ఇజ్రాయెల్ - లాగ్ బోమర్: మతపరమైన వేడుకలో తొక్కిసలాట.. 44 మందికి పైగా మృతి

ఇజ్రాయెల్‌లో జరిగిన ఒక మతపరమైన వేడుకలో తొక్కిసలాట జరిగి 44 మందికిపైగా మరణించారు.

ప్రభుత్వం ఇంకా మృతుల సంఖ్యపై అధికారికంగా వెల్లడించనప్పటికీ స్థానిక మీడియాలో మాత్రం 44 మందికి పైగా చనిపోయారని వార్తలు వచ్చాయి.

పదుల సంఖ్యలో భక్తులు చనిపోయారని, చాలా మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ నేషనల్ ఎమర్జెన్సీ సర్వీస్ మాగెన్ డేవిడ్ ఆడమ్(ఎండీఏ) చెప్పింది. కానీ మృతులు ఎంతమందో చెప్పలేదు.

స్థానిక వార్తా పత్రిక హారెట్జ్ ఈ ఘటనలో 44 మందికి పైగా చనిపోయారని, గాయపడ్డవారిని అత్యవసర సేవల సిబ్బంది ఆస్పత్రులకు తరలిస్తున్నారని చెప్పింది.

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దీనిని 'ఘోర విపత్తు'గా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు.

ఈశాన్య ఇజ్రాయెల్‌లోని మౌంట్ మెరాన్ పర్వతం కింద ఈ లాగ్ బోమర్ వేడుక జరిగింది. కరోనా మహమ్మారి మొదలైన తర్వాత దేశంలో ఇప్పటివరకూ జరిగిన అతిపెద్ద కార్యక్రమం ఇదే.

కరోనా వ్యాపిస్తుందనే భయాలు ఉన్నప్పటికీ, జనం ఈ వేడుకలకు వేల సంఖ్యలో హాజరయ్యారు.

ఘటనా స్థలంలో పదుల సంఖ్యలో అంబులెన్సులు ఉన్నాయి. నేలపై పడి ఉన్న మృతదేహాలపై కవర్స్ కప్పి ఉండడం కనిపిస్తోంది. అందరూ ఆ ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేయాలని పోలీసులు ఆదేశించారు.

ఘటనా స్థలంలో విషమ పరిస్థితుల్లో ఉన్న 38 మందిని చూశామని అత్యవసర సేవల సిబ్బంది చెప్పారు.

తీవ్రంగా గాయపడిన మరో ఆరుగురిని కూడా ఆస్పత్రులకు తరలించామని, చాలా మందికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు.

"తీవ్రంగా గాయపడిన వారి ప్రాణాలు కాపాడ్డానికి ఎండీయే ప్రయత్నిస్తోంది. చివరి బాధితుడిని తరలించే వరకూ మేం పనిచేస్తాం" అని ఎండీఏ ట్వీట్ చేసింది.

అసలు ఏం జరిగింది

ఈశాన్య ఇజ్రాయెల్‌లోని మౌంట్ మెరాన్ పర్వతం కింద ఏటా సంప్రదాయ యూదుల ‘లాగ్ బోమర్’ వేడుక జరుగుతుంది. దీనికోసం భక్తులు భారీగా తరలివస్తారు.

ఈ మతపరమైన వేడుకలో భక్తులు మంటలు వెలిగించి ప్రార్థనలు జరుపుతారు. తర్వాత ఆడిపాడుతారు.

గత ఏడాది కరోనా వల్ల ఈ వేడుకను రద్దు చేశారు. ఈ ఏడాది ఇజ్రాయెల్‌లో వ్యాక్సినేషన్ పూర్తి కావడంతో దీనిని నిర్వహించారు.

గురువారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో లక్ష మంది పాల్గొన్నారని, శుక్రవారం ఇంకా చాలా మంది ఇక్కడకు చేరుకోనున్నారని 'టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్' చెప్పింది.

తొక్కిసలాట జరగడంతో కొంత మంది మెట్లపై పడిపోయారని, దాంతో వారికి కింద మెట్లపై ఉన్న వాళ్లు కూడా వరుసగా పడిపోతూ వచ్చారని పోలీసులు చెప్పినట్లు స్థానిక వార్తా పత్రిక పేర్కొంది.

ఇంటర్‌నెట్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో ఈ కార్యక్రమంలో వేల మంది గుమిగూడి ఉండడం, తర్వాత అక్కడ కలకలం రేగడం కనిపిస్తోంది.

"వెయ్యి మందికి పైగా భక్తులు, చాలా ఇరుగ్గా ఉండే దారిలో శిఖరం పైకి వెళ్లడానికి ప్రయత్నించారు. వాళ్లలో కొందరు పడిపోవడంతో, మిగతావాళ్లు కూడా ఒక్కొక్కరుగా పడిపోయారు" అని ఒక సంప్రదాయ యూదు వెబ్‌సైట్ ప్రతినిధి బీబీసీకి చెప్పారు.

కరోనా వైరస్ వల్ల ఈ వేడుకలో ఆంక్షలు కూడా విధించామని, కానీ జనం భారీగా రావడంతో వాటిని అమలు చేయడం సాధ్యం కాలేదని అంతకుముందు అధికారులు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)