లను ప్రయోగిస్తారని.. అలాంటి సందర్భంలో ఐరన్ డోమ్ సక్సెస్ రేటు ఇంతగా ఉండకపోవచ్చని 'ది జెరూసలెం పోస్ట్' ఇంటెలిజెన్స్ ఎడిటర్ యోనా జెరెమీ బాబ్ అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్ ఎలా ఏర్పడింది, పాలస్తీనా రెండు భూభాగాలుగా ఎందుకుంది... వందేళ్ల ఈ సంక్షోభానికి ముగింపు లేదా?
- ఇజ్రాయెల్-గాజా ఘర్షణలు: గూగుల్ మ్యాప్లో గాజా మసగ్గా ఎందుకు కనిపిస్తోంది? - BBC RealityCheck
- ఇజ్రాయెల్: లక్షలాది యూదులను చంపిన నాజీ అధికారి ఐష్మన్ను ఎలా పట్టుకుంది?
- వెస్ట్ బ్యాంక్ చరిత్రేమిటి.. ఇజ్రాయెల్ దాన్ని ఎందుకు ఆక్రమించాలనుకుంటోంది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








