ఎడారిలో అంతుచిక్కని లోహస్తంభం... అకస్మాత్తుగా ప్రత్యక్షం.. అదే తీరులో అదృశ్యం.. ఏలియన్స్ పనా?

అమెరికాలోని ఉటా ఎడారిలో కొద్ది రోజుల కిందట ఒక లోహ స్తంభం ప్రత్యక్షమైంది. అనుకోకుండా కనిపించిన ఈ లోహ స్తంభం ఇక్కడికి ఎప్పుడు ఎలా వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు. అయితే.. ఈ మోనోలిత్ అంతే అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. ఇదంతా తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది.

ఈశాన్య ఉటాలో మారుమూల ప్రాంతంలో కొండ గొర్రెలను లెక్కించుతున్న వన్యప్రాణి విభాగం అధికారులు ఈ అసాధారణ లోహ శిలను గుర్తించారు.

లోహంతో చేసిన ఈ శిల రెండు ఎర్ర రాతి గుట్టల మధ్య ఇసుకలో నాటి ఉంది. దాదాపు 10 - 12 అడుగుల పొడవున్న ఈ ఏకశిలను అక్కడ ఎవరు, ఎప్పుడు నాటారనేది అంతుచిక్కలేదు.

"నేను ఎన్నో ఏళ్లుగా ఆ ప్రాంతం పైనుంచే ప్రయాణిస్తున్నా, ఇప్పటివకూ అలాంటి వింత వస్తువును చూడలేదు. పెద్ద కొమ్ముల గొర్రెలను హెలికాప్టర్లో నుంచి లెక్కెస్తున్న జీవశాస్త్రవేత్తలు ఆకాశంలో నుంచే దానిని మొదట చూశారు" అని హెలికాప్టర్ పైలెట్ బ్రెట్ హచింగ్స్ కేఎస్ఎల్ టీవీకి చెప్పారు.

"వాళ్లు నాతో హెలికాప్టర్ వెనక్కు తిప్పమన్నారు. నేను ఎందుకు అని అడిగా. అక్కడ మాకు ఒకటి కనిపించింది, దాన్ని చూడాలి అన్నార"ని ఆయన చెప్పారు..

లోహంతో చేసిన ఆ ఏకశిలను ఎవరైనా కొత్త తరం కళాకారుడు లేదంటే 1968లో స్టాన్లీ కుబ్రిక్ డైరెక్ట్ చేసిన '2001: ఎ స్పేస్ ఒడిస్సీ' సినిమా అభిమాని అక్కడ నాటి ఉండచ్చని హచింగ్స్ భావిస్తున్నారు.

ఆ సినిమాలో.. అదృశ్య గ్రహాంతర వాసులు సృష్టించిన ఒక నల్లటి ఏక శిల కనిపిస్తూ ఉంటుంది. దీనిని ఆర్థర్ సి.క్లార్క్ నవల ఆధారంగా తీశారు.

ఎవరు ఏర్పాటుచేశారు?

దీనిపై ఒక ప్రకటన విడుదల చేసిన ఉటా అధికారులు ఆ శిలకు సంబంధించిన ఫొటోలను కూడా విడుదల చేశారు. దీనిపై మరింత లోతుగా విచారణ చేయాలని నిర్ణయించారు.

"ఎవరైనా, ఎక్కడివారైనా.. ప్రభుత్వ అధీనంలో ఉన్న బహిరంగ భూముల్లో ఇలాంటివి లేదా కళాఖండాలును ఏర్పాటుచేయడం చట్టవిరుద్ధం" అని వారు ఆ ప్రకటనలో చెప్పారు.

కానీ, ఈ లోహపు ఏకశిల సరిగ్గా ఏ ప్రాంతంలో ఉందనేది అధికారులు బయటపెట్టలేదు. అది బయటపెడితే, దానిని చూడాలని ప్రయత్నించే ఎవరైనా అక్కడ చిక్కుకుపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.

దక్షిణ ఉటాలో పర్వతప్రాంతాల్లో నివసించే పెద్ద కొమ్ముల గొర్రెల సంఖ్యను అధికారులు లెక్కిస్తూ ఉంటారు.

ఇప్పటివరకూ ఈ శిలను అక్కడ తామే ఏర్పాటుచేశామని ఎవరూ ప్రకటించలేదు.

దీనికి సమాధానాలు వెతికేందుకు ఉటా హైవే పెట్రోల్ సోషల్ మీడియా సహకారం తీసుకుంది.

"విచారణలో భాగంగా దీని గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఏంటిది, ఎవరైనా చెప్పగలరా?" అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

ఎవరైనా శిల్పి అక్కడ ఆ శిలను అక్కడ ఏర్పాటుచేసి ఉంటారని చాలామంది భావిస్తున్నారు. ఇది జాన్ మెక్‌క్రాగెన్ కళాఖండంలా కనిపిస్తోందని మరికొందరు చెబుతున్నారు. ఆయన 2011లో చనిపోయారు.

ఇప్పుడు అదృశ్యమైపోయిందా?

అయితే... గత వారం ఉటా ఎడారిలో కనుగొన్న ఈ అంతుచిక్కన ఏకశిల ఇప్పుడు అదృశ్యమైనట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు.

ఎవరో గుర్తుతెలియని వారు దానిని తొలగించినట్లు తమకు విశ్వసనీయ సమాచారం అందిందని ఉటా బ్యూరో ఆఫ్ లాండ్ మేనేజ్‌మెంట్ చెప్పింది.

తాజాగా ఆ శిలకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోల్లో అది ఉన్న చోట ఒక రాళ్ల కుప్ప, చిన్న లోహపు ముక్క మాత్రమే మిగిలాయి.

అంతుచిక్కని ఈ పన్నెండు అడుగుల లోహ శిలను చూడటానికి కొన్ని రోజులుగా పదుల సంఖ్యలో వచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)